Congress | తిమ్మాపూర్, ఏప్రిల్ 29: తల్లికి కులం లేదు. తల్లి పాలకు మతం లేదు. తల్లికి పదవులతో పని లేదు. రాజకీయం అంతకంటే అక్కర్లేదు. కానీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడం అలవాటైన కొందరికి అధికారం చేజిక్కితే, తల్లీ, చెల్లీ, భార్య ఎవరూ గుర్తుండరేమో! ఓట్లు, సీట్లు మాత్రమే కండ్ల ముందు కనపడుతున్నప్పుడు, ఏది సభ్యతో, ఏది అసభ్యతో అర్థం కాదు. పేగులు మెడలో వేసుకుని తిరుగుతామనే వారి అనుయాయులకు తల్లి పేగు బంధం విలువ ఎట్ల తెలుస్తుంది? తానీ కులంలో పుట్టాలని ఎవరూ ఎంచుకుని పుట్టరు. కులమే అధికార సోపానమని భావించేవారు, కులమే కక్ష సాధింపునకు ఆయుధమని నమ్మేవారు, కులాన్ని బట్టి గుణాన్ని ఆపాదించే దుర్మార్గులు రాజ్యమేలుతున్నప్పుడు.. కులం శాపం కాక మరేమవుతుంది. సరిగ్గా అదే జరిగింది. అధికారం తలకెక్కింది. తరతరాలుగా సామాజిక వివక్ష అనే శాపంతో సతమతమవుతున్న దళిత సోదరుల పట్ల, వారి జీవిత భాగస్వాముల పట్ల కాంగ్రెస్కు చెందిన ఒక నాయకుడు తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అభ్యంతరం అనేకన్నా దళిత కుటుంబాల పట్ల ఇది అపచారమన్నది తగిన మాటేమో! మానకొండూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సోదరుడు ప్రకాశ్ సోమవారం దుర్మార్గంగా మా ట్లాడారు. యావత్తు దళిత జాతిని దళిత సోదరులను అవమానించే వ్యాఖ్యలు చేశారు. దళితులకు ఓటును అమ్ముకుంటారనే అపఖ్యాతి ఉన్నదని చెప్తూ ఆయన దళిత సమాజం గురించి అనరాని మాటలు అన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ దళితుల సమావేశానికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సి ఉండగా.. ఆయన జమ్మికుంటలో సీఎం ప్రో గ్రాం ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. దీంతో ఆయన సోదరుడు కవ్వంపల్లి ప్రకాశ్ దళితుల సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భం గా అక్కడున్న నాయకులు ఆయనను మాట్లాడాలని కోరారు.
మైక్ తీసుకున్న ప్రకాశ్… ‘స్టేజ్పైన మాట్లాడే అవకాశం నాకెప్పుడూ రాలేదు. చాలా తక్కువసార్లు మాట్లాడాను’ అంటూ మొదలుపెట్టిన ప్రకాశ్.. తర్వాత ఘోరంగా మాట్లాడారు. ‘అమ్ముడుపోయే జాతి అని చెప్పేసి, మనపై ఒక ముద్ర ఉన్నది. వెయ్యి రూపాయలకు ఓటు అమ్ముకుంటరు. ఇంకో సున్నా కలిపితే ఇంకోటి అమ్ముకుంటరు. ఇంకో సున్నా కలిపితే ఇంకోటి అమ్ముకుంటరు. ఇంకో సున్నా కలిపితే ఇంటి ఇల్లాలిని కూడా అమ్ముకుంటరు అనే అపప్రథ మనమీద ఉన్నది’ అంటూ అభ్యంతరకరంగా మాట్లాడారు. (దళిత జాతి గురించి దళిత సహోదరుల గురించి ప్రకాశ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను వేయడానికి మనసొప్పని పరిస్థితి. వీటిని ప్రచురించాలా? వద్దా? అన్నదానిపై ‘నమస్తే తెలంగాణ’ పత్రిక ఎడిటోరియల్ బోర్డులో సుదీర్ఘ చర్చ జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత నాలుగు నెలలుగా వివిధ స్థాయిల కాంగ్రెస్ నేతలు సమాజంలోని వివిధ వర్గాలపై విషం చిమ్మే వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతల ధోరణిని దళిత సోదరులు, సమాజం దృష్టికి తేవటం కోసం, ఇబ్బందికరమే అయినా ఈ వ్యాఖ్యల్ని ప్రచురించాలని నిర్ణయం తీసుకోవడమైంది) ప్రకాశ్ మాటలు విన్న సభలోనే ఉన్న దళిత సోదరులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓటు ను అమ్ముకోకుండా సద్వినియోగం చేసుకోవాలని చెప్పడానికి ఇలాంటి మాటలు మాట్లాడాల్సిన అవసరం ఉన్నదా? అని విస్తుపోయా రు.
