మెదక్/సిద్దిపేట అర్బన్/సంగారెడ్డి అర్బన్, జనవరి 20 : కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా నేటి నుంచి ఇంటింటి జ్వరం సర్వే చేసి, కొవిడ్ను కట్టడి చేద్దామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. పకడ్బందీగా సర్వే చేపట్టి, లక్షణాలున్న వారికి అక్కడికక్కడే హోం ఐసొలేషన్ కిట్లు ఇవ్వాలని మంత్రి హరీశ్రావు ఆదేశించారు. గురవారం హైదరాబాద్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, సీఎస్ సోమేశ్కుమార్తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొవిడ్ నియంత్రణ చర్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. గ్రామాలు, వార్డుల వారీగా టీమ్లను ఏర్పాటు చేసి, ప్రతి రోజూ 25 ఇండ్లలో ఇంటింటి సర్వే నిర్వహించాలని ఆదేశించారు. ఆశవర్కర్, ఏఎన్ఎం, మున్సిపల్, గ్రామపంచాయతీ సిబ్బందితో ఇంటింటి సర్వే టీంను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమం 3, 4 రోజుల్లో పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. సర్వే టీంలు ప్రతీ ఇంటికెళ్లి, ఆ కుటుంబంలో ఎవరైనా దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారా? అని అడిగి తెలుసుకొని, కొవిడ్ లక్షణాలతో బాధపడేవారిని గుర్తించి, హోంఐసొలేషన్ కిట్ ఇవ్వాలన్నారు. ప్రభు త్వం ద్వారా సరఫరా చేస్తున్న హోం ఐసొలేషన్ కిట్లోని మందులు చాలా బాగా పని చేస్తున్నాయని, 5 రోజలు వాడితే సరిపోతుందని తెలిపారు. ఐసొలేషన్ కిట్ ఇచ్చిన వారిని సర్వే టీంలు ప్రతిరోజూ వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించాలని సూచించారు. 5 రోజుల తర్వాత కూడా దగ్గు, జ్వరంతో బాధపడితే, వారిని వెంటనే దగ్గరలోని దవాఖానల్లో చేర్పించాలన్నారు. గత అనుభవంతో పకడ్బందీగా సర్వేను చేయాలన్నారు.
వ్యాక్సినేషన్ను వేగవంతం చేయాలి..
కొవిడ్ నియంత్రణకు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంత చేయాలని వైద్యాధికారులను మంత్రి ఆదేశించారు. 15-17ఏండ్ల వారికి మొదటి డోస్ వ్యాక్సినేషన్, బూస్టర్ డోస్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, అర్హులైన వారందరికీ వంద శాతం వ్యాక్సినేషన్ చేయించాలన్నారు. అలాగే ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ బూస్టర్ డోస్ వేయించాలని సూచించారు. అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా దవాఖానల్లో కొవిడ్ ఓపీ సేవలు నిర్వహించాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో కొవిడ్ టెస్టింగ్, హోం ఐసొలేషన్ కిట్లు, మందుల నిల్వలు ఉన్నాయని, అందుబాటులో లేని వారు వెంటనే ముందస్తుగా నిల్వ ఉంచుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ సౌకర్యంతో కొవిడ్ వార్డులు ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ దవాఖానల వైద్యులతో కలెక్టర్లు రివ్యూ చేయాలన్నారు. కొవిడ్ రోగులకు మంచి పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించాలన్నారు. ప్రజలందరూ మాస్క్ల ధరించేలా పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు మాట్లాడుతూ కొవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా గ్రామానికి ఒక నోడల్ ఆఫీసర్ను నియమించాలని అధికారులను ఆదేశించా రు. ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ మాట్లాడుతూ ఇంతవరకు కొవిడ్తో మరణించిన వారికి ప్రభుత్వం చెల్లించే ఎక్స్గ్రేషియా త్వరగా మంజూరు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ అధ్యక్షతన కమిటీలు ఉన్నాయన్నారు. మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకున్న కేసులను వెంటనే పరిష్కరించి, ఆర్థిక సహాయం మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలో కొవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటు చేయాలన్నారు. కొవిడ్ సెంటర్లలో డాక్టర్లు, సిబ్బందిని నియమించాలన్నారు. కొవిడ్ సెంటర్లలో ఉన్న రోగులకు పౌష్టికా హారం అందించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో సిద్దిపేట , సంగారెడ్డి అదనపు కలెక్టర్లు ముజామ్మిల్ఖాన్, రాజర్షి షా, మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, సిద్దిపేట, మెదక్ డీఎంహెచ్వోలు డాక్టర్ మనోహర్, వెంకటేశ్వర్రావు, సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ గాయత్రీదేవి, సిద్దిపేట, సంగారెడ్డి డీపీవోలు కౌసల్య, సతీశ్రెడ్డి, మెదక్ మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.
మెదక్లో మొదటి డోస్ 111శాతం పూర్తి..
మెదక్ జిల్లాలో మొదటి డోసు 111 శాతం వేయగా, రెండో డోసు 86 శాతం వేశామని కలెక్టర్ హరీశ్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. 15 నుంచి 17ఏండ్లలోపు వారికి 73శాతం టీకా వేశామని, బూస్టర్ డోసుగా 3,617 మందికి కరోనా టీకాలు వేశామని మంత్రికి వివరించారు. శుక్రవారం నుంచి అన్ని గ్రామాల్లో ఇంటింటి జ్వర సర్వే చేపడుతామన్నారు. ఒమిక్రాన్ వేరియంట్పై అవగాహన కలిగిస్తామన్నారు. మెదక్, నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట దవాఖానల్లో 170 ఐసొలేషన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. కరోనా బారిన పడి చనిపోయిన 328 కుటుంబాలకు త్వరలో ఎక్స్గ్రేషియా అందించనున్నామన్నారు.
సంగారెడ్డిజిల్లాలో ఆక్సిజన్, మందులు సిద్ధం
సంగారెడ్డి జిల్లాలో టీకా తీసుకోవడానికి అర్హులైన 11.94లక్షల మందికి మొదటి డోస్ వంద శాతం పూర్తయిందని, రెండో డోస్ 71శాతం పూర్తయినట్లు కలెక్టర్ హనుమంతరావు తెలిపారు. జిల్లాలోని 29 పీహెచ్సీలు, 4 యూపీ హెచ్సీలు, 2 సీహెచ్సీల్లో ఆక్సిజన్, కావాల్సిన మందులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలో మొత్తం 250 బెడ్లు, 3 కొవిడ్ కేర్ సెంటర్లు సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లా దవాఖానలో 100, మీర్జాపూర్ పీహెచ్సీ 50, జహీరాబాద్ కల్వరి టెంపుల్లో 100 పడకల కొవిడ్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జిల్లాలో 771 కొవిడ్ ఎక్స్గ్రేషియా దరఖాస్తులు రాగా, 705 పరిష్కరించామని, మిగిలిన వాటిని త్వరలో పరిష్కరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.