హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): వరంగల్ నుంచి ఖమ్మం వరకు 120 కిలోమీటర్లు.. 8 అసెంబ్లీ నియోజకవర్గాలు.. సోమవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సుయాత్ర సాగింది. జననేత రాకను చూసి ఊరూరా ప్రజలు పులకించిపోయారు. అక్కడక్కడా ఆగి ప్రజలను పలుకరిస్తూ, వారితో మేమకమవుతూ కేసీఆర్ ముందుకు సాగడంతో జనం ఆనందతాండవం చేశారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు, వర్ధన్నపేట, పాలకుర్తి, మహబూబాబాద్, డోర్నకల్, పాలేరు, ఖమ్మం అసెంబ్లీ నియోజవకర్గాల పరిధిలోని గ్రామాలను తాకుతూ ఉన్న జాతీయ రహదారి గుండా రోజంతా కోలాహలం నెలకొన్నది. హన్మకొండలోని మాజీ మంత్రి కెప్టెన్ లక్ష్మీకాంతారావు ఇంటి నుంచి సాయంత్రం 4.45 గంటలకు కేసీఆర్ బయలుదేరారు. ఖమ్మం పట్టణం చేరుకోవడానికి మూడు గంటల సమయం పట్టింది. వర్ధన్నపేట నియోజకవర్గం కేంద్రం నుంచి ఖమ్మం జిల్లా కేంద్రానికి చేరేదాకా కేసీఆర్కు అడుగడుగునా జనం నీరాజనాలు పలికారు. కేసీఆర్ బస్సుపై పూలవాన కురిపించారు. ప్రజలు రోడ్డు మీదికి వచ్చి ‘జై తెలంగాణ.. జై కేసీఆర్’ అంటూ స్వాగతం పలికారు.
ఇసుకేస్తే రాలనంత జనం
హన్మకొండ నుంచి ఖమ్మం దాకా కేసీఆర్ వస్తున్నారని సమీప గ్రామాలు, ఆవాసాల నుంచి వచ్చిన జనం రోడ్డుకు ఇరువైపులా నిలబడి జై కేసీఆర్ అంటూ నినదించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. వర్ధన్నపేట, తొర్రూరు, మరిపెడ పట్టణాల్లో కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు ముందు ఇసుకేస్తె రాలనంత జనం రోడ్డుకు ఇరువైపులా చేరారు. వారి వద్దకు బస్సు రాగానే పూలవాన కురిసిందా అన్నట్టుగా కేసీఆర్పై పూలు చల్లారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అభిమానాలు పెద్ద ఎత్తున కేసీఆర్కు ఘనస్వాగతం పలికారు. మరిపెడలో మహబూబాబాద్ ఎంపీ, ప్రస్తుత బీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే హరిప్రియా నాయక్ కేసీఆర్కు మంగళహారతులతో స్వాగతం పలికారు.
వర్ధన్నపేటలో అపూర్వస్వాగతం
నియోజకవర్గ కేంద్రమైన వర్ధన్నపేట కేసీఆర్కు అపూర్వస్వాగతం పలికింది. మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ రెండుసార్లు ఈ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. గత ఎన్నికల్లో ఓడిన ఆయన ప్రస్తుతం వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మరోవైపు ఇదే నియోజకవర్గంలోని పర్వతగిరి గ్రామస్థుడైన ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య ఈ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్లిన ఇద్దరు నేతలకు చెందిన వర్ధన్నపేట నియోజకవర్గంలో ఐనవోలు క్రాస్ దగ్గర, వర్ధన్నపేట పట్టణంలో బీఆర్ఎస్ శ్రేణులు భారీ సంఖ్యలో చేరి కేసీఆర్కు అపూర్వ స్వాగతం పలికారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుది సైతం ఇదే నియోకవర్గం కావడం మరో విశేషం.
ఖమ్మం పొలిమేరల్లో ఘనస్వాగతం
ఖమ్మం పొలిమేరల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున స్వాగతం పలికాయి. తిరుమలాయపాలెం మండలం మాదిరిపురం నుంచి ఖమ్మం పట్టణం దాకా డప్పు చప్పుళ్లు, బోనాలు, బతుకమ్మలు, వివిధ వేషధారణలతో ఖమ్మం ప్రజలు, శ్రేణు లు అపూర్వస్వాగతం పలికారు.
ఎల్లంపేట క్రాస్ రోడ్ వద్ద ఆగిన కేసీఆర్
వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిలోని ఎల్లంపేట క్రాస్రోడ్డు పెద్ద జంక్షన్ కూడా కాదు. రోడ్డుకు ఇరువైపులా పట్టుమని ఇరవై ఇండ్లు కూడా లేవు. డోర్నకల్ నియోజకవర్గం మరిపెడ మండలంలోని ఎల్లంపేట క్రాస్ రోడ్డు సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ఆకట్టుకున్నది. చాయ్, బజ్జీలు, గారెలు దొరికే హోటల్. కేసీఆర్ కాన్వాయ్ ఆ హోటల్ ముందు ఆగడంతో దాని యజమాని సొంద్ సంబురానికి పట్ట పగ్గాల్లేవు.