ఏ సభకు వచ్చారు? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నారు? అని వారు ఆగ్రహంగా చర్చించుకున్నారు. దళిత సామాజికవర్గానికే చెందిన నాయకుడే ఇలా దళితజాతిని కించపరిచే రీతిలో మాట్లాడటం ఏమిటని ఆవేదన చెందారు. దళిత నాయకులే తమ జాతి గురించి ఇలా నిందాపూర్వకంగా మాట్లాడితే, ఇక మిగతా వారి గురించి చెప్పేదేముందని ఆక్రోశించారు. ‘అయినా ఓట్లకు డబ్బులు తీసుకోవాలా? వద్దా? అనేది వ్యక్తిగత వ్యవహారం. అది కులాన్ని బట్టి ఉంటుందా? సమాజంలో ఒక్క దళితులే ఓట్లు అమ్ముకుంటున్నారా? మిగతా కులాల వారంతా పత్తిత్తులా? ఐట్లెతే మరి ఎన్నికలకు రాజకీయ పార్టీలకు ఇంత ఖర్చు ఎందుకవుతున్నది? కులం ఆధారంగా ఇలా ముద్ర వేయడం ఎంతమాత్రం సరికాదు’ అని ఒక దళిత యువకుడు ఆగ్రహం వ్యక్తం చేసారు. ‘ఓట్లు ఆమ్ముకుంటున్నారని మమ్మల్ని తప్పుబడుతున్నారు. మరి కొనుక్కుంటున్నవాళ్ల సంగతేమిటి? ఇవాళ మాట్లాడుతున్నవాళ్లు ఎన్నికల్లో ఖర్చు పెట్టుకోకుండా, ఓట్లు కొనుక్కోకుండానే గెలిచారా? మరి వాళ్లనేమనాలి’ అని మరో నడివయస్కుడు దునుమాడారు. ప్రకాశ్ మాట్లాడిన మాటలు అటు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి. దళిత సమాజంలో పెను చర్చకు దారితీశాయి. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే కాంగ్రెస్ నాయకులు రైతుల మీద, బీసీల మీద, నేతన్నల మీద నోటికొచ్చినట్టు మాట్లాడారని, ఇప్పుడు దళితుల వంతు వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
రైతుబంధు డబ్బులు పడలేదన్న వారిని చెప్పుతో కొట్టండి.
– రైతుబంధు గురించి రైతులు అడుగుతున్నారన్న ప్రశ్నకు సమాధానంగా మంత్రి కోమటిరెడ్డి (జనవరి 23, 2024)
బతుకమ్మ చీరలతో ఆరేండ్లు మీరంతా దొబ్బితిన్నరు. ఇంకేం ఆర్డర్లు కావాలె? పాపడాలు, నిరోధ్లు అమ్ముతున్నరా?
-ఉపాధి కోల్పోయామన్న సిరిసిల్ల నేతకార్మికులను ఉద్దేశించి కాంగ్రెస్ నేత కేకే మహేందర్రెడ్డి (మార్చి4, 2024)
బీసీలకు దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే.. చేవెళ్ల ఎంపీగా బీసీ అభ్యర్థిని గెలిపించి చూపెట్టుండ్రి. మీరు ఓట్లకు, బూట్లకు ఆశపడకపోతే.. మీకు నిజాయితీ ఉంటే
ఓ బీసీని గెలిపించుకోండి.
– చేవెళ్ల కాంగ్రెస్ నాయకుడు మోహన్రెడ్డి (ఏప్రిల్ 12, 2024)