మిర్యాలగూడ టౌన్, జనవరి 17 : నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో కాంగ్రెస్ సభ్యత్వ నమోదు కోసం ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. సీనియర్ నేతలు ఉత్తమ్కుమార్రెడ్డి, జానారెడ్డి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నోటికి పని చెప్పారు. మిర్యాలగూడలోని నూకల వెంకట్రెడ్డి ఫంక్షన్హాల్లో సోమవారం కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు సమావేశం ఏర్పాటు చేశారు. నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు కుందూరు జానారెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. వేదిక మీద ఉన్న ఫ్లెక్సీలో మిర్యాలగూడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి (బీఎల్ఆర్) ఫొటో లేకపోవడంతో కొంతమంది కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆ తర్వాత సీనియర్ నాయకులైన పగిడి రామలింగయ్య, పొదిలి శ్రీను, చిరుమర్రి కృష్ణయ్య, వేములపల్లి ఎంపీపీ పుట్టల సునీత, తమ్మడబోయిన అర్జున్, పయిడిమర్రి నర్సింహారావును వేదిక పైకి పిలువకపోవడంతో వారంతా అలిగి బయటకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి వారికి సర్దిచెప్పి వేదికపైకి పిలిచేందుకు ప్రయత్నించగా, సీనియర్ నాయకులను అవమానించడం సరికాదంటూ పొదిలి శ్రీను, కృష్ణయ్య ఉత్తమ్ను నిలదీశారు. దాంతో డీసీసీ అధ్యక్షుడు కేతావత్ శంకర్నాయక్ జోక్యం చేసుకొని పొరపాటు జరిగిందని, మరోసారి జరుగకుండా చూస్తామని కోరడంతో వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత బీఎల్ఆర్ మాట్లాడుతున్న సమయంలో పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా ఈలలు వేయడంతో శంకర్నాయక్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే జానారెడ్డి దగ్గర ఉన్న మైక్ను తీసుకుని ‘జనాలు మీకే కాదు.. మాక్కూడా ఉన్నారు. మేమూ తెచ్చుకుంటాం. మా ఓట్లు కూడా చాలా ఉన్నాయి. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ కూర్చుంటానంటే ఊరుకుంటామా? వ్యక్తిగత భజనలు మానుకోవాలి’ అంటూ బీఎల్ఆర్ వర్గాన్ని ఉద్దేశించి గట్టిగా మాట్లాడారు. దాంతో వేదిక మీదున్న చిలుకూరి బాలు, కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు నూకల వేణుగోపాల్రెడ్డి.. శంకర్నాయక్ మీదికి దూసుకెళ్లారు. ఈ పరిణామంతో ఒక్కసారిగా శంకర్నాయక్ మద్దతుదారులు, బీఎల్ఆర్ మద్దతుదారులు వేదికపైకి వచ్చి రసాభాస చేశారు. వివాదం పెరుగుతున్నా ఎంపీ ఉత్తమ్కుమార్రెడ్డి జోక్యం చేసుకోలేదు. చివరికి జానారెడ్డి మైక్ తీసుకుని ‘పార్టీ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే వెంటనే సస్పెండ్ చేస్తాం. నేను కూడా మీలాగే పది మందిని తీసుకొచ్చి గొడవ చేస్తున్న వారిని బయటకు పంపగలను’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఇలాగే ఓ వ్యక్తి ఈలలు, చప్పట్లు కొట్టించుకుని నేడు అడ్రస్ లేకుండా పోయిండు మళ్లీ అదే పునారావృతం చేయకండి.. ప్రొటోకాల్ విషయంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయని, అంతమాత్రాన గొడవకు దిగడం ఏమిటని మందలించారు. ‘మిర్యాలగూడలో ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగినా ఇక నుంచి వేదిక మీదికి రాను, కార్యకర్తల మధ్యనే కూర్చుం టా’ అని జానారెడ్డి అన్నారు. మొత్తానికి అంపశయ్య మీద ఉన్న కాంగ్రెస్ పార్టీని అంతర్గత విబేధాలతో పూర్తిగా గొంతు నులిమేట్టు ఉన్నారని ఆ పార్టీ కార్యకర్తలు బహిరంగంగానే మాట్లాడుకుంటూ సమావేశం నుంచి వెళ్లిపోయారు.
సమావేశానికి దూరంగా అమరేందర్రెడ్డి వర్గీయులు
డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి వర్గీయులు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది. గత ఎన్నికల్లో పార్టీ టికెట్ ఆశించి భంగపడిన అమరేందర్రెడ్డి అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన ఆయన తన అనుచరులకు భారీ విందు ఇచ్చి తాను కూడా ఎన్నికల బరిలో ఉన్నట్లు పార్టీ అధిష్టానికి సంకేతాలు ఇచ్చారు. ఇప్పటికే సీనియర్ నాయకులతో టచ్లో ఉన్నట్లు తెలుస్తుంది.
మనసులో మాటను బయటపెట్టిన జానా
వివాదం మధ్యలో జానారెడ్డి స్పందిస్తూ.. ఆసక్తికర వ్యాఖ్య చేశారు.‘మిర్యాలగూడలో వారు, వీరు కాదు. నేనే పోటీ చేయాలనుకుంటున్నాను. చేయాలా, వద్దా? చెప్పండి. చేయాలనే వారు చేతులెత్తండి’ అంటూ సమావేశంలోని కార్యకర్తలపైకి కొత్త ప్రశ్నను వదిలారు. మొత్తం సమావేశానికి హాజరైన వారిలో 30శాతం మందికి లోపే చేతులెత్తడం గమనార్హం. ఆ వెంటనే జానారెడ్డి మాట మార్చి పార్టీ ఎవరిని పోటీ చేయమంటే వారే పోటీ చేస్తారు. అప్పటి వరకు పార్టీ సిద్ధ్దాంతాలకు లోబడి పని చేయాలని చెప్పుకొచ్చారు.