ఖమ్మం నగరానికి చెందిన ఓ బాలుడు ఆరో తరగతి చదువుతున్నాడు. కొవిడ్ సెకండ్ వేవ్లో ప్రతిరోజూ తండ్రి మొబైల్ ఫోన్ ద్వారా ఆన్లైన్ క్లాసులు వింటున్నాడు. ఈ సమయంలో మొబైల్కు ఒక కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి బాలుడిని మాటల్లో పెట్టాడు. ఈలోపు మొబైల్కు ఓటీపీ వచ్చింది. సైబర్ మోసగాడి మాటలు నమ్మిన బాలుడు ఓటీపీ చెప్పాడు. అంతే.. క్షణాల్లో బాలుడి తండ్రి బ్యాంకు ఖాతా నుంచి వేలాది రూపాయిలు మరొకరికి ఖాతాకు వెళ్లాయి. ఆలస్యంగా ఈ విషయాన్ని తెలుసుకున్న తండ్రి లబోదిబోమన్నాడు. ఇలా అనేక రూపాల్లో ఎంతోమంది నష్టపోయారు. సైబర్ నేరగాళ్ల బారిన పడకూడదంటే ఈ కథనం చదవాల్సిందే.
తల్లిదండ్రులూ అప్రమత్తంగా ఉండండి.. సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు. పిల్లలు ఆన్లైన్ తరగతులకు మొబైల్ ఫోన్ వినియోగిస్తున్నారు. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలను ఓ కంట కనిపెడుతుండాలి. రోజువారీగా పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. పిల్లలకు ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించాలి. సైబర్ క్రైం గురించి తెలియజెప్పాలి. అన్నోన్ కాల్స్, వీడియో కాల్స్ అటెండ్ చేయవద్దని, అన్నోన్ మెసేజెస్కు స్పందించవద్దని చెప్పాలి.
ఖమ్మం ఎడ్యుకేషన్, జనవరి 17: సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఇంటర్నెట్ వేదికగా కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం పాఠశాలలకు సెలవులు పొడిగించడంతో పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్స్లో పిల్లలు ఆన్లైన్ క్లాసులకు అలవాటు పడ్డారు. మొబైల్ వినియోగంపై పిల్లలకు అవగాహన వచ్చింది. సెల్ఫోన్ చేతిలో పట్టుకుని ఇంటర్నెట్ ఆన్ చేసి యూట్యూబ్ వీడియోలు చూస్తున్నారు. వీడియో గేమ్స్ ఆడుతున్నారు. పిల్లల అమాయకత్వాన్ని వాడుకుని క్యాష్ చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్లు ఈ తరహా సైబర్