కంగ్టి, అక్టోబర్ 19 : వరి పంటపై ఆధారపడకుండా ఇతర పంటలను పండించి అధిక దిగుబడిని సాధించవచ్చని చేసి చూపిస్తున్నాడు కంగ్టి మండలం చాప్టా (బి) గ్రామానికి చెందిన రైతు హవప్ప. తనకున్న ఐదెకరాల్లో కొన్నేండ్లుగా వరిపంటను సాగుచేశాడు. వరిపంటకు పెట్టుబడితో పాటు వ్యవసాయ పనులు కూడా అధికంగా ఉంటాయని తెలుసుకున్న రైతు, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై ఆలోచించాడు. తమ క్లస్టర్ ఏఈవో సంతోష్ సూచనలతో ఎకరం పొలంలో నువ్వుల పంటను సాగుచేయాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకుగాను నాణ్యమైన శ్వేత అనే వంగడాన్ని 2.50కిలోలు కొనుగోలు చేసి ఎకరం పొలంలో డీఏపీ ఎరువుతో 10కిలోలతో వెదజల్లే పద్ధతిలో సాగుచేశాడు. విత్తిన వెంటనే నీటితో పంటకు తడి ఇవ్వడంతో 30 రోజుల అనంతరం ఎరువులను పైపోటుగా వేసుకున్నాడు. నువ్వుల పంటకు ఎలాంటి చీడ పురుగులు లేకుండా పిచికారీ మందులను ఉపయోగించుకున్నాడు. 89 రోజులకు 5 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి వచ్చింది.
5 వేల పెట్టుబడితో రూ.40వేల ఆదాయం
ఎకరం పొలంలో నువ్వుల పంట సాగుచేయడానికి రూ.5వేలు పెట్టుబడి పెట్టాడు. పొలం దున్నడానికి రూ.వెయ్యి, విత్తనాలకు రూ.700, ఎరువులకు రూ.వెయ్యి, కూలీలకు రూ.2300 ఖర్చు అయ్యాయి. ఎకరం పొలంలో 5 క్వింటాళ్ల వరకు పంట దిగుబడి రావడంతో మార్కెట్లో కిలో నువ్వులు రూ.80 నుంచి 100 వరకు అమ్ముడు పోయాయి. దీంతో రైతు నువ్వులను కిలోకు రూ.90కు విక్రయించగా, రూ.45 వేలు వచ్చాయి. ఇందులో రూ.5 వేలు పెట్టుబడి ఖర్చు పోనూ, రూ.40వేలు ఆదాయం వచ్చింది. వరిపంట పండిస్తే అనేక ఇబ్బందులు ఉన్నాయని రైతు పేర్కొంటున్నాడు.
ఏఈవో సూచన మేరకు పంట సాగు
మా క్లస్టర్ ఏఈవో సంతోష్ సూచన మేరకు వరిపంట బదులు ఎకరం పొలంలో నువ్వుల పంటను సాగు చేశాను. పంట దిగుబడి వస్తుందో లేదో అనుకుని సాగును ప్రారంభించా. కేవలం రూ.5వేల పెట్టుబడితో రూ.40వేల వరకు ఆదాయం వచ్చిం ది. ఇప్పుడు యాసంగి పంటలో మరోసారి నువ్వుల పంటను సాగుచేస్తా.
-హవప్ప, రైతు చాప్టా(బి), కంగ్టి
ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని రైతులకు అవగాహన కల్పించాం. రైతు హవప్ప ప్రత్యామ్నాయ పంటను పండించాలను కోవడంతో నువ్వల పంటను సాగుచేయాలని సూచించాం. అందుకుగాను సస్యరక్షణ చర్యలను కూడా వివరించాం. మిగతా రైతులు కూడా హవప్పను ఆదర్శంగా తీసుకుని ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి.
-సంతోష్, ఏఈవో, చాప్టా(బి), కంగ్టి