ప్రముఖ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది. మూడో వారానికి సుమారు 30వేల మందికి పైగా భక్తులు తరలిరాగా, ఆలయ ప్రాంతం కిటకిటలాడింది. స్వామి వారి క్షేత్రానికి వచ్చిన భక్తులు ‘మల్లన్న స్వామి.. మమ్మేలు స్వామి’ అని చేసిన నినాదాలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మల్లన్న దర్శనంతో భక్తులు పులకరించిపోయారు. కాగా, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కుటుంబ సమేతంగా మల్లన్నతో పాటు కొండపోచమ్మను దర్శించుకొని, పూజలు చేశారు.
చేర్యాల, జనవరి 30 : ప్రముఖ కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిక్కిరిసిపోయింది.మూడో వారానికి సుమారు 30 వేల మందికి పైగా భక్తులు తరలిరాగా, ఆలయ ప్రాంతం కిటకిటలాడింది. భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్నారు. స్వామి వారి దర్శనం అనంతరం గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు, పట్నం, మరికొందరు తాము బస చేసిన గదుల వద్ద, మహామండపంలో పట్నాలు వేయించి మొక్కులు తీర్చుకున్నారు. మరికొందరు గంగిరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టి మొక్కులు తీర్చుకోవడంతో పాటు కోరిన కోరికలు తీర్చాలని వేడుకున్నారు. కొందరు భక్తులు అమ్మవార్లకు ఒడి బియ్యం, మల్లన్నకు అభిషేకం, అర్చన తదితర పూజలు నిర్వహించారు. మల్లన్న గుట్ట పై ఉన్న ఎల్లమ్మకు ఒడి బియ్యం పోసి బోనం సమర్పించుకున్నారు. ఈవో బాలాజీ, ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు ఉట్కూరి అమర్గౌడ్, దినేశ్ తివారి, ముత్యం నర్సింహులు, చింతల పర్శరాములు, కొంగరి గిరిధర్, బొంగు నాగిరెడ్డి, తాళ్లపల్లి శ్రీనివాస్, సాయి యాదవ్, పొతుగంటి కొంరెల్లి, పర్యవేక్షకులు నీల శేఖర్, సిబ్బంది, అర్చకులు, ఒగ్గు పూజారులు భక్తులకు సేవలందించారు. హుస్నాబాద్ ఏసీపీ సతీశ్ ఆధ్వర్యంలో చేర్యాల సీఐ శ్రీనివాస్రెడ్డి, ఎస్సైలు చంద్రమోహన్, నరేందర్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
మల్లన్న సన్నిధిలో మంత్రి తలసాని పూజలు
కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి సన్నిధిలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి తలసాని తన కుటుంబ సభ్యులతో కలిసి మల్లన్న క్షేత్రంలో పర్యటించారు. మంత్రికి ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి, ధర్మకర్తలు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో మంత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి, మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మంత్రి కుటుంబ సభ్యులకు ఆశీర్వచనాలు, ప్రసాదాలు అందజేశారు.
అద్భుత కళాఖండంగా కొండపోచమ్మ క్షేత్రం
జగదేవ్పూర్ జనవరి 30: సీఎం కేసీఆర్ దార్శనికత, ముందుచూపుతో దేవాలయాలకు మహర్దశ వచ్చాయని, కోట్లాది రూపాయలతో యాదాద్రి, కొమురవెల్లి, కొండపోచమ్మ క్షేత్రాలను అద్భుత కళాఖండాలుగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఆదివారం కొమురవెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి కుటుంబ సభ్యులతో కొండపోచమ్మ క్షేత్రానికి చేరుకొని పూజలు నిర్వహించారు. మంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. కొండపోచమ్మ దేవాలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కలెక్టర్, ఎఫ్డీసీ చైర్మన్తో మాట్లారని, ఇప్పటికే ఆలయ అభివృద్ధికి రూ.10 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. మరో రూ.10 కోట్లు ఇస్తామని హామీనిచ్చారని తెలిపారు.
విజన్ ఉన్న గొప్ప నాయకుడు సీఎం కేసీఆర్..
సీఎం కేసీఆర్ విజన్ ఉన్న నాయకుడని, ప్రజలకు ఎప్పు డూ ఏదికావాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారని తెలిపారు. ఒక వైపు కొండపోచమ్మ, మల్లన్నసాగర్, రంగనాయక సాగర్ వంటి భారీ ప్రాజెక్టుల నిర్మాణం, రైతులకు 24గంటల కరెంట్, వృద్ధులకు పెన్షన్లు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్దన్నారు. 74ఏండ్లు పాలించిన ప్రతిపక్షాలు ప్రజలకు మంచి చేస్తానంటే వద్దన్నారా అని అడిగారు. ‘కొంతమంది నాయకులు ఏది పడితే అది మాట్లాడితే నడుస్తుందా అన్నారు. తాడు బొంగరం లేనోళ్లు మాట్లడితే నమ్మే పరిస్థితిల్లో ప్రజలు లేరన్నారు. కేంద్రం నుంచి ఒక్కపైసా తీసుకురాని నాయకులు ఇక్కడ అది చేయాలి.. ఇది చేయాలి అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.
ప్రపంచం అబ్బుర పడేలా సాగునీరు ప్రాజెక్టులు..
రైతన్నల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రాజెక్టులు నిర్మించి వేల ఎకరాలకు సాగునీరందిస్తున్నారన్నారు. రాష్ట్రం పచ్చని పంటపొలాలతో సస్యశ్యామలంగా ఉందన్నారు. తెలంగాన వస్తే ఏమోస్తది గొర్రెలు, బర్రెలు అనే నాయకులకు దానితో ఎన్నో వేల కుటుంబాలు ఆర్థిక పరిపుష్టి పొంది సంతోషంగా ఉన్నారని తెలిపారు. అంతకుముందు అమ్మవారిని మంత్రి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి వెంట ఎంపీపీ బాలేశంగౌడ్, సర్పంచ్ రజితారమేశ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్గౌడ్, రైతుబంధు కమిటీ కో-ఆర్డినేటర్ శ్రీనివాస్రెడ్డి, కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు నరేశ్, సర్పంచ్ చంద్రశేఖర్, మండల నాయకులు ఉన్నారు.
మల్లన్నను దర్శించుకున్న బస్వరాజు సారయ్య
చేర్యాల, జనవరి 30 : మల్లికార్జునస్వామిని మాజీ మంత్రి బస్వరాజు సారయ్య కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆయన వెంట మల్లన్న ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, మల్లన్న ఆలయ కమిటీ సభ్యుడు చింతల పరశురాములు తదితరులు ఉన్నారు.