ఆత్మకూరు/శ్రీశైలం, అక్టోబర్ 17 : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు వరద స్వల్పంగా కొనసాగుతున్నది. ఆదివారం సాయంత్రం వరకు 26,800 క్యూసెక్కుల ఇన్ఫ్లో నమోదైంది. దీంతో ఆయకట్టుకు, నెట్టెంపాడుకు 750, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 730, సమాంతర కాలువకు 150 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి తగ్గడంతో విద్యుదుత్పత్తికి 19,438 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దీంతో ఎగువ, దిగువ విద్యుత్కేంద్రాల్లోని 6 యూనిట్లు మాత్రమే వినియోగిస్తున్నారు. ఎగువ జూరాలలో 3 యూనిట్లలో 3.871 మి.యూ. ఉత్పత్తి జరుగగా.. మొత్తంగా 301.847 మి.యూ. ఉత్పత్తి జరిగింది. దిగువ జూరాలలోనూ 3 యూనిట్లలో 4.210 మి.యూ. ఉత్పత్తి జరుగగా మొత్తంగా 326.013 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తి జరిగింది. ఎగువ జూరాల కేంద్రంలో 300 మి.యూ. పూర్తికావడంపై ఎస్ఈ జయరాం హర్షం వ్యక్తం చేశారు. డ్యాం పూర్తి సామర్థ్యం 9.657 టీఎంసీలు ఉండగా.. 9.521 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మొత్తంగా 21,979 క్యూసెక్కులు అవుట్ఫ్లోగా నమోదైనట్లు డ్యాం అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద కొనసాగుతున్నది.
శ్రీశైలం జలాశయానికి..
ఎగువ ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం వరకు 72,852 క్యూసెక్కుల ఇన్ఫ్లో రిజర్వాయర్కు వచ్చి చేరినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 884.80 అడుగల నీటి నిల్వలు నమోదైనట్లు పేర్కొన్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం 215.807 టీఎంసీల నీటి నిల్వ ఉండాల్సి ఉండగా 214.8450 టీఎంసీలు నిల్వ ఉన్నాయని తెలిపారు. మొత్తంగా అవుట్ఫ్లో 59,023 క్యూసెక్కులుగా నమోదైనట్లు అధికారులు చెప్పారు.