ఫిబ్రవరి 5న జాతికి అంకితం..
శ్రీరామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరుగనున్నాయి. ఫిబ్రవరి 5న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రధాని మోదీ సమతామూర్తి మహావిగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేస్తారు. 13వ తేదిన రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ వస్తారు. ప్రధానాలయంలోని నిత్య పూజామూర్తి బంగారు విగ్రహానికి తొలిపూజ చేస్తారు. ఈ వేడుకలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరుండి పర్యవేక్షించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
5 వేల మంది రుత్వికులతో..
సహస్రాబ్ది ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచి 5 వేల మంది రుత్వికులు వస్తున్నారు. 12 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా 120 యాగశాలల్లో 1,035 హోమగుండాలను సిద్ధం చేశారు. వివిధ రాష్ర్టాల నుండి సేకరించిన 2 లక్షల కిలోల స్వచ్ఛమైన ఆవు నెయ్యిని హోమానికి వినియోగిస్తారు. ఈ సందర్భంగా పండితులు కోటి సార్లు అష్టాక్షరి మహామంత్రాన్ని జరిపిస్తారు.
విశిష్టతలు
మణికొండ, ఫిబ్రవరి 1: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో ముచ్చింతల్ దివ్యక్షేత్రం దేశంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేదికైంది. శ్రీ రామనుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు బుధవారం నుంచి అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. ఇందుకోసం ఏకంగా 45 ఎకరాల విస్తీర్ణంలో శ్రీ రామానుజాచార్యుల ఆలయాన్నే నిర్మించారు. రూ.వెయ్యి కోట్ల నిధులు వెచ్చించి సుమారు ఆరేండ్ల పాటు నిర్విరామంగా ఈ పనులు కొనసాగాయి. నాటి పల్లవ, చోళ, చాళుక్య, కాకతీయ, విజయనగర సామ్రాజ్యాలను శైలులను మేళవించి ఇక్కడి నిర్మాణాలు చేపట్టారు.
5821 సిబ్బందితో భద్రత
సిటీబ్యూరో, ఫిబ్రవరి 1(నమస్తే తెలంగాణ): ముచ్చింతల్ శ్రీరామనగరంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 2 నుంచి 12 వరకు జరిగే వేడుకలకు రాష్ట్రపతి, ప్రధాని, ఉపరాష్ట్రపతి, సీఎం కేసీఆర్లు హాజరవుతుండటంతో పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర సారథ్యంలో దాదాపు 5821 మంది సిబ్బందితో భద్రతను కల్పించనున్నారు. ఫిబ్రవరి 5న ప్రధాని వస్తుండటంతో ఇప్పటికే ఎస్పీజీ బృందాలు ప్రత్యేక భద్రత ఏర్పాట్లలో తలమునకలయ్యాయి. ఉన్నతాధికారులు సీనియర్ అధికారులను రంగంలోకి దింపి శ్రీరామనగరానికి వెళ్లే రూట్మ్యాపును సిద్ధం చేయడంతో పాటు సైబరాబాద్ కమాండ్ కంట్రోల్కు సీసీ కెమెరాలను అనుసంధానం చేశారు. బాంబ్, డాగ్ స్కాడ్తో నిరంతరం తనిఖీలు చేస్తున్నారు. అంతేకాక వీఐపీ రూట్లను సిద్ధం చేశారు. ఎస్పీజీ, స్పెషల్ పార్టీ, స్థానిక పోలీసులతో మొత్తం మూడంఅంచెల భద్రతను కల్పిస్తున్నారు.
ఎన్నో ప్రత్యేకతలు..
దివ్యమంగళ స్వరూపం..
ఈ దివ్య క్షేత్రంలోని శ్రీ రామానుజుల విగ్రహంలో దివ్యమంగళ స్వరూపం గోచరిస్తుంది. వివిధ రాష్ర్టాలకు చెందిన 2,700 మంది శిల్పులు తొమ్మిది నెలల పాటు శ్రమించి 1600 భాగాలుగా విగ్రహాన్ని తయారు చేశారు. మన దేశానికి తీసుకువచ్చిన తర్వాత చైనాకు చెందిన 60 మంది నిపుణులు ఈ విగ్రహానికి రూపునిచ్చారు. ఈ విగ్రహ నిర్మాణం చేపట్టారు. ఎలాంటి వాతారణ పరిస్థితులనైనా తట్టుకొని వెయ్యేండ్ల పాటు చెక్కుచెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూర్చున్న భంగిమలో ఉన్న అత్యంత ఎత్తయిన విగ్రహాల్లో ఇది రెండవది. అంతేకాదు.. మహావిగ్రహం కింద విశాలంగా ఉన్న గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహ రూపంలో రామానుజులు నిత్యపూజామూర్తిగా కనిపిస్తారు. ఈ విగ్రహం చుట్టూ సప్తవర్ణ కాంతులు ప్రసరించే విధంగా ఏర్పాటు చేశారు. గది ప్రధాన ద్వారంతో పాలు ఇతర ద్వారాలకు బంగారు రేకులను తొడిగారు.
విగ్రహ ప్రత్యేకతలు..
నినాదం సమతామూర్తి
(స్టాట్చ్యూ ఆఫ్ ఈక్వాలిటీ)
ప్రత్యేకత దక్షిణాది రాష్ర్టాల్లోనే
రెండో ఎత్తయిన విగ్రహం
విగ్రహం తయారీ ఖర్చు రూ.100 కోట్లు
రూపకల్పన, నిర్మాణం ఎరోసన్ కార్పొరేషన్, చైనా
విస్తీర్ణం 45 ఎకరాలు
ఎత్తు 216 అడుగులు
విగ్రహం పంచలోహం
బరువు 1140 మెట్రిక్ టన్నులు
(1800 కిలోలు)
శిల్పులు 2,700 మంది
నిపుణులు 60 మంది
అంతస్తులు మూడు
(54 అడుగుల కమలం)
గ్రౌండ్ ఫ్ల్లోర్ విస్తీర్ణం 63,444 చదరపు
అడుగులు (ఇక్కడ
రామానుజాచార్య
జీవిత విశేషాలు,
స్ఫూర్తి వచనాలు
ఆకట్టుకుంటాయి)
రెండో అంతస్తు 33,084, వేల చదరపు
అడుగుల విస్తీర్ణం
(ఇందులో 120 కిలోల
బంగారు విగ్రహం
ఉంటుంది. దీన్ని మెడిటేషన్
కోసం వినియోగిస్తారు.)
మూడో అంతస్తు 14,700 చదరపు అడుగుల
విస్తీర్ణం (దీన్ని వేద
గ్రంథాలయం, పరిశోధక
స్థలంగా వినియోగిస్తారు)