కేటీఆర్ సభకు కొవిడ్ నిబంధనలతో హాజరుకావాలి
రూ.17.50 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
అచ్చంపేట రూరల్, ఏప్రిల్ 12: అచ్చంపేటను అభివృద్ధిలో మరో సిద్దిపేటగా చేయడమే ధ్యేయమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో విప్ గువ్వల బాలరాజు సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. ఈనెల 14న మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పట్టణానికి రానున్నట్లు గుర్తు చేశారు. పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం ప్రాంగణంలో రూ.4.5 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం, స్మృతివనానికి రూ.1.5కోట్లు, అంబేద్కర్ విజ్ఞాన కేంద్రానికి రూ.5కోట్లు, వ్యవసాయ మార్కెట్ ప్రహారీ విస్తరణకు రూ.75లక్షలు, ఎన్టీఆర్ మినీ స్టేడియం అభివృద్ధికి రూ.కోటి, ఇండోర్ స్టేడియం అభివృద్ధికి రూ.75 లక్షలు, సీసీ రోడ్లకు రూ.4కోట్లు, డ్రైనేజీ నిర్మాణాలకు రూ.7.27 కోట్లు, డివైడర్ నిర్మాణానికి రూ.1.1 కోట్లు, సెంట్రల్ లైటింగ్కు రూ.2 కోట్లు, అంబేద్కర్ కళా భవన్కు రూ.30 లక్షలు, మొత్తం రూ.17.50 కోట్లతో చేపట్టిన, చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ భూమిపూజ, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఉంటుందని పేర్కొన్నారు. సభకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు కొవిడ్ నిబంధనల ప్రకారం మాస్కులు ధరించి, భౌతికదూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు మనోహర్, మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ తులసీరాం, వైస్ మాజీ చైర్మన్ రాజు, నాయకులు నర్సింహగౌడ్, నర్సింహారెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ఖలీల్, రహమతుల్లా, నిజాం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారానికే బస్తీబాట
మున్సిపాలిటీ పరిధిలో నెలకొన్న సమస్యల పరిష్కారానికే బస్తీబాట నిర్వహిస్తున్నట్లు విప్ గువ్వల బాలరాజు గుర్తు చేశారు. ఈ సందర్భంగా సోమవారం పట్టణంలోని 13వ వార్డులో పర్యటించి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఆసరా పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇండ్లు మొదలైన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని భరోసానిచ్చారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ మొదలైన సమస్యలు పట్టణంలో భగీరథ పైప్లైన్ పనులు పూర్తయిన వెంటనే పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపక్షాల మాటలకు మోసపోవద్దని పిలుపునిచ్చారు. పట్టణ ప్రజలు అన్ని విధాలుగా సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
అంబేద్కర్ భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
లింగాల, ఏప్రిల్ 12: అంబేద్కర్ భావాజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు యువత కృషి చేయాలని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు అన్నారు. సోమవారం మారుమూల ప్రాంతంలోని ధారారంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని అవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ గువ్వల మాట్లాడుతూ బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతి కృషి చేసిన మహాత్ముల ఆశయసాధన కోసం ప్రతిఒక్కరూ పాటుపడాలన్నారు. యువత రాజకీయాల్లోకి రావాలని, వ్యాపార స్వాలాభం కోసం రావద్దన్నారు. నియోజకవర్గం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సముద్ర మట్టం నుంచి ఎత్తులో ఉన్న అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందించేందుకు రిటైర్డ్ ఇంజినీర్లతో సొంత ఖర్చుతో సర్వే చేయిస్తున్నట్లు పేర్కొన్నారు. లింగాల, బల్మూర్, అమ్రాబాద్, పదర మండలాల్లో దాదాపు 1.55లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. త్వరలో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా నియోజకవర్గంలో తలపెట్టిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ధారారం, లింగాల సర్పంచులు కవిత, తిరుపతయ్య, సింగిల్ విండో చైర్మన్ హన్మంత్రెడ్డి, సింగిల్ విండో మాజీ డైరెక్టర్ మల్లేశ్, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసులు, అజీం, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.