సిద్దిపేట అర్బన్, ఆగస్టు 18 : దేశ వ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా 44 మంది ఉపాధ్యాయులను ఎంపిక చేయగా, తెలంగాణ నుంచి ఇద్దరికి అరుదైన గౌరవం దక్కింది. జిల్లా కేంద్రం సిద్దిపేట ఇందిరానగర్ జడ్పీహెచ్ఎస్ హెచ్ఎం రామస్వామితో పాటు ఆసిఫాబాద్ జిల్లా సావర్ఖేడ్ హెచ్ఎం రంగయ్య ఎంపికయ్యారు. ఉపాధ్యాయ వృత్తినే సామాజిక సేవగా భావించి, ఒక మామూలు ప్రభుత్వ పాఠశాలను నేడు ప్రైవేటు పాఠశాలలకు దీటుగా మార్చిన ప్రధానోపాధ్యాయుడు రామస్వామికి జాతీయ అవార్డు రావడంపై ఉపాధ్యాయ లోకంతో పాటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలువురు ఉపాధ్యాయులు రామస్వామిని శాలువాతో సన్మానించారు.
రామస్వామికి అవార్డు రావడంపై మంత్రి హరీశ్రావు సంతోషం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయ వృత్తిని సామాజిక సేవలో భాగంగా భావించి సేవలందించినందుకు ఈ గౌరవం దక్కిందని రామస్వామిని మంత్రి హరీశ్రావు అభినందించారు. నిరుపేద విద్యార్థులపై చూపిన చొరవ రామస్వామి పనితీరుకు, సంకల్పానికి నిదర్శనమని పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టి కృషి, ఐక్యతకు ఈ అవార్డు లభించిందన్నారు. ఈ సందర్భంగా రామస్వామికి శుభాకాంక్షలు తెలిపారు.
ఇందిరా నగర్ ప్రభుత్వ పాఠశాలలో ‘అడ్మిషన్ ఫుల్’ అని ప్రతి సంవత్సరం గేటు వద్ద బోర్డు పెట్టే పరిస్థితి రావడానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి కృషి అమోఘమని చెప్పవచ్చు. ఆరేండ్ల క్రితం 300 మంది విద్యార్థులున్న ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో, రామస్వామి ప్రత్యేక కృషి, పట్టుదలతో క్రమక్రమంగా సీట్లు పెరిగి 2021-22 విద్యా సంవత్సరానికి పాఠశాల ఎన్రోల్మెంట్ 1200కు చేరింది. దీంతో మంత్రి హరీశ్రావు పాఠశాలను సకల హంగులతో, కార్పొరేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్ది రామస్వామిని మరింతగా ప్రోత్సహించారు. పాఠశాలలో డిజిటల్ ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, అటల్ టింకరిగ్ ల్యాబ్ కోసం భవనం, గూగుల్ ఫ్యూచర్ క్లాస్ సదుపాయం, సోలార్ పవర్ యూనిట్, మోడల్ వంటశాల, వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయించారు. వీటిని వంద శాతం సద్వినియోగం చేసుకోవడానికి ప్రధానోపాధ్యాయులు రామస్వామి పూర్తిస్థాయిలో చొరవ తీసుకుంటారు. రామస్వామి ప్రత్యేక చొరవతోనే ఈ పాఠశాలలో ప్రతి రికార్డు ఆన్లైన్లోనే నిక్షిప్తం చేసి ఉంటుంది.
జాతీయ స్థాయిలో ప్రతి సంవత్సరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ ఆధ్వర్యంలో జరిగే సెమినార్లకు ప్రధానోపాధ్యాయుడు రామస్వామికి ఆహ్వానం వస్తుంది. 2017 నుంచి ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో విద్యారంగంపై జరిగిన సెమినార్లలో ప్రధానోపాధ్యాయుడు రామస్వామి పాల్గొని పాఠశాల అభివృద్ధి, ఇన్నోవేటివ్, లీడర్షిప్ తదితర అంశాలపై వివరించారు. గతంలోనే రామస్వామికి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు వచ్చింది. ఇంకా రాష్ట్ర స్థాయిలో ఇందిరానగర్ పాఠశాలకు 5 అవార్డులు వచ్చాయి. వీటన్నిటి వెనుక రామస్వామి కృషి, తపన ఉందని చెప్పవచ్చు.