మేలో సీఎం కేసీఆర్తో ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన
20 రోజుల్లో సర్వే పనులు పూర్తి
కొండనాగుల వద్ద సర్వే పనులు పరిశీలించిన ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట, మార్చి 31: అచ్చంపేట ఎత్తిపోతల పథకంతో నల్లమల ప్రాంతానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందజేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని, మేనెలలో సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రాజెక్టు నిర్మాణానికి భూమిపూజ చేయించనున్నట్లు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. బుధవారం బల్మూర్ మండలం కొండనాగుల వద్ద సర్వే పనులను పరిశీలించారు. అచ్చంపేట ఎత్తిపోతల పథకం పనులను సర్వే ఏజెన్సీ ఏ విధంగా చేస్తున్నారు, ఎన్ని రోజుల్లో పూర్తి చేయనున్నారు తదితర అంశాలను పరిశీలించారు. రైతుల పొలాల వెంట వెళ్లి సర్వేను పరిశీలించి మాట్లాడారు. 20 రోజుల్లో సర్వే పనులు పూర్తికానున్నాయని మరో 20రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తయిన వెంటనే ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామన్నారు.
సాధ్యమయ్యే వరకు డిసెంబర్ నాటికి అచ్చంపేట ప్రాంతానికి పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలనే లక్ష్యంతో ఉన్నామన్నారు. ప్రాజెక్టు పనులు ఎక్కడా ఆలస్యం కాకుండా త్వరితగతిన పూర్తి చేయించే విధంగా పనిచేస్తామన్నారు. బల్మూర్ వద్ద నిర్మించే ఉమామహేశ్వరం రిజర్వాయర్ నుంచి లింగాల, బల్మూర్ మండలాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. మన్ననూర్ వద్ద నిర్మించనున్న చెన్నకేశవ రిజర్వాయర్ నుంచి అమ్రాబాద్, పదర మండలాలకు సాగునీరు అందుతుందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో రెండు రిజర్వాయర్లు మంజూరు చేయించుకొని ముందే నామకరణం చేసుకొని సర్వే ప్రారంభించడం సీఎం కేసీఆర్కు నల్లమల ప్రాంతం, రైతుల పట్ల బాధ్యతకు నిదర్శనమన్నారు. ఈ ప్రాజెక్టు తొందరగా పూర్తయి నీళ్లు పారించుకోవాలంటే రైతులు పూర్తిగా సహకరించాలని కోరారు. భూములు కోల్పోతున్న రైతులు పెద్ద మనసుతో సహకరించి అండగా నిలబడితేనే సాధ్యమవుతుందన్నారు. రైతులు ఆత్మగౌరవంతో జీవించి దారిద్య్రాన్ని తొలగించేవిధంగా సీఎం కేసీఆర్ను ఒప్పించి ప్రాజెక్టు తీసుకొచ్చామన్నారు. అనంతరం గువ్వల బాలరాజును రైతులు, ప్రజాప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ సీఎంరెడ్డి, కొండనాగుల పీఎసీసీఎస్ చైర్మన్ నర్సయ్యయాదవ్, సింగిల్విండో డైరెక్టర్ శ్రీపతిరావు, సర్పంచ్ రేవతి, జెడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, పార్టీ మండలాధ్యక్షుడు చుక్కారెడ్డి, శంకర్గౌడ్, ఇద్రిస్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రైతుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. బుధవారం స్థానిక సింగిల్విండో చైర్మన్ భూపాల్రావు అధ్యక్షతన నిర్వహించిన విండో మహాజన సమావేశానికి హాజరై మాట్లాడారు. రాష్ట్రంలోనే ఉప్పునుంతల సొసైటీకి ప్రత్యేక గుర్తింపు ఉన్నదని, లాభాల బాటలో నడుస్తూ రాష్ట్రంలోని మిగతా సొసైటీలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. అందుకుగానూ పార్టీలకతీతంగా సొసైటీని అభివృద్ధి పర్చుకోవాలన్నారు. అనంతరం విప్ గువ్వల బాలరాజును కార్యాలయ సిబ్బంది సన్మానించారు. సమావేశంలో జెడ్పీటీసీ ప్రతాప్రెడ్డి, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ సీఎం రెడ్డి, పాలశీతలీకరణ చైర్మన్ గోపాల్రెడ్డి, సర్పంచ్ సరితాఅనంతారెడ్డి, సీఈవో రవీందర్రావు, డైరెక్టర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గ్యాస్ ఏజెన్సీని సద్వినియోగం చేసుకోవాలి
ఉప్పునుంతల మండల కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన జాషువా ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. ఉప్పునుంతలలో ఏర్పాటు చేసిన ఇండియన్ గ్యాస్ ఏజెన్సీని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల అవసరాల దృష్ట్యా అందుబాటులో గ్యాస్ ఏజెన్సీలు ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం విరివిగా కొత్త ఏజెన్సీలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులను గ్యాస్ ఏజెంట్ ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తాసిల్దార్ కృష్ణయ్య, ఎస్సై రమేశ్, ఏజెన్సీ నిర్వాహకులు మురళి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చుడండి
ఖర్చు 400 కోట్లు ఆమ్దాని 4 లక్షల కోట్లు!