సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో రూపుదిద్దుకున్న క్షేత్రం
ఆయన సూచనల మేరకే పనులు పూర్తిచేసిన ట్రస్టు సభ్యులు
రూ.8 కోట్లతో పూర్తయిన ఆలయ పనులు
ఆలయ ప్రారంభం నుంచి కొనసాగుతున్న నిత్య పూజలు
సీఎం చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు
దుబ్బాక టౌన్, మార్చి 23 : దుబ్బాక వేంకటేశ్వరాలయం అత్యంత అద్భుతంగా నిర్మాణం పూర్తి చేసుకుంది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో సకల హంగులతో రూపుదిద్దుకున్నది. ఆలయ ప్లానింగ్.. వాస్తు.. ప్రధానాలయంలో వేయించిన ఫ్లోరింగ్ టైల్స్, మార్బుల్స్ ఎంపికలోనూ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపారు. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు ఆలయ ట్రస్టు సభ్యులు సీఎం కేసీఆర్కు తెలియజేయగా, రూ.8కోట్లతో ఆలయం పూర్తయింది. ఇందులో రూ.5.50కోట్లు ముఖ్యమంత్రి అందజేశారు. శాశ్వత అధ్యక్షుడు, ఎంపీ ప్రభాకర్రెడ్డి, టీఆర్ఎస్ నేత మద్దుల నాగేశ్వర్రెడ్డి తదితరులు చేయూతనందించారు. మే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ సన్నిహితుడు, ట్రస్టు సభ్యుడు రొట్టె రాజమౌళి పంతులు తెలిపారు.
తెలంగాణ రాష్ర్టానికే తలమానికంగా వెలసిల్లే లక్ష్మీసహిత వేంకటేశ్వరాలయం(బాలాజీ దేవాలయం) సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో నిర్మాణం పూర్తి చేసుకున్నది. సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో ఆలయం రూపుదిద్దుకుంది. స్థానిక బస్డిపో పక్కన రెండెకరాల స్థలంలో టీటీడీ ప్లానింగ్, వాస్తు ప్రకారం నిర్మాణం చేపట్టారు. ఆలయ నిర్మాణ ట్రస్టులో ఎక్కువ మంది సభ్యులు ముఖ్యమంత్రితో కలిసి చదువుకున్న వారే ఉండగా, నిర్మాణ విషయాన్ని ఎప్పటికప్పుడూ సీఎంకు వివరిస్తూ వచ్చారు. 2009 నవంబర్ 1న దుబ్బాక బాలాజీ దేవాలయ నిర్మాణానికి చినజీయర్ స్వామి భూమి పూ జ చేశారు. అప్పటి నుంచి తరచూ ట్రస్టు సభ్యులు సీఎం కేసీఆర్ను కలిసి ఆలయ నిర్మాణ దశలను వివరించారు. 2015 జనవరిలో దుబ్బాక పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ ఆలయాన్ని సందర్శించారు. పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. సుమారు అరగంటకు పైగా అక్కడ సమీక్షించారు. దేవాదాయ శాఖ నుంచి రూ.3 కోట్ల నిధులు అందజేయాలని అప్పటి కలెక్టర్ను ఆదేశించారు. దాని తర్వాత ఆలయ నిర్మాణంలో వేగం పుంజుకొని, నేడు తుది దశకు చేరుకుంది.
సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో..
దుబ్బాక బాలాజీ దేవాలయ నిర్మాణం సీఎం కేసీఆర్ పర్యవేక్షణలో జరిగింది. ఆలయ ప్లానింగ్.. వాస్తు.. ప్రధానాలయంలో వేయించిన ఫ్లోరింగ్ టైల్స్, మార్బుల్స్ ఎంపికలోనూ ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ ఉంది. నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్కు ఆలయ ట్రస్టు సభ్యులు తెలియజేస్తూ వచ్చారు. సీఎం కేసీఆర్ సలహాల మేరకు ఆలయ పనులను ట్రస్టు సభ్యులు పూర్తిచేశారు. ఆలయ నిర్మాణానికి ఇప్పటి వరకు సుమారుగా రూ.8 కోట్లు ఖర్చు కాగా, అందులో సీఎం రూ.5.50 కోట్లు అందజేసినట్లు ట్రస్టు చైర్మన్ వడ్లకొండ శ్రీధర్ తెలిపారు. శాశ్వత అధ్యక్షుడిగా ఉన్న మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో పాటు టీఆర్ఎస్ నేత మద్దుల నాగేశ్వర్రెడ్డి తదితరులు తమకు తోచిన విధంగా చేయూతనందించారు. సీఎం కేసీఆర్ సూచనల మేరకు ఎంపీ ప్రభాకర్రెడ్డి సైతం ఆలయ నిర్మాణ పనులను తరుచూ పర్యవేక్షిస్తున్నారు. ఆలయ నిర్మాణం పూర్తికావడంతో మూలవిరాట్టుల ఏర్పాటుకు ట్రస్టు సభ్యులు సిద్ధమవుతున్నారు. మే నెలలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఆలయాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ సన్నిహితుడు, ట్రస్టు సభ్యుడు రొట్టె రాజమౌళి పంతులు తెలిపారు.
తమిళనాడు నుంచి మూలవిరాట్టులు..
దుబ్బాక బాలాజీ దేవాలయంలో ప్రతిష్ఠించే లక్ష్మీసహిత వేంకటేశ్వరుని విగ్రహాలు తమిళనాడులోని మహాబలిపురంలో తయారు చేయించారు. ఉత్సవ విగ్రహాలను కుంభకోణంలో తయారు చేయించగా, ఆలయం ముందు ప్రతిష్ఠించే ధ్వజ స్తంభాన్ని నల్లమల అడవుల నుంచి తెప్పించారు. ఆలయ నిర్మాణం ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దబడింది. ప్రధాన గోపురం, ఆలయం, వివిధ దేవతామూర్తుల ఆలయాలు, ప్రధాన ఆ లయం చుట్టూ గార్డెన్, చిన్నపిల్లల పార్కు, ఆఫీసు గది, డైనింగ్హాల్, నీటి గుండం వంటి పనులను భక్తి పారవశ్యం కలిగించే స్థాయిలో నిర్మించారు. ఆలయంలో కల్యాణమండపం, అర్చకుల గదులు, లేబర్ గదులు నిర్మించాల్సి ఉంది.
కొనసాగుతున్న నిత్య పూజలు…
ఆలయ నిర్మాణం ప్రారంభం నుంచి ఇక్కడ నిత్య పూజలు జరిపిస్తున్నారు. ఏటా కార్తీకమాసంలో దీపారాధన వైభవంగా నిర్వహిస్తున్నారు. అలాగే, టీటీడీ ఆధ్వర్యంలో జరిగే పూజా కార్యక్రమాలనూ జరుపుతున్నారు. వైకుంఠ ఏకాదశి నాడు భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. ప్రధాన పండుగల సమయంలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై, పూజల్లో పాల్గొంటున్నారు.