నర్సాపూర్, ఆగస్టు 25 : పంట పొలంలో కలుపుతీయడానికి తండ్రి జాట్రోత్ సోమ్లా పడుతున్న కష్టాన్ని చూడలేక ఓ గిరిజన పుత్రుడు సైకిల్ వీడర్(కలుపు యంత్రం)ను తయారు చేసి, అందరి మన్ననలను పొందుతున్నాడు. వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఖాగజ్మద్దూర్ గ్రామం పెద్దమ్మతండాకు చెందిన జాట్రోత్ రవి నాయక్ ఎంఏ, ఎంఎల్ఐఎస్సీ పూర్తి చేసి, ప్రస్తుతం ఎల్ఎల్బీ చేస్తున్నాడు. రవినాయక్ది సాధారణ రైతు కుటుంబం. కుటుంబ సభ్యులతో కలిసి వారికున్న 2.5 ఎకరాల పొలం పనుల్లో ఆసరాగా నిలిచేవాడు. వీరు ఎక్కువగా పత్తి, కూరగాయలు సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సాధారణంగా కూరగాయల పంటలో కలుపు తీయాలంటే 10 మంది కూలీలతో పని చేయించాల్సి ఉంటుంది. పైగా ఖర్చు, సమయం కూడా ఎక్కువగా అయ్యేది. ఇదంతా గ్రహించిన రవి నాయక్ వ్యవసాయాధికారులను సంప్రదించి, పలు సూచనలను తీసుకున్నాడు. యూట్యూబ్లో కలుపు నియంత్రణకు కావాల్సిన యంత్రం గురిం చి అన్వేషించాడు. ఇనుప వస్తువులతో వెల్డింగ్ షాపునకు వెళ్లి, స్వయంగా సైకిల్ వీడర్ను తయారు చేశాడు. ఎనిమిది మందితో చేసే పనిని ఈ పరికరంతో ఒక్కడే చేయవచ్చు. నేలను బట్టి రోజుకు ఎకరా పొలంలో గడ్డి కలుపును తీయవచ్చు. నల్లరేగడి నేలలో త్వరగా కలుపుతీయడానికి ఈ పరికరం ఎంతగానో సహాయపడుతుంది. ఈ పరికరం తయారీకి కేవలం రూ.2700 అయ్యిందని రవి నాయక్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లాలో నిర్వహించిన ఎగ్జిబిషన్లో ఈ సైకిల్ వీడర్ను రవినాయక్ ప్రదర్శించి, కలెక్టర్ హరీశ్ నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. పవర్ వీడర్ తయారీకి రూ.30 నుంచి రూ.50 వేల ఖర్చు కాగా, సైకిల్ వీడర్కు కేవలం రూ.2వేల నుంచి రూ.3వేల వరకు ఖర్చు అవుతుంది. రవినాయక్ను ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఇలాంటి ఆవిష్కరణలు ఎన్నో చేసి రైతులకు ఉపయోగకారిగా ఉంటాడని పలువురు అభిప్రాయపడుతున్నారు.
సైకిల్ వీడర్ తయారీలకు ప్రభుత్వం ఆర్థికంగా సహకరిస్తే రైతులకు అందించి అధిక దిగుబడి సాధించడానికి కృషి చేస్తా. పరిశ్రమ స్థాపనకు కృషి చేయడానికి ప్రభుత్వం ఆదుకోవాలి. తక్కువ సమయంలో, తక్కు వ ఖర్చుతో కలుపు తీయడానికి ఈ సైకిల్ వీడర్ ఎంతగానో దోహదపడుతుంది. సైకిల్ వీడర్ తయారీతో మా నాన్న కండ్లలో సంతోషాన్ని చూశా. ఇంకా ఇలాంటి ఆవిష్కరణలు చేయడానికి కృషి చేస్తా.