గోదావరి జలాలను చూసి మురిసిన సబ్బండ వర్ణాలు
రైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందం
కెనాళ్ల వెంట పండుగ వాతావరణం
కొత్త చరిత్రను లిఖించిన సీఎం
జల పండుగను జరుపుకున్న రైతులు
సిద్దిపేట, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గజ్వేల్ అర్బన్/ గజ్వేల్ రూరల్, ఏప్రిల్ 6:తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ కార్యాచరణ కీలక మైలురాయి దాటింది. నదీమతల్లికి కొత్త నడక నేర్పిన సందర్భమిది.. మండుటెండల్లో మహాద్భుతమిది.. కలలో ఊహించని విధంగా ఎదురెక్కి వచ్చి గోదారమ్మ మన బీడు భూములను ముద్దాడింది. మన మాగాణులను పునీతం చేసింది. కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి సంగారెడ్డి కెనాల్ ద్వారా హల్దీ వాగుకు గోదావరి జలాలను తరలించే అద్భుతాన్ని సీఎం కేసీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రస్థానంలో మరో అపూర్వ ఘట్టానికి గజ్వేల్ నియోజకవర్గం వేదికైంది. వర్గల్ మండలం అవుసులపల్లి వద్ద సంగారెడ్డి కాల్వ అప్టెక్ తూము గేట్లను ఎత్తి హల్దీ వాగులోకి నీటిని వదిలారు. పాములపర్తి వద్ద కొండపోచమ్మసాగర్ మరోకాల్వ ద్వారా గజ్వేల్ నియోజకవర్గానికి సాగునీటిని విడుదల చేశారు. ఈ శుభసందర్భంగా రైతులు మురిసిపోయారు. కాల్వల వెంట సంబురాలు చేసుకున్నారు. ఆనందంతో జై కేసీఆర్.. అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
గజ్వేల్ రూరల్, ఏప్రిల్6: కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి గజ్వేల్కు వెళ్లే ప్రధాన కాల్వ నుంచి పాములపర్తి వద్ద మంగళవారం ఉదయం సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేశారు. అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరించి మండుటెండల్లో సాగునీటి గోసను తీర్చి రైతుల ముంగిటకు గోదావరి జలాలను పారించారు. మర్కూక్ మండలం పాములపర్తి సమీపంలో గజ్వేల్కు వెళ్లే కెనాల్ వద్ద వేదపండితులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి జలాలను విడుదల చేశారు. సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేసేందుకు వస్తున్న సందర్భంగా రైతులు, అభిమానులు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించి స్వాగతం పలికారు. 20నిమిషాల పాటు కొనసాగిన సీఎం పర్యటనలో నీటిని గజ్వేల్ కెనాల్లోకి విడుదల చేయగానే రైతులు సంతోషంతో సంబురపడ్డారు. కాలువలోకి నీటి విడుదల తర్వాత పక్కనే గజ్వేల్ కాలువలోకి ప్రవహిస్తున్న గోదావరి జలాలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేసి పసుపు, కుంకుమ, పట్టు వస్ర్తాలను సమర్పించారు.
గౌరారం వద్ద పూల వర్షంతో ఘనస్వాగతం
సంగారెడ్డి కెనాల్లోకి గోదావరి నీటిని విడుదల చేసేందుకు సీఎం కేసీఆర్ వస్తున్న క్రమంలో గౌరారం రాజీవ్ రహదారిపై సీఎం కేసీఆర్ కాన్వాయ్పై మహిళలు పూలవర్షం కురిపించి స్వాగతం పలికారు. కాన్వాయ్ ప్రారంభం నుంచి ముగింపు వరకు పూలు చల్లుతూ నినాదాలు చేశారు. గౌరారం నుంచి పాములపర్తి సమీపంలోని గజ్వేల్ కెనాల్ వరకు ప్రజాప్రతినిధులు, నాయకులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, స్వాగత తోరణాలు ఆకట్టుకున్నాయి.
తరలివచ్చిన మహిళలు, రైతులు
గజ్వేల్ కెనాల్ వద్దకు మర్కూక్, గజ్వేల్ రూరల్ మండలం, కొండపాక మండలాలకు చెందిన మహిళలు, రైతులు, నాయకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. సీఎం పర్యటన సందర్భంగా వచ్చిన మహిళలు సంతోషంగా గడిపారు. కెనాల్కు రెండువైపులా నిలబడి నీటి విడుదలను ఎంతో ఆసక్తిగా తిలకించిన వారంతా, కాలువలోని గోదావరి జలాలు రాగానే సంతోషంతో ఉప్పొంగిపోయారు. పాములపర్తి, ఇంద్రనగరానికి చెందిన వృద్ధ మహిళలు కూడా సీఎం కేసీఆర్ను చూసేందుకు వచ్చారు.
సీఎం కేసీఆర్ ఫ్ల్లెక్సీలతో సందడి చేసిన మహిళలు
గజ్వేల్ రూరల్ మండల నాయకులు ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ చిత్రపటాలను తీసుకొని కార్యక్రమానికి వచ్చిన మహిళలు సందడి చేశారు. పక్కనే పచ్చని చెట్ల కింద కూర్చుని కేసీఆర్ కట్టించిన ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుంటూ కనిపించారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలతో వరిపొలంలోకి వెళ్లి జై కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ గట్లపై తిరుగుతూ కనిపించారు. గజ్వేల్ మండలం బూరుగుపల్లి గ్రామానికి చెందిన 50మంది మహిళలు పదిరోజుల క్రితమే కూడవెల్లి వాగులోకి నీళ్లను వదిలేందుకు కృషి చేసిన సీఎంను చూసేందుకు వచ్చినట్లు తెలిపారు.
సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం
సీఎం కేసీఆర్ గజ్వేల్ కెనాల్ వద్ద గోదావరి జలాలను కాలువలోకి వదలగానే గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణా శ్రీనివాస్ నేతృత్వంలో 50 కేసీఆర్ చిత్రపటాలకు మహిళలు, రైతులు క్షీరాభిషేకం చేశారు. నీటి విడుదల సందర్భంగా బెలూన్లను నీటిలోకి వదిలారు. కెనాల్కు ముందు భాగంలో గజ్వేల్ రూరల్ మండలం, గజ్వేల్ వైపు నీరువెళ్లే మార్గంలో ఇరువైపులా కొండపాక, మర్కూక్ మండలాలకు చెందిన రైతులు కాలువలోకి నీరురాగానే సంబురపడుతూ పూలు, కుంకుమ, పసుపు చల్లి జైకేసీఆర్, జై హరీశ్రావు అంటూ నినాదాలు చేశారు. ఎంతో సంబురంగా టీఆర్ఎస్ పార్టీ నాయకుల కాలువలోకి దూకి ఈత కొట్టారు.
కాలువ పక్కనే ఉన్న ఇంద్రనగరం గ్రామస్తులు సీఎం కేసీఆర్ తమ గ్రామానికి వచ్చాడని సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మంత్రులు హరీశ్రావు, వేముల ప్రశాంత్రెడ్డి, ఎంపీలు సంతోశ్ కుమార్, కొత్త ప్రభాకర్రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు మదన్రెడ్డి, యాదగిరిరెడ్డి, పద్మాదేవేందర్రెడ్డి, గోవర్ధన్, గణేశ్ గుప్త్తా, హన్మంత్షిండే, చిరుమర్తి లింగయ్య, మహిపాల్రెడ్డి, మాణిక్రావు, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్రెడ్డి, భూపాల్రెడ్డి, ఫరీదుద్ద్దీన్, ఫారూఖ్ హుస్సేన్, గంగాధర్గౌడ్, సీఎం కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్కుమార్, ఈఎన్సీలు మురళీధర్రావు, హరిరామ్, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, ఎస్ఈ వేణు, ఏఎంసీ చైర్పర్సన్ మాదాసు అన్నపూర్ణా శ్రీనివాస్, ఎంపీపీ పాండుగౌడ్, నాచారం ఆలయ కమిటీ చైర్మన్ హరిపంతులు, మర్కూక్ మండల అధ్యక్షుడు కరుణాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సీఎం పర్యటన విజయవంతం
హల్దీవాగు, గజ్వేల్ కెనాల్లోకి నీటి విడుదల చేసిన సీఎం కేసీఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ప్రజాప్రతినిధులకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. మంగళవారం ముఖ్యమంత్రి పర్యటన విజయవంతమైన సందర్భంగా కార్యక్రమం అనంతరం మంత్రి హరీశ్రావు విలేకరులకు ప్రకటన విడుదల చేశారు. సీఎం కేసీఆర్ పర్యటనను విజయవంతం చేసినందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు, రైతుల సమక్షంలో వేడుకగా జరుపుకోవాల్సిన అద్భుత ఘట్టాన్ని, సాదాసీదాగా జరిపామన్నారు. అయినప్పటికీ ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్దసంఖ్యలో స్వచ్ఛందంగా తరలిరావడం సంతోషంగా ఉన్నదన్నారు. సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, పోలీసు కమిషనర్ జోయల్ డెవిస్, ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధుల సహకారం, సమన్వయంతోనే సీఎం పర్యటన విజయవంతమైందని మంత్రి పేర్కొన్నారు. అలాగే, సీఎం పర్యటన విజయవంతానికి కృషిచేసిన అధికారులు, ఉద్యోగులకు కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
తక్కువ సమయంలో నైనా… సూపర్ సక్సెస్
సోమవారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ గజ్వేల్ పర్యటన అధికారికంగా ఖరారైన వెంటనే ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు క్షేత్రస్థాయిలో కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి, సీపీ జోయల్ డెవిస్తో కలిసి పర్యటించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. తక్కువ సమయం ఉన్నప్పటికీ చకచకా ఏర్పాట్లు జరిగేలా పర్యవేక్షణ చేశారు. కంటిమీద కునుకులేకుండా ఏర్పాట్ల పురోగతిని సమీక్షిస్తూ మంగళవారం వేకువజాము వరకే అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యేలా చేశారు.
ఇవి కూడా చదవండి
హాలియాలో సీఎం బహిరంగ సభ స్థలం పరిశీలన
కర్ణాటకలో కాంగ్రెస్కు షాక్.. అన్నకు వ్యతిరేకంగా బీజేపీకి హస్తం నేత మద్దతు
ఎన్నో తిరస్కారాల్ని ఎదుర్కొన్నా!