ప్రణీతా నదీతీరం ప్రకృతి రమణీయం. ఈ నది లోతైనది. నది పరీవాహక ప్రాంతంలో ప్రాచీన జీవరాశులకు సంబంధించిన అనేక అవశేషాలు లభించాయి. వృక్ష, రాతి శిలాజాలు అరుదుగా కనిపిస్తుంటాయి. కోట్ల సంవత్సరాల క్రితమే తెలంగాణ జీవ వైవిధ్యానికి నెలవుగా ఉందని ఇక్కడ లభించిన జంతు శిలాజాల ద్వారా తెలుస్తున్నది. మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లోని ప్రాణహిత, గోదావరి నదీతీరాల్లో ఆర్కియో స్టెరిక్స్ వంటి అరుదైన జీవుల ఆనవాళ్లు, రాక్షస బల్లుల శిలాజాలాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) తవ్వకాల్లో వెలికితీశారు. డైనోసార్స్ (రాక్షస బల్లి) అవశేషాల్ని హైదరాబాద్లోని బిర్లా మ్యూజియంలో చూడొచ్చు. అక్కడ బోర్డులో ‘వేమనపల్లి’పేరు కూడా కనిపిస్తుంది. ఇక్కడే దొరికిన మరికొన్ని మైసూర్ జువాలజికల్ పార్కులో ఉంచినట్లు చరిత్రకారులు చెబుతారు.
– మంచిర్యాల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)
కోట్ల సంవత్సరాల కిందట ఏర్పడిన భూ ప్రకంపనలతో భూమిపై ఉన్న జీవరాశులు భూమిలో కలిసిపోయి శిలాజాలుగా రూపాంతరం చెందాయి. ఇందులో భాగంగానే నది పరీవాహక ప్రాంతాల్లో చెట్లు, జీవరాశులు శిలాజాలుగా దర్శనమిస్తున్నాయి. ప్రాణహిత నదీ తీరం వెంట సుంపుటం, జాజుల పేట, రాజారాం గ్రామాల్లో జీవరాశులు, చెట్లు నేలలో కలిసిపోయి శిలాజాలుగా మారాయి. తాబేళ్లు, చేపలు, అటవీ జంతువులు, బురద పాములు, చెట్ల శిలాజాలు ప్రాణహిత ప్రాంతంలో దర్శనమిస్తున్నాయి.
చేపల ఆకారం, తాబేళ్ల గుంపు, పాములు, సొర చేపలు, తిమింగళాలు, అటవీ జంతువుల తలలను పోలినట్లు ఆకారాలు కనిపిస్తాయి. పెద్దపెద్ద వృక్షాలు సైతం శిలాజాలుగా మారిపోగా, ప్రకృతి ప్రేమికులు ఆసక్తిగా చూస్తున్నారు. అమెరికా లాంటి దేశాల్లో మాత్రమే ఉండేవని మనం భావించే రాక్షస బల్లుల అవశేషాలు మన దేశంలోనూ, అదీ మన తెలంగాణలోనూ లభించాయి. కొందరు విదేశీయులు కూడా వచ్చి, ఇక్కడ పరిశోధనలు నిర్వహించారు. 1980లో జీఎస్ఐకి చెందిన తెలుగు పరిశోధకులు పొన్నాల యాదగిరి అప్పటి ఆదిలాబాద్ జిల్లాలోని వేమనపల్లి (ప్రస్తుతం మంచిర్యాల జిల్లాలో) ప్రాంతంలో ఎగిరే రాక్షస బల్లి (ఆర్కియోప్టెరిక్స్) అవశేషాలను గుర్తించారు. డైనోసార్ ఎముకలు, వాటి గుడ్లు, గుడ్ల పెంకుల శిలాజాలు లభ్యమయ్యాయి.
హైదరాబాద్లోని బిర్లా సైన్స్ సెంటర్లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ‘డైనోసారియం’లో కనిపించే రాక్షస బల్లి ఆకృతిని 12 డైనోసార్లకు చెందిన 840 అవశేషాలతో రూపొందించారు. 150 లక్షల సంవత్సరాలకు పూర్వం భూ ఖండంపై సమస్త జీవరాశులుండేవి. అవి అంతరించిన 65 లక్షల ఏండ్లకు వాటి శిలాజాలు లభించాయి. క్రీ.శ.1822 ప్రాంతంలో రాక్షస బల్లికి సంబంధించిన శిలాజాన్ని కనుగొన్నారు. భయంకర రూపం గల రాక్షసబల్లి (డైనోసార్) శిలాజాలను ఆధునిక శాస్త్రజ్ఞులు 1970 నుంచి పరిశోధించడం మొదలు పెట్టారు. రాక్షసబల్లులు సరీసృప జాతికి చెందినవి. ఇవి ఉష్ణ రక్త జీవులు. పక్షుల వలె గూళ్లు నిర్మించుకొని గుడ్లను పొదిగేవి.
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలానికి చెందిన రాజారాం గ్రామం చారిత్రకంగా ప్రత్యేకతను సంతరించుకున్నది. ఈ గ్రామ శివారులో బృహత్ శిలలతో (బృహత్శిలలతో) మలిచిన 12, 13వ శతాబ్దం కాలం నాటి దశావతార విగ్రహాలున్నాయి. వీటిని యాదవ మహారాజు కుమారుడైన అమ్మన రాజు ప్రతిష్టించినట్లు శాసనాల ద్వారా తెలుస్తున్నది. వేమనపల్లిలోని శివాలయంలో ఉన్న అతి పెద్ద గణపతి విగ్రహం కూడా దశావతార విగ్రహాల కాలం నాటిదేనని స్థానికులు పేర్కొంటున్నారు. చెన్నూరులో శివలింగాలను ప్రతిష్ఠించిన అగస్త్య మహర్షి రాజారాం పరిసరాల్లోని దశావతార విగ్రహాలను సందర్శించి పూజలు చేసినట్లు, ఇక్కడి నుంచి కాళేశ్వరం వెళ్లినట్లు స్థల పురాణం చెబుతున్నది. చెన్నూర్ పాత తాలూకాలోనూ, చెన్నూర్ మండల పరిసర ప్రాంతాల్లో ఇతిహాస పూర్వ యుగాల నుంచి ప్రాణికోటి జీవిస్తున్నది. ప్రాణహిత నదీ తీరంలో మత్స్య, భూ జలచర శిలాజాలు పెద్దసంఖ్యలో ఉన్నాయి. ప్రాచీనావశేషాలు చెన్నూర్ ప్రాంతాన, లోయల్లో, ఇసుకమేటల్లో పరిశోధకులకు లభించాయి.