కొల్లాపూర్, సెప్టెంబర్ 29 : దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా అడిగి తెలుసుకొని పరిష్కరించేందుకు ఈనెల 27న రాత్రి కోడేరు మండల కేంద్రంలోని దళితవాడ ప్రజలతో ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి పల్లెనిద్ర చేస్తే జూపల్లి వర్గీయులకు కడుపుమంటెందుకని టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించారు. గురువారం పట్టణంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో దళితబంధు తాలూకా కోఆర్డినేటర్ కాటం జంబులయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు నిరంజన్, పట్టణ ప్రధాన కార్యదర్శి బండి శ్రీనివాసులుతోపాటు పలువురు దళిత నాయకులు మాట్లాడారు. సబ్బండ వర్గాల అభ్యున్నతి కోసం రాజకీయాలకతీతంగా ఎమ్మెల్యే బీరం పనిచేస్తున్నారని, అందు లో భాగంగానే కోడేరులో దళితకాలనీలోని ప్రజల సమస్యల పరిష్కారానికి కృషిచేస్తూ ప్రజల మన్ననలను చూరగొంటుండడంతో జీర్ణించుకోలేని జూపల్లి దళిత వర్గీయులకు కడుపుమంట్టెందుకని వారు ప్రశ్నించారు. నియోజకవర్గం ప్రజలు జూపల్లిని ఎమ్మెల్యేగా పట్టంకడితే 19 ఏండ్లుగా పాలించాడని, ఏనాడైనా దళితుల ఇండ్లల్లో భోజనం చేసి అదేకాలనీలో పల్లెనిద్ర చేసిన పాపానపోలేదని వారు విమర్శించారు.
పల్లెనిద్రలో భాగంగా దళితుల సమస్యలను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే బీరం పల్లెనిద్ర చేస్తే జూపల్లి వర్గీయులు రాద్దాంతం చేస్తున్నరని వారు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం తొలి విడుతలో నియోజకవర్గానికి దళితబంధు పథకం కింద వంద యూనిట్లు మంజూరు చేస్తే అందులో రాజకీయాలకతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఎమ్మెల్యే బీరం నిధులు గ్రౌండింగ్ చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మాదవరావుపేటలో తల్లిదండ్రులు, ఇల్లు లేని జూపల్లి వర్గానికి చెందిన యాదగిరికి దళితబంధు పథకాన్ని ఎమ్మెల్యే బీరం మంజూరు చేశారని వారు పేర్కొన్నారు.
అదే జూపల్లి మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్లు పంపకంలో మీ నాయకుడు ఎవరికి పెద్దపీట వేశారో ఒకసారి ఆత్మాపరిశీలన చేసుకోవాలని టీఆర్ఎస్ దళితనాయకులు జూపల్లి దళితవర్గీయులకు సవాల్ విసిరారు. ఎమ్మెల్యే బీరంపై లేనిపోనివి మాట్లాడడం మానుకోవాలని జూపల్లి దళిత వర్గీయులకు వారు హితవుపలికారు. జూపల్లి మంత్రిగా ఉంటూ నాడు దళిత సర్పంచులైన ఎన్మన్బెట్లలో మంచాల మల్లయ్య, సింగవట్నంలో వెంకటస్వామి చెక్పవర్ రద్దుచేయించడం, కొండ్రావుపల్లి సర్పంచ్ రాజేశ్, కుడికిళ్ల శివానందంపై రౌడీషీటర్ ఓపెన్ చేయించి, పచ్చిదళిత వ్యతిరేకిగా వ్యవహరించారని, ఇది నిజం కాదా అని టీఆర్ఎస్ దళితనాయకులు ప్రశ్నించారు. ఎమ్మె ల్యే బీరం దళితుల పక్షపాతి అని వారు పేర్కొన్నారు.
సమావేశంలో టీఆర్ఎస్ దళిత నాయకులు మూలే కేశవులు, బొరెల్లి మహేశ్, బిజ్జవేణు, కాడంశ్రీను, గడవండ్లశ్రీను, పలకరాముడు, అర్జున్, పుట్టపాగ నాగరాజు, కలమంద శ్రీను, రఘుపతి, వేణు, జెట్టిశివ, శ్యాం, పెరుమాండ్లస్వామి, బొరెల్లి రవి, కుర్మయ్య, మారెడు కుమార్, పస్పుల మధు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.