కల్వకుర్తి, నవంబర్ 10 : రాష్ట్రంలో సాగవుతున్న పత్తి పంటకు అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నదని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని తర్నికల్ గ్రామ సమీపంలో బాలాజీ జిన్నింగ్ మిల్లును ఎంపీ రాములు, ఎమ్మెల్యే జైపాల్యాదవ్, జెడ్పీ చైర్పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ బాలాజీ సింగ్, రాష్ట్ర టీఆర్ఎస్ నాయకులు గోళి శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ విజితారెడ్డితో కలిసి మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన పత్తి పండుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో 400 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల వ్యవసాయ రంగం ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. యాసంగిలో వరి సాగుచేసి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. అవసరాల నిమిత్తం, ఏదైనా కమిట్మెంట్ ఉంటే తప్పా వరి సాగు చేయొద్దన్నారు. ప్రత్యామ్నాయంగా నూనె గింజలు, పప్పు ధాన్య పంటలు వేయాలని వివరించారు. రైతులకు అన్ని విధాలా అండగా ప్రభుత్వం ఉంటుందని భరోసా ఇచ్చారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని చెప్పారు. ప్రతిపక్ష పార్టీల నేతలు విషయ పరిజ్ఞానం లేకుండా ప్రజలకు తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. కార్యక్రమంలో జిన్నింగ్ మిల్లు నిర్వాహకులు లింగారెడ్డి, నర్సింహారెడ్డి, కల్వకుర్తి ఎంపీపీ సునీత, వైస్ ఎంపీపీ గోవర్ధన్, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలయ్య, వైస్ చైర్మన్ విజయ్గౌడ్, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు పాల్గొన్నారు.