అలంపూర్, అక్టోబర్ 16: దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి చివరిరోజు జోగుళాంబ అమ్మవారి ఆలయ సమీపంలోని తుంగభద్రనదిలో ఆదిదంపతులకు జలవిహారం(తెప్పోత్సవం) కనులపండువగా నిర్వహించారు. వేడుకలకు కలెక్టర్ వల్లూరు క్రాంతి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే డాక్టర్ వీఎం అబ్రహం, అలంపూర్ మున్సిపల్ చైర్పర్సన్ మనోరమ తదితరులు హాజరయ్యారు. చల్లని చంద్రుడి చలువనీడలో నదీతీరంలో అలల జలసవ్వడిలో ఆదిదంపతుల నది విహారం వీక్షించడానికి భక్తులు అశేషంగా తరలొచ్చారు. అమ్మవారి ఆలయం యాగశాలలో పూర్ణాహుతి సమర్పించారు. దశమిరోజు ఉదయం నుంచి శమీపూజ, అవబృతస్నపనం, సాయంత్రం 4గంటలకు శమీపూజ, ధ్వజారోహన కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం నదీహారతి నిర్వహించారు. ఉత్సవాల్లో అమ్మవారిని శాంతింపచేయడంలో భాగంగా చివరి రోజు ఆదిదంపతులను ఆలయాల సమీపంలోని పవిత్ర తుంగభద్రనదిలో పూజలు చేశారు. రాత్రి 7గంటలకు జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరుల నామస్మరణతో అర్చకుల తెప్పోత్సవం నిర్వహించారు. జలవిహారానికి ముందు జోగుళాంబమాత దీక్ష చేపట్టిన భక్తులు ఉత్సవమూర్తులను నది వద్దకు ప్రత్యేక పల్లకీలో తీసుకొచ్చారు. హంసవాహనసేవ, నదీహారతి తర్వాత ఉత్సవమూర్తులను ఆలయానికి తీసుకొచ్చారు. వేడుకల్లో భక్తులు, ఆలయ ఈవో వీరేశం, పాలకమండలి చైర్మన్ రవిప్రకాశ్గౌడ్, ధర్మకర్తలు, గ్రామస్తులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఉత్సవాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన వివిధ శాఖల అధికారులు, ఆలయ సిబ్బంది, అర్చకులు, పట్టణ ప్రముఖులకు ఆలయ ఈవో, చైర్మన్ కృతజ్ఞతలు తెలిపారు.