మెదక్ మున్సిపాలిటీ/మెదక్ రూరల్/నర్సాపూర్,ఆగస్టు 18 : సామాన్య కుటుంబంలో పుట్టి మొఘల్ చక్రవర్తులను ఓడించి గోల్కొండ కోటపై విజయ పతాకం ఎగరేసిన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న అన్ని ప్రొహిబేషన్, ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతి పురస్కరించుకొని మెదక్ పట్టణంలో గౌడ సంఘం ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని బుధవారం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతతో కలిసి మంత్రి ఆవిష్కరించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించారు. నర్సాపూర్లో నిర్వహించిన బైక్ర్యాలీలో ఎమ్మెల్యే మదన్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అనాటి సుబేదార్లు, జాగీర్దారుల నిరంకుశ పాలన, ప్రజలపై వారి ఆరాచకాలను ఎదిరించి తెలంగాణ పౌరుషాన్ని చాటిన యోధుడు పాపన్న అని కొనియాడారు. అన్నివర్గాల వారిని సైన్యంలో చేర్చుకొని అలుపెరుగని పోరాటాలతో బహుజనుల లక్ష్యాన్ని సాధించుకొని చరిత్రలో తొలి తెలంగాణ రాజుగా పాపన్న నిలిచాడన్నారు. జమిందార్లు దాచిన సొమ్మును కొల్లగొట్టి పేదలకు పంచిన యోధుడన్నారు. ఆంధ్రా పాలనలో పాపన్న చరిత్ర తెలియనీయలేదన్నారు. బహుజనులందరికీ పాపన్న నాయకుడన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పోరాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని కులవృత్తులకు పునర్ వైభవం వచ్చిందన్నారు. ప్రభుత్వంపై లేనిపోని ఆరోపణలు చేసే చీడపురుగులను వేరేయాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. పేదలకు కారణజన్ముడుగా ఈ జిల్లాలోనే పుట్టిన దేవుడు కేసీఆర్ అన్నా రు. గీత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభు త్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈత, తాటి వనాలను పెంచేందుకు ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. గౌడ కులస్తులకు ఆసరాగా ఉండేందుకు సొసైటీలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పిస్తుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కులవృత్తులు నాశనమయ్యాయని, టీఆర్ఎస్ హయాంలో అన్నికులాల ప్రజలు గౌరవంగా బతుకుతున్నారన్నారు. అన్ని కులాల విద్యార్థులు చుదువుకోడానికి గురుకులాలను ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. గౌడ్ల ఎదుగుదలను ఓర్వలేక రాజకీయ లబ్ధి కోసం గత పాలకులు అణగదొక్కారని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి అండగా ఉంటూ అబద్దపు ప్రచా రం చేసే వారిని భూస్థాపితం చేయాలని పిలుపునిచ్చా రు. విదేశాల్లో పేరు తెచ్చుకున్న పాపన్నగౌడ్ను కొందరు దుర్మార్గులు, దోపిడీదారుడని అనడం మూర్ఖత్వమన్నారు.
ఇందిరాగాంధీ అవుట్ డోర్ స్టేడియంలో జరుగుతున్న పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. ఫుట్బాల్ మైదా నం పనులను పరిశీలించి త్వరితగతిన వాడుకలో తీసుకువచ్చేలా వేగవంతం చేయాలన్నారు. స్టేడియం కలరింగ్ పనులను పూర్తిచేసి ప్రారంభానికి సిద్ధం చేయాలన్నారు. స్పోర్ట్స్ ఈవెంట్ ఎక్పైజ్ సేష్టన్ రెండు కలిపి ఒక రోజు ప్రారంభోత్సం చేస్తామన్నారు. రూ.15లక్షల వ్యయం తో కొనుగోలు చేసిన అథ్లెటిక్ పరికరాలను పరిశీలించారు. మెదక్ పట్టణంలో వృత్తి నైపుణ్య కేంద్రం ఏర్పాటుకు సానుకూలంగా స్పందించారు.
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
ప్రతి గౌడ సోదరుడు కల్లు గీయడం నేర్చుకోవాలని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ కులవృత్తులకు పూర్వ వైభవం తెచ్చారన్నారు. 50ఏండ్లు నిండిన ప్రతి గీత కార్మికును పింఛన్లు అందిస్తున్నట్లు ఆమె గుర్తుచేశారు. సీమాంధ్ర పాలనలో పాపన్న చరిత్ర కనుమరుగు చేశారని, తెలంగాణ వచ్చిన తర్వాత మన వీరుల చరిత్ర తెలుసుకుంటున్నామన్నారు. పట్టణంలోని మినీ ట్యాంక్బ్యాండ్పై సర్వాయి పాపన్న విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.
ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి
గౌడ సంఘానికి సహాయ సహకారాలు అందజేస్తానని సీఎ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలో గౌడ సంఘ భవనానికి సైతం కృషిచేస్తానని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ బడుగు బలహీన వర్గాల కోసం ఆహర్నిశలు కృషి చేస్తున్నట్లు తెలిపారు.
మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్
తెలంగాణ వచ్చిన తర్వాత సర్దార్ సర్వాయి పాపన్న లాంటి వీరుల చరిత్ర తెలిసిందని మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులవృత్తుల వారికి సహాయ సహకారాలతో పాటు గౌరవంతో దక్కుతుందన్నారు. అంతకుముందు గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్గౌడ్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడారు.
మంత్రి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, జడ్పీ చైర్పర్సన్, ఎక్సైజ్ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ శాస్త్రి, గౌడ సంఘం నాయకులతో కలిసి రేణుకాంబ ఆలయ ఆవరణలో ఈత మొక్కలు నాటారు. అంతకుముందు రేణుకాంబ ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రిని పట్టణ గౌడ సంఘం అధ్యక్షుడు గడ్డమీది కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు చంద్రాగౌడ్, జైగౌడ్ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, రాష్ట్ర గౌడ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేశ్గౌడ్, రాష్ట్ర గౌడజన హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి అశోక్గౌడ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ రజాక్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపల్ చైర్మన్లు జితేందర్గౌడ్, రాఘవేంద్రగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు, నర్సాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ అనసూయఅశోక్గౌడ్, గౌడ సంఘం నాయకులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, డీఎస్పీ కృష్ణమూర్తి, పంచాయతీరాజ్ ఈఈ రాంచంద్రారెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, జిల్లా యువజన క్రీడల అధికారి నాగరాజు, ఆర్డీవో సాయిరాం పాల్గొన్నారు.