భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ధరణి పోర్టల్ ద్వారా ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించేందుకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ధరణి కియోస్క్ ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లాలో 20,172 దరఖాస్తులు రాగా.. 18,850 సమస్యలను పరిష్కరించారు. తాసిల్దార్లు, రెవెన్యూ అధికారుల సహకారంతో సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో కలెక్టరేట్కు వచ్చే బాధితులు మీ సేవ కోసం ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించారు. దీంతో సమస్యలకు సత్వర పరిష్కారం లభించనున్నది.
మహబూబ్నగర్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో వివిధ భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ సంజీవనిగా మారింది. ధరణి ద్వారా దశాబ్దాలుగా ఉన్న భూ సమస్యలు పరిష్కారమవుతున్నాయి. రెవెన్యూశాఖలో అవినీతికి తావు లేకుండా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెరిగింది. స్వాతంత్య్రానికి పూర్వం నుంచి ఉన్న వ్యవస్థలో మార్పును తీసుకొచ్చే క్రమంలో అక్కడక్కడా కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. గతంలో ఏ పని చేయాలన్నా తప్పనిసరిగా పేపర్ల ద్వారానే ఉండేది. అయితే ఇప్పుడు ధరణిలో కాగిత రహితంగా, మనుషులు నేరుగా అధికారులను కలవాల్సిన అవసరం లేకుండానే అన్ని ప్రక్రియలు పూర్తయ్యేలా వ్యవస్థను తీర్చిదిద్దారు. ధరణి ఏర్పాటు తర్వాత రెవెన్యూ వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి. అవినీతికి అవకాశం లేకుండా ప్రతి పని నిర్ణీత గడువు లోగా పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. అయితే గ్రామీణ ప్రాంతాల వారు, నిరక్షరాస్యులు, అవగాహన లేని వారు ధరణి పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు తదితర పనుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటన్నింటికీ క్రమం తప్పకుండా ప్రభుత్వం పరిష్కారాలు చూపిస్తున్నది. భూసమస్యల పరిష్కారం కోసం ఇబ్బంది పడుతున్న వారి సమస్యలు తీర్చేందుకు మహబూబ్నగర్ కలెక్టర్ ఎస్ వెంకట్రావు చేసిన ఆలోచనతో ధరణి కియోస్క్ ఏర్పడింది. 6వారాల పాటు భూసమస్యలకు ఈ ధరణి కియోస్క్ సమగ్ర పరిష్కార వేదికగా ఉండనున్నది. ఇప్పటికే మూడు సోమవారాలు ఈ ధరణి కియోస్క్ సేవలు అందిస్తోంది. దీనికి అదనంగా అక్కడికక్కడే రెవెన్యూ సమస్యల అర్జీలు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు కలెక్టరేట్లోనే తొలిసారిగా మీ సేవ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 11న కలెక్టర్ కార్యాలయ ఆవరణలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ధరణి ప్రజావాణిలో అర్జీలు పెట్టుకునే వారి కోసం ప్రత్యేక మీసేవ కేంద్రాన్ని కలెక్టర్ వెంకట్రావు ప్రారంభించారు.