కేతకీ సంగమేశ్వర ఆలయంలో
ఝరాసంగం, అక్టోబర్ 16 : కేతకీ సంగమేశ్వర ఆలయ మంటపంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న దసరా ఉత్సవాలు ముగిశాయి. దశమి రోజు అమ్మవారు రాజరాజేశ్వరీదేవీ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది. పీతావర్ణం (బంగారు వర్ణం)చీరెతో అమ్మవారిని అర్చకులు అలంకరణ చేశారు. ఆలయ మండపంలో ఆలయ చైర్మన్ నరసింహాగౌడ్, పాలకమండలి సభ్యులు, దంపతులతో హోమం, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేయించారు. చివరి రోజు వేదపండితులు మంత్రాలు చదివి పూర్ణాహుతితో ఉత్సవాలు ముగిశాయి. అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్, ఆలయ ఈవో శ్రీనివాస్మూర్తి, ఆలయ చైర్మన్ వెంటేశంగుప్తా, ధర్మకర్తలు నాగన్నపటేల్, నాగన్న సజ్జన్శెట్టి, ఆలయ అర్చకులు బసయ్యస్వామి, హరిమహారాజ్, శివప్రసాద్స్వామి, సంగయ్యస్వామి, వీర్సంగయ్యస్వామి పాల్గొన్నారు.
విజయదుర్గాదేవిగా భద్రకాళీ అమ్మవారు
గుమ్మడిదల, అక్టోబర్16: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా భద్రకాళీ అమ్మవారు విజయదుర్గాదేవీగా భక్తులకు దర్శనమిచ్చారు. శుక్రవారం జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రమైన బొంతపల్లి భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయంలో దేవీ శరన్నవర్రాతోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇందులో భాగంగా భద్రకాళీ అమ్మవారు విజయదుర్గాదేవిగా పూజలందుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు సమర్పించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో వాహనాల పూజలను అర్చకులు నిర్వహించారు. ఆలయకమిటీ చైర్మన్ గటాటి భద్రప్ప, ఈవో శశిధర్గుప్తా, జూనియర్ అసిస్టెంట్ సోమయ్య పర్యవేక్షణలో పూజలను నిర్వహించారు. కానుకుంట సప్తమాత్రిక సమేత మహంకాళీ ఆలయంలో శ్రీరాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.
మల్లన్న’ ఆలయంలో త్రీరాత్రోత్సవాలు
చేర్యాల, అక్టోబర్ 16 : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలో దేవీ త్రీరాత్రోత్సవాలు ముగిశాయి. దుర్గామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, అర్చకులు ఆలయ కోనేరులో వేకువజామున నిమజ్జనం చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్ మాట్లాడుతూ సంప్రదాయబద్ధంగా ఆలయంలో పూజలు నిర్వహించినట్లు తెలిపారు. మూడు రోజులపాటు మహాగణపతి పూజ, స్వస్తిక్ వచనం, రుత్విక్ వరణం, అఖండ దీపారాధన, అంకుర్పారణ, నవగ్రహారాధన, దేవాత ప్రతిష్ఠ, కలష స్థాపన, చతుషష్టి ఉపచార పూజ, చండీహోమం, మూలమంత్రహనం పూర్ణాహుతి, సుహాసిని పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, ఆలయ స్థానాచారీ పడిగన్నగారి మల్లేశం దంపతులు, ధర్మకర్తలు, ఏఈవో వైరాగ్యం అంజయ్య, పర్యవేక్షకులు నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, వేద పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
పల్లకీ సేవలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే
పాపన్నపేట, అక్టోబర్ 16 : ఏడుపాయల వనదుర్గా సన్నిధిలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు వివిధ రూపాల్లో దర్శనమిచ్చిన అమ్మవారు విజయదశమిని పురస్కరించుకొని రాజరాజేశ్వరిదేవిగా మెరూన్రంగు పట్టు వస్ర్తాలతో భక్తులకు దర్శనమిచ్చారు. వేకువ జామున వేద పండితులు రాజగోపురంలో ఏర్పాటు చేసిన ఉత్సవ విగ్రహంతో పాటు గోకుల్షెడ్లో సైతం, ఉత్సవ విగ్రహాన్ని మెరూన్రంగు పట్టు వస్ర్తాలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముగింపు ఉత్సవాలలో నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు ఆలయ కార్యనిర్వహణాధికారి సార శ్రీనివాస్ స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి పల్లకీ సేవలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పల్లకీసేవ గోకుల్షెడ్ నుంచి మంజీరా నది పాయల వరకు కొనసాగింది. మంజీరా పాయలో వేద మంత్రోచ్ఛరణల మధ్య నిమజ్జనం చేశారు. పల్లకీ సేవలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏడుపాయల వనదుర్గాదేవి అమ్మవారి క్షేత్రం భక్తులతో సందడిగా మారింది. శుక్రవారం విజయదశమిని పురస్కరించుకొని వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని మొక్కుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరి కొందరు తమ తమ వాహనాలకు పూజలు నిర్వహించారు.
వర్గల్ విద్యాధరిక్షేత్రంలో..
వర్గల్, అక్టోబర్ 16 : వర్గల్ విద్యాధరిక్షేత్రంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ఘనంగా ముగిశాయి. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ శ్రీయాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, వేదపండితులు సరస్వతీమాత ఆలయంలో అమ్మవారికి విశేష అభిషేకాలతోపాటు ఆయుధపూజ, జమ్మి చెట్టుకు పూజ నిర్వహించారు. ఉత్సవాల్లో చివరిరోజున సరస్వతీమాత రాజరాజేశ్వరీ అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. వర్గల్తోపాటు పరిసరప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.