కొల్చారం, అక్టోబర్ 19 :యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్నది… ఊరూరా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు. వానకాలం వరిపంట కోతలు ప్రారంభమయ్యాయి. కోతలు పూర్తి కాగానే దుక్కులు దున్ని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడానికి రైతులు సిద్ధమౌతున్నారు. ఆరుతడి పంటలైన నూనె గింజలు, అపరాలు, ఇతర ఆహారధాన్యాలను పండించడం వల్ల ప్రయోజనాలున్నాయి. ఆరుతడి పంటలను సాగు చేయడం వల్ల పెట్టుబడి తగ్గడంతో పాటు ఎరువుల వినియోగం తగ్గుతుంది. క్రిమి సంహారక మందుల వినియోగం తక్కువగా ఉంటుంది. ఆరుతడి పంటల సాగుతో భూసారం పెరుగనున్నది. ప్రత్యామ్నాయ పంటలకు మార్కెట్లో డిమాండ్ ఉండడంతో ఎక్కడైనా విక్రయించుకునే అవకాశం ఉంటుంది. ప్రత్యామ్నాయ పంటల్లో అపరాలు, నూనె గింజలు, కూరగాయలు సాగు చేసుకోవచ్చు. వీటిలో ప్రధానంగా వేరుశనగ, పొద్దు తిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదం,(నూనె గింజలు) మొక్కజొన్న, జొన్నలు, పెసర, మినుము, శనగ, బెబ్బర( అపరాలు), కొత్తిమీర, ఉల్లిగడ్డ, ఆలుగడ్డ, పచ్చిమిరప,( కూరగాయ పంటలు)లను సాగు చేయడంతో రైతులకు లాభదాయకంగా ఉంటుంది.
వేరుశనగ రకాలు: కదిరి -6, కదిరి -1812, టీఏజీ -24 ఈ పంటను సెప్టెంబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 40 కిలోల విత్తనం అవసరమౌతుంది. మార్కెట్లో వేరుశనగ క్వింటాకు ధర రూ. 5,500 పలుకుతున్నది.
పొద్దు తిరుగుడు రకాలు : కేబీఎస్హెచ్-44, ఎస్డీఎస్హెచ్-1, డీఆర్ఎస్హెచ్-1,కేబీఎస్హెచ్-78 నవంబర్ 1వ నుం చి డిసెంబర్ 30 వరకు, జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15వ వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 2.5 కిలోల నుంచి 3 కిలోల విత్తనాలు పడుతాయి. ఈ పంట మార్కెట్లో క్వింటాకు ధర రూ. 5,900 పలుకుతున్నది.
కుసుమ రకాలు : టీఎస్ఎఫ్-1, మంజీర, టీఎస్ఎఫ్-764, సాగర ముత్యాలుఈ పంటను అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరాకు నాలుగు కిలోల విత్తనాలు అవసరమౌతాయి. ప్రస్తుతం క్వింటాకు కుసుమలు ధర రూ.4,600 పలుకుతున్నది.
ఆముదం రకాలు: ప్రగతి, హరిత, పీసీహెచ్-111, డీసీహెచ్-177, డీసీహెచ్-519, జీసీహెచ్-4, ఐసీహెచ్-66 ఈ విత్తనాలు సెప్టెంబర్ 15 నుంచి అక్టోబర్ 15 వరకు మాత్రమే విత్తుకోవాలి. ఎకరానికి 2 నుంచి 2.5 కిలోల విత్తనం అవసరమౌతుంది. మార్కెట్లో క్వింటాకు ధర రూ.4,500 ఉంది.
నువ్వులురకాలు: శ్వేత, హిమ,రాజేశ్వరి, చందన, గౌరీ, జేసీఎస్ఈ పంటను జనవరి 15 నుంచి ఫిబ్రవరి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 2.5 కిలోల విత్తనాలు అవసరమౌతాయి. మార్కెట్లో క్వింటాకు నువ్వులు రూ.7,600 ధర పలుకుతున్నది.
ఆవాలు రకాలు: పూసా, ఆగ్రాని, వరుణ, పూసమహాక్, నరేంద్ర అగేతి అక్టోబర్ 1 నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు.
శనగ రకాలు: దేశవాళీ రకాలు( జేజీ-11, జేఏకేఐ-9218, నంద్యాల శనగ-1, నంద్యాల శనగ-47), కాబుళి రకాలు(కేఏకే-2, విహార్, నంద్యాలశనగ-810) అక్టోబర్ 1నుంచి నవంబర్ 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి దేశవాళీ రకాలైతే 25 కేజీల నుంచి 35 కిలోల, కాబుళి రకాలైతే 45కిలోల నుంచి 60 కిలోల విత్తనాలు అవసరమౌతాయి. శనగలు క్వింటాకు ధర రూ.4,900 మార్కెట్లో పలుకుతున్నది.
పెసర రకాలు: ఎంజీజీ-295,డబ్ల్యూజీజీ-37, టీఎమ్ 96-2, ఎంజీజీ-348, ఎంజీజీ-347,ఎంజీజీ-351, డబ్ల్యూజీజీ-42 ఈ పంట నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు, ఫిబ్రవరి 1 నుంచి మార్చి 15 వరకు విత్తుకోవచ్చు. ఎకరానికి 12 నుంచి 14 కిలోల విత్తనాలు అవసరమౌతాయి. క్వింటాకు పెసర ధర రూ.6,600 పలుకుతున్నది.
రైతులకు అవగాహన కల్పించాం..
వచ్చే యాసంగిలో వరి పంట సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసుకోవాలని ప్రభుత్వ ఆదేశాల ప్రకారం రైతులకు అవగాహన కల్పించాం. మండలంలో అయిదు క్లస్టర్లు ఉండగా, అన్ని క్లస్టర్లలో రైతులకు సూచించాం. ప్రభుత్వం నుంచి వచ్చే మార్గదర్శకాల ప్రకారం రైతులకు సూచనలిస్తాం. -బాల్రెడ్డి, మండల వ్యవసాయాధికారి, కొల్చారం