మునిపల్లి, జనవరి 30 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న దళితబంధు పథకం దళితులకు వరం అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. ఆదివారం మండలంలోని చీలపల్లిలో విలేకరులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. దళితబంధుతో దళిత కుటుంబాల్లో వెలుగులు నింపనున్నట్లు తెలిపారు. దళితబంధుతో దళితులు ఆర్థికంగా అభిమృద్ధి సాధిస్తారన్నారు.దళితుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కంకణం కట్టుకున్నట్లు చెప్పారు. దళితబంధు పథకాన్ని సక్రమంగా సద్వినియో గం చేసుకుని ఆర్థికంగా ఎదిగినప్పుడే సీఎం కేసీఆర్ కల నెరవేరుతుందన్నారు. దళితులు ఈ పథకంతో అభివృద్ధి చెందుతూ ఇతరులకు అదర్శంగా నిలిచేలా తయారు కావాలన్నారు. గతంలో దళితుల అభివృద్ధి కోసం పట్టించుకున్న వారే లేరన్నారు. టీఆర్ఎస్ హయాం లో అన్నివర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతున్నారన్నారు. రాష్ట్ర ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రం లో పాలకులు కుటుంబ ఆస్తులను పెంచుకున్నారు తప్ప.. ప్రజల అభివృద్ధి కోసం ఒక్కరోజు ఆలోచించలేరన్నారు. దేశంలోని అన్నిరాష్ర్టాలకు తెలంగాణ ఆదర్శంగా నిలిచిందన్నారు.