మారేడ్పల్లి : స్వచ్చ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడడంతో పాటు, నగర అభివృద్ధిలో రాజీపడకుండా ముందుకు సాగుతున్నామని రాష్ట్ర పశుసంవర్థక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
బుధవారం మోండా మార్కెట్ లో నూతనంగా నిర్మించిన మోడరన్ టాయిలెట్ను స్థానిక కార్పొరేటర్ కొంతం దీపికతో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ…బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన చేయకుండా నివారించేందుకు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో 1950 టాయిలెట్లను నిర్మించడం జరిగిందని చెప్పారు.
వీటిలో 352 టాయిలెట్ల నిర్వహణను బీఓటీ పద్దతిలో అప్పగించడం జరిగిందని తెలిపారు. మోండా మార్కెట్ డివిజన్లో నేడు 353వ మోడరన్ టాయిలెట్ను ప్రారంభించడం జరిగిందన్నారు. వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకుంటూ..జీహెచ్ఎంసీ సిబ్బందికి సహకరిస్తూ పారిశుద్ధ్య నిర్వాహణ లో భాగస్వాములు కావాలని కోరారు.
ఓల్డ్ జైలు ఖానా వద్ద మరో మోడరన్ టాయిలెట్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే 4500 స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసి ఇంటింటికి వెళ్లి చెత్తను సేకరిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.
జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో పారిశుధ్ధ్య కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు అవార్డులను అందజేసిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, డీసీ ముకుందరెడ్డి, ఈఈ సుదర్శన్, వాటర్ వర్క్ జీఎం రమణారెడ్డి, టౌన్ప్లానింగ్ ఎసీసీ క్రిష్టోఫర్, కార్పొరేటర్ కొంతం దీపిక, మాజీ కార్పొరేటర్ ఆకుల రూప తదితరులు పాల్గొన్నారు.