జియాగూడ : ఇటీవల తన తమ్ముడిని దొంగతనం కేసులో పోలీసుస్టేషన్కు తీసుకువచ్చారని అతడిని వదిలేయాలని కోరుతూ పోలీసుస్టేషన్ ఎదుట అత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. కుల్సుంపురా పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం…
ఈ నెల 4న జియాగూడలో ఓ ఇంటిలో బట్టలు చోరీకి గురికావడంతో బాధితులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి, ఒకరిపై అనుమానం వ్యక్తం చేశారు. కేసు నిమిత్తం జియాగూడ భారత్నగర్ ప్రాంతానికి చెందిన రాకేష్ను పోలీసు సిబ్బంది స్టేషన్కు తీసుకువచ్చారు.
అయితే రాకేష్ కొద్ది నెలల క్రితం చోరీ కేసులో అరెస్టయి జువైనల్ హోంకు వెళ్లి ఇటీవల బయటకు వచ్చాడు. తన తమ్ముడిని పోలీసులుస్టేషన్కు తీసుకువెళ్లారని సమాచారం అందుకున్న రాకేష్ అన్న రాజు పోలీసు స్టేషన్ ఎదుట నిలబడి చోరీకేసులో తన తమ్ముడికి ఎలాంటి సంబంధం లేదని విడిచి పెట్టాలని కోరాడు.
కొద్ది సేపు ఉండి పోలీసు స్టేషన్ నుండి తిరిగి ఇంటికి వెళ్లిపోయారు. కొద్ది సేపటి తరువాత పోలీసుస్టేషన్కు వచ్చిన రాజు మధ్యం మత్తులో పోలీసులను బెదిరించే క్రమంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నంలో భాగంగా నింపంటిం చుకున్నాడు. అప్రమత్తమైన పోలీసులు మంటలను ఆర్పి చికిత్స నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు.
60 శాతం కాలిన గాయలతో గత ఐదు రోజులుగా చికిత్స పొందుతూ అదివారం మధ్యాహ్నం 12.30 సమయంలో రాజు మృతి చెందాడు. దీంతో రాజు బందువులు, కుటుంబ సభ్యులు మృతి చెందిన రాజు మృతదేహన్ని కుల్సుంపురా పోలీసు స్టేషన్ వద్ద ఉంచి అందోళన చేసేందుకు సిద్దమయ్యారు.
రాజు మరణానికి కారణమైన పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బందువులు పెద్ద ఎత్తున ఉస్మానియా దవాఖానకు చేరుకుని అందోళన తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి బందువులను చెదరగొట్టారు.
రాజు మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమనిగింది. దీంతో రాజు మృతదేహన్ని బందువులు పోలీసు బందోబస్తు మధ్య పురానాపూల్ స్మశాన వాటికకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
మరో వైపు కుల్పుంపురా పోలీసు స్టేషన్ వద్ద ఎటువంటి అవంచనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలతో ఆసీఫ్నగర్ ఏసీపీ శివమారుతి, వివిధ పోలీసుస్టేషన్ల ఇన్స్పెక్టర్లు, ఎస్సైలు బందోబస్తు ఏర్పాటు చేశారు.