సార్ ఆగుతడని అనుకోలేదు : సోంద్
‘కార్లు రయ్య్మ్రని పోతున్నాయి. ‘ఈరోజు కేసీఆర్ ఇట్లనే పోతడని అనంగ ఇన్న. నేను కడాయిల (మూకుడు) మిర్చీ ఏస్తున్న. పది ఇరవై కార్లు ముందుపోయినవి. తరువాత బస్సు. హోటల్ ముందుకు రాంగనే సార్ బస్సాపిండు. హోటల్ దగ్గరికి వచ్చిండు. పార్టీ వాళ్లందరినీ పక్కకు పోమ్మని చెప్పిండు. నా దగ్గరికి వచ్చి.. నీ పేరేంది అని అడిగిండు. సోంద్ సార్ అని చెప్పిన. నెలకు ఎంత సంపాదిస్తున్నవు అని అడిగిండు. ఆరేడు వేలు వస్తయి అని చెప్పిన. చాయ్ ఇస్తవా.. కాఫీ ఇస్తవా అన్నడు. ముందు మిర్చీలు ఇయ్యమని చెప్పిండు. రైతుబంధు వచ్చిందా అంటే రొండెకరాలున్న రైతుకు కూడా కాలేదని ఒకాయిన చెప్పిండు. రుణమాఫీ లేదు ఏం లేదు. రైతులు ఆగమైతాండ్లు అని ఓ ముసలాయిన సార్తోని ముచ్చటబెట్టిండు. కాఫీ ఇయ్యంగనే తాగిండు. సార్తోని దయాకర్రావు సార్ ఇంకా ఇద్దరు ముగ్గురున్నరు. వాళ్లకు కూడా కేసీఆర్ సారే తాగమని చెప్పిండు. అయిపోంగనే లేచి రూ.500 ఇచ్చిండు. కేసీఆర్ సార్ పది నిమిషాలు మా దగ్గర ఉన్నడు.
చేతులెత్తేసిన పోలీసులు
హన్మకొండ నుంచి ఖమ్మం బయలుదేరిన కేసీఆర్ బస్సు యాత్ర సందర్భంగా పోలీసులు అడుగడుగునా చేతులెత్తేసినట్టు వ్యవహరించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ బస్సు దగ్గరికి జనం పరుగులు పెట్టి వస్తుంటే వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తూ దూషణలకు దిగిన ఘటనలు చోటుచేసుకున్నాయి. తొర్రూరు పట్టణంలో కేసీఆర్ బస్సుకు ముందు ఉన్న కాన్వాయ్లోని భద్రతా కార్లు వెళ్లిపోయాక అటు నుంచి ఆర్టీసీ బస్సు వస్తున్నా అక్కడే ఉన్న పోలీసులు కనీసం దానిని ఆపే ప్రయత్నం చేయకపోవడం దారుణమని బీఆర్ఎస్ ఆగ్రహం వ్య క్తం చేసింది. జనం కోసం కేసీఆర్ ఆగారని, అదే సమయంలో రోడ్డుపై ఎదురుగా బస్సు వస్తున్నా పోలీసులు పట్టిచ్చుకోకపోవడంతో ప్రభుత్వం ఏం సంకేతం ఇస్తుందని పార్టీ శ్రేణులు మండిపడుతున్నారు.
ఎల్లంపేట స్టేజీ తండా వద్ద పులకించిన జనం
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసిన మహబూబాబాద్ ప్రాంత ప్రజలు పులకించిపోయారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ తండా, మరిపెడ మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు కేసీఆర్ వస్తున్నారని తెలిసి అకడకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఎల్లంపేట స్టేజీ తండా వద్ద సర్పంచ్ లాల్సింగ్ సహా రైతులు తమకు రైతుబంధు రావడం లేదని, రుణమాఫీ కాలేదని, నీళ్లందక పొలాలు ఎండిపోయినాయని కరెంటు రావట్లేదని కేసీఆర్ వద్ద తమ బాధను వ్యక్తం చేశారు.
కేసీఆర్కు గోడు వెళ్లబోసుకున్న మహిళారైతు
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజీ వద్ద హోటల్లో టీ తాగి వెళ్తున్న కేసీఆర్కు మహిళా రైతు గుగులోత్ జ్యోతి తన గోడు వెళ్లబోసుకున్నది.
గుగులోత్ జ్యోతి: సార్ నమస్కారం
కేసీఆర్: నమస్కారం చెప్పమ్మా
జ్యోతి: సార్ నా పొలం పట్టా కాలేదు సార్
కేసీఆర్: ఎన్ని ఎకరాలు
జ్యోతి: మూడెకరాలు. యాసంగి రెండెకరాలు పొలం చేస్తే నీళ్లు రాక ఎకరం ఎండింది.
కేసీఆర్: ఎస్సారెస్పీ నీరు రాలేదా?
జ్యోతి: వారం తప్ప వారం నీళ్లు వదిలినారు సార్. మార్చి మధ్యనే నీళ్లు ఆపడంతో ఎకరం ఎండిపోయింది సార్
కేసీఆర్: మంచి రోజులు వస్తాయి. ఈ ఎన్నికల్లో ఓటు వేసి వాళ్లకు బుద్ధి చెప్పాలి.
జ్యోతి: పట్టా కాకపోవడానికి కారణంపై ఫోన్ నంబర్ తీసుకున్నారు. తర్వాత సార్ పీఏ భూమి వివరాలు తీసుకున్నారు.