గుమ్మడిదల, జనవరి 20 : ప్లాస్టిక్ మల్చింగ్ విధానంతో వివిధ కూరగాయలు, పూల సాగు చేసి మంచి దిగుబడులు సాధించవచ్చని ఉద్యానవనశాఖ ఆధికారులు రైతులకు సూచనలిస్తున్నారు. గుమ్మడిదల మండల కేంద్రంతో పాటు కానుకుంట, కొత్తపల్లి, నల్లవల్లి గ్రామాల్లో బెండ కూరగాయ పంటను ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో డెమో ప్లాంట్ ఏర్పాటు చేసి మల్చింగ్ పద్ధతిలో సాగు చేసి రైతులకు అధిక దిగుబడి తీసి చూపించారు. మల్చింగ్ విధానంతో టమాటా, వంకాయ, బెండ, కాకర, మిర్చి, ఆలుగడ్డ, బంతి, రకరకాల పూలు సాగు చేయవచ్చని ఉద్యాన వనశాఖ అధికారులు పేర్కొంటున్నారు. అధిక దిగుబడి, తక్కువ ఖర్చుతో నాణ్యమైన కూరగాయ పంటలను పండించవచ్చని సంగారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారిణి సునీతా, పటాన్చెరు నియోజకవర్గ ఉద్యానశాఖ అధికారిణి శైలజ అంటున్నారు.
కూరగాయ పంటల సాగులో ప్లాస్టిక్ మల్చింగ్ విధానం
మొక్కల చుట్టూ ఉండే వేర్ల భాగాన్ని ఏవేని పదార్థాలతో కప్పడాన్ని ‘మల్చింగ్’ అంటారు. ఈ పద్ధతికి వరి, రంపపు పొట్టు, చెరుకు పిప్పి, ఎండిన ఆకులు, చిన్నచిన్న గులక రాళ్లు మొదలైన వాటిని వాడుతారు. కానీ వీటి లభ్యత రానురాను తగ్గుతున్నందున వల్ల ప్లాస్టిక్ షీటుతో మల్చింగ్ వేయడం ప్రస్తుతం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంటున్నది. ప్లాస్టిక్ షీటుతో మొక్క చుట్టూరా కప్పుతుండడంతో దీన్ని ‘ప్టాస్టిక్ మల్చింగ్’ అంటారు.
లాభాలు
మొక్కచుట్టూ తేమను ఆవిరి కాకుండా నివారించడం వల్ల వివిధ కాలపరిమితులు ఉన్న పంటలకు 30 నుంచి 70 శాతం వరకు నీరు ఆదా అవుతుంది. ప్లాస్టిక్ మల్చింగ్కు బిందుసేద్యం పధ్ధతిని పాటిస్తే అదనంగా 20 శాతం నీరు మిగులుతుంది. అందువల్ల పంటలకు 2-3శాతం నీటి తడులు తగ్గుతాయి.
కలుపు నివారణ
సూర్యరశ్మిని నేరుగా కలుపు మొక్కలకు సోకకుండా చేయడం వలన సుమారు 85శాతం వరకు కలుపు నివారణ అవుతుంది. తద్వారా పర్యావరణ సంరక్షణ జరుగుతుంది.
మట్టి కోత నివారణ
వర్షపు నీరు నేరుగా భూమిపై పడకపోవడం వల్ల మట్టికోతను నివారిస్తుంది. ఇది భూసారాన్ని పరిరక్షిస్తుంది. భూమిలో చీడ పీడల నివారణ.పారదర్శక ఫిల్మును యాసంగి సీజన్లో భూమిపై పరచి సూర్యరశ్మిని ప్రసరింపజేసి భూమిలోని క్రిమికీటకాలు, గుళ్లను నివారిస్తుంది. ఈ ప్రక్రియను ‘సాయిల్ సొలరైజేషన్’ అంటారు.
నాణ్యతతో కూడిన అధిక దిగుబడులు.మొక్కకు దాని జీవిత కాలమంతా అనుకూల సూక్ష్మ వాతావరణ పరిస్థితులు ఉండడంతో ఏపుగా పెరిగి మంచి నాణ్యతతో 60 శాతం అధిక దిగుబడులను పొందవచ్చు. ప్లాస్టిక్ మల్చింగ్ షిట్లు వివిధ రంగుల్లో లభిస్తాయి. నలుపు, తెలుపు, ఎరుపు, ఊదా, ఆకుపచ్చ, వెండి రంగు, పసుపు పచ్చ, రెండువైపులా వేర్వేరు రంగులున్నవి కూడా లభిస్తాయి. నలుపు తెలుపు, నలుపు పసుపు, నలుపు వెండి రంగులున్న ఒక్కొక్క రంగు షిటు ఒక్కొక్క పంటకు, వివిధ కాలాల్లో ఉపయోగించవలసి ఉంటుంది. టమాటాకు ఎరుపు , నలుపు , ఆకుపచ్చ మల్చింగ్ షిట్లు వాడితే అధిక దిగుబడి పొందవచ్చు. సిమ్లా మిర్చికి ఎరుపు రంగు, కాలి ఫ్లవర్కు నలుపు, క్యాబేజీకి పసుపు రంగు షిట్లతో అధిక దిగుబడులు వస్తాయి. కొబ్బరి చెట్లకు వెండి రంగు మల్చింగ్ షీట్లను కాండానికి తొడిగితే మొవ్వ పురుగును నివారించవచ్చు. అలాగే, వేసవికాలంలో తెలుపు రంగు షీటును, శీతాకాలంలో నలుపు రంగు షీటును వాడాలి. ప్లాస్టిక్ మల్చింగ్ షీట్లు 7 నుంచి 2 వందల మైక్రాన్ల మందంలో 1.5 నుంచి 3.0 మీటర్ల వెడల్పులో లభిస్తాయి. ఈ షీట్లు మైక్రాన్లు, గేజీల పద్ధతిలో లభిస్తాయి.
మల్చింగ్ వేసే విధానం ..
కూరగాయలు, పండ్ల మొక్కలకు ఇరువైపులా 5-10 సెం.మీ లోతు గాడీ చేయాలి. మల్చింగ్ షీటును కావలసిన సైజులో కత్తిరించుకోవాలి. షీటును ప్రతీ వరుసలో మరీ వదులుగా కాకుండా మరీ బిగువుగా లేకుండా కప్పి అన్ని చివరలను గాడీలోకి పోయేటట్లు మట్టిని కప్పాలి. ఈ పద్ధతిని ‘యాంకరింగ్ ’అంటారు. దీనివల్ల షీటు గాలికి చెదిరిపోకుండా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
షీటును బలంగా లాగొద్దు. వేడిలేని సమయాల్లో అనగా ఉదయం లేక సాయంత్రం వేళల్లో మాత్రమే షీటు వేయాలి. వేడి అధికంగా ఉన్నప్పుడు వేస్తే దీనికి సాగే గుణం ఉంటుంది కాబట్టి షీటు వ్యాకోచం చెందే అవకాశం ఉంటుంది. ఎక్కువ గాలి ఉన్నపుడు (గంటకు 8 కి.మీ కంటే ఎక్కువ) మల్చి వేయరాదు. పంట కాలం తర్వాత మల్చి షీటును పొలం నుంచి తీసి వేసి పొలం పనులు చేసుకోవాలి.
విత్తుటకు ముందు..
మొక్క, మొక్కకు.. వరుస వరుసకు మధ్య దూరాన్ని బట్టి ముందే షీటును ప్రతి వరుస పైన రంధ్రాలు చేయాలి. ఈ షీటును ప్రతి వరుస మీద పైన తెలిపిన విధంగా పరిచి ‘యాంకరింగ్’ చేయాలి. రంధ్రాలు ద్వారా ఒక్కొక్క విత్తనం వేసి మట్టితో కప్పాలి. ఆ తర్వాత నీరు పెట్టాలి. ఈ విధంగా చేస్తే సుమారు 20 శాతం విత్తనాలు ఆదా అవుతాయి.
నాటిన పైరుకు..
మొక్కచుట్టూ పరిచేందుకు అనుకూలంగా షీటును ముందుగా
తగిన సైజులో కత్తిరించుకోవాలి. ఆ తర్వాత షీటుపై మొక్కల దగ్గర చిన్న చిన్న రంధ్రాలు చేసి వాటిని తొడిగి, అన్ని చివరలనూ యాంకరింగ్ చేయాలి.
మల్చింగ్ షీటు లక్షణాలు
మల్చింగ్ విధానంతో మంచి లాభాలు
మల్చింగ్ విధానంతో నీరు ఆదాఅవడంతో పాటు ఎరువులు ఖ ర్చు తగ్గుతుంది. పంటకు చీడతెగులు సోకకుండా నివారించవచ్చు. జహీరాబాద్లో పలురకాల కూరగాయల పంటలు, గుమ్మడిదల మండల కేంద్రం, నల్లవల్లిలో టమాటా పంటను మల్చింగ్ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఎకరంలో మల్చింగ్ షీటు వేసేందుకు రూ.13 వే లు ఖర్చు అవుతుంది. ఇందులో సగం ఉద్యానవనశాఖ ద్వారా స బ్సిడీ పొందవచ్చు. రైతులకు కూరగాయల మొక్కలను కూడా అందిస్తున్నాం. ఏ రకం కూరగాయ మొక్కలు అవసరమో వాటి కోసం 30 రోజుల ముందు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. మల్చింగ్తో నాణ్యమైన పంటతో పాటు అధికంగా దిగుబడి సాధించవచ్చు.