వైరస్ కట్టడికి వైద్యశాఖ చర్యలు
45ఏండ్లు దాటిన వారికి కొనసాగుతున్న వ్యాక్సినేషన్
మళ్లీ క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు
భౌతికదూరం, మాస్కులు కచ్చితం
నిబంధనలు పాటించకుంటే జరిమానా
నాగర్కర్నూల్, ఏప్రిల్6(నమస్తే తెలంగాణ): కరోనా సెకండ్ వేవ్పై వైద్యఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. గ్రామాలు, పట్టణాల్లో కరోనా నియంత్రణ చర్యలు చేపట్టేందుకు చర్యలు ముమ్మరం చేసింది. గతేడాది మార్చిలో ప్రారంభమైన కరోనా చివరి దశకు చేరుకోగా, ఈ మధ్యకాలంలో ఫంక్షన్లు, సమావేశాలు, సినిమా హాళ్లు తెరుచుకోవడంతోపాటు ప్రజల్లో నిర్లక్ష్యం కారణంగా మళ్లీ కేసులు పెరిగాయి. మార్కెట్లు, ఇతర కార్యక్రమాల్లో ఎవరూ మాస్కులు, భౌతికదూరం, శానిటైజేషన్ చాలా వరకు పాటించడం లేదు. దీంతో కరోనా కేసులు పెరుగుతుండటంతో తెరిచిన విద్యా సంస్థలను సైతం ప్రభుత్వం తిరిగి మూసివేయించింది. అయినా రోజు రోజుకూ కేసులు పెరుగుతుండటంతో సీఎం కేసీఆర్ ఆదేశంతో ప్రభుత్వ యంత్రాంగం తిరిగి పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. గతంలో జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రాలను తిరిగి ప్రారంభించే చర్యలు చేపట్టింది. ఆ కేంద్రాల్లో కావాల్సిన అదనపు బెడ్లు, వెంటిలేటర్ల్లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 60ఏళ్లు దాటిన వయో వృద్ధులతో పాటుగా 45ఏళ్లు నిండిన ప్రజలకు కరోనా వ్యాక్సిన్ వేస్తున్నారు.
మాస్క్ మస్ట్
ఇక కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మాస్కులు ధరించకుంటే రూ.1000చొప్పున జరిమానాలు విధించేందుకు ఆదేశించడం గమనార్హం. ప్రయాణాలు, ఇతర జన సమూహాల్లో మాస్కులు, భౌతిక దూరాన్ని మర్చిపోవద్దని ఆరోగ్య కార్యకర్తల ద్వారా అవగాహన చర్యలకు ఆదేశించారు. అలాగే ఈనెలాఖరు వరకు వేడుకలు, ఊరేగింపులు,ర్యాలీలు, మత,రాజకీయపరమైన కార్యక్రమాలు, జన సమూహాలను నియంత్రించేలా ఆదేశాలు జారీ చేశారు. గతంలో మాదిరిగా ట్రేసింగ్, టెస్టింగ్ విధానాన్ని అవలంభించనున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలో ఇలా..
కరోనా కట్టడికి జిల్లాలో కలెక్టర్ శర్మన్ ఆదేశంతో జిల్లా వైద్యఆరోగ్య శాఖ చర్యలు విస్త్రతం చేసింది. జిల్లాలో ఇప్పటి వరకు 10,605వరకు కేసులు నమోదుకాగా 384యాక్టివ్ కేసులు ఉన్నాయి. జిల్లాలో 29వేల రాపిడ్ టెస్టులు, 13వేల ఆర్టీ పీసీఆర్ పరీక్షలు, 1683రాపిడ్ ఆంటీజెన్ పరీక్షలు నిర్వహించారు. కరోనా నియంత్రణకు వైద్యఆరోగ్య శాఖకు ప్రత్యేక లక్ష్యం నిర్దేశించారు. ఇకపై ప్రతి రోజూ ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వంద, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో 200టెస్టుల చొప్పున రోజూ 300టెస్టులు చేయనున్నారు. అలాగే ప్రతిరోజూ 200ఆర్టీపీసీఆర్ పరీక్షలు సైతం చేయనున్నారు. ముఖ్యంగా వ్యాక్సినేషన్ను వేగవంతం చేయనున్నారు. ప్రతి రోజూ 3,500మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చేలా సిబ్బందికి లక్ష్యం నిర్దేశించారు. దీనికిగానూ ప్రతి ఆశ కర్యాకర్త 45సంవత్సరాలు నిండిన వాళ్లు రోజుకు 12మందికి వ్యాక్సిన్ ఇప్పించేలా ఆదేశించడం విశేషం.
ఇవి కూడా చదవండి..
జియో సంచలనం: స్పెక్ట్రం కోసం ఎయిర్టెల్తో టైఅప్!
రమ్యకృష్ణను ఏడిపించిన సీనియర్ హీరోయిన్ రేఖ