నిష్ట 2.0 ఆధ్వర్యంలో ఆన్లైన్ శిక్షణ
పర్యవేక్షిస్తున్న డీఈవోలు
మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 11: విద్యాబోధనలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాయి. ఇందులో భాగంగా నిష్ట 2.0 (నేషనల్ ఇనిషియేట్ ఫర్ స్కూల్ అండ్ టీచర్స్ హోలిస్టిక్) ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఆన్లైన్లో శిక్షణ ఇచ్చేందుకు శ్రీకారం చుట్టాయి. ఈ నెల 3వ తేదీ నుంచి శిక్షణ ప్రారంభమైంది. శిక్షణ ఐదు నెలల పాటు కొనసాగనున్నది. ప్రాథమికోన్నత, ఉన్నత, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొంటున్నారు. డీఈవోలు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఉపాధ్యాయులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకొని గుణాత్మక విద్యనందించేందుకు శిక్షణ దోహదం చేస్తున్నది.
మెదక్ జిల్లా నుంచి 1946 మంది ఉపాధ్యాయులు
మెదక్ జిల్లా నుంచి వివిధ పాఠశాలల్లోని పని చేస్తున్న 1946 మంది ఉపాధ్యాయులు నిష్ట 2.0 ఆన్లైన్ శిక్షణలో పాల్గొంటున్నారు. స్కూల్ అసిస్టెంట్లు 1258 మంది, 15 మంది ఎస్వోలు (స్పెషల్ ఆఫీసర్స్ కేజీవీబీ విద్యాలయాలు), 113 మంది సీఆర్టీలు (కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్స్, కేజీబీవీ), 14 మంది పీజీటీలు (పోస్టు గ్రాడ్యుయేట్ కాంట్రాక్ట్ రిసోర్స్ టీచర్లు కేజీవీబీ), 330 మంది పీజీటీలు (పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు, టీఎస్ఎంఎస్), 42 మంది టీజీటీలు (టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ మోడల్ స్కూల్), 89 మంది గెజిటెడ్ హెడ్మాస్టర్లు, ఐదుమంది మోడల్ స్కూల్ ప్రిన్సిపాళ్లు, 80 మంది సీఎఫ్ఎల్హెచ్ఎంలు (లో లెవెల్ ఫిమేల్ లిటరసీ హెడ్మాస్టర్లు) ఉన్నారు. ఐదు నెలల పాటు జరిగే ఈ ఆన్లైన్ శిక్షణకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా విద్యాశాఖ అన్ని చర్యలు తీసుకుంటున్నది. ప్రతి నెలలో మూడు మాడ్యుల్ ఉంటాయి. వీటన్నింటిని కూడా అదే నెలలో పూర్తి చేయాలి. ప్రతి నెల లో 20 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి 70 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. 70 శాతం మార్కులు సాధించేవరకు మూడు అవకాశాలు ఇస్తారు. మార్కులు సాధించిన ఉపాధ్యాయుడికి కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్ వస్తున్నది.
లాగిన్ కావడం ఇలా..
నిష్ట 2.0 శిక్షణకు ఉపాధ్యాయులు తెలంగాణ దీక్ష (డిజిటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జి షేరింగ్) పోర్టల్ ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది. diksha.gov.in/telanganaa వెబ్సైట్లో ముందుగా రిజిష్టర్ చేసుకోవాలి. వెబ్సైట్ ఓపెన్ చేయగానే పైన రిజిస్ట్రేషన్పై క్లిక్ చేయాలి. అం దులో మొబైల్ నంబర్, మెయిల్ ఐడీని నమోదు చేయాలి. తర్వాత పుట్టిన తేదీ, పేరు, మొబైల్ నంబర్ నమోదు చేయాలి. మొబైల్కు వచ్చిన ఓటీపీని సబ్మిట్ చేయాలి. అప్పుడు రిజిస్టేషన్ అవుతుంది. తర్వాత మొబైల్ నంబర్, పాస్వర్డ్ నమోదు చేసి, లాగిన్ అయిన తర్వాత రాష్ట్రం, మీడియం నమోదు చేయాలి. లాగిన్లో టీచర్, స్టూడెంట్, ఇతరులు అనే బొమ్మలు కనిపిస్తాయి. వీటిపై క్లిక్ చేయగానే జిల్లా ఇతర వివరాలు తర్వాత కోర్సు వివరాలు, వాటి నిర్వచనాలు కనిపిస్తాయి.
శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ఆన్లైన్లో శిక్షణను ప్రతి ఉపాధ్యాయుడు సద్వినియో గం చేసుకోవాలి. శిక్షణలో పాల్గొనాలని రాష్ట్ర విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ప్రత్యేక పర్యవేక్షణ ఉంటుంది. శిక్షణతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. 70 శాతం మార్కులు సాధించిన ఉపాధ్యాయుడికి కోర్సు పూర్తి చేసిన సర్టిఫికెట్ అందజేస్తాం.
-సుభాశ్ నాయక్, సెక్టోరియల్ అధికారి
గుణాత్మక విద్యనందించేందుకు దోహదం
బోధనలో నైపుణ్యత పెం పొందించేందుకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు సద్వినియో గం చేసుకోవాలి. మెలుకువలు నేర్చుకుంటే విద్యార్థులను చక్కగా తీర్చిదిద్దే ఆవకాశం ఉంది. గుణాత్మక విద్యనందించేందుకు ఈ శిక్షణ ఎంతో దోహదపడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిష్ట 2.0 ద్వారా ఉపాధ్యాయులు శిక్షణ ఇస్తున్నాయి. కొవిడ్ నేపథ్యంలో ఆన్లైన్లో జరిగే కార్యక్రమాన్ని వినియోగం చేసుకోవాలి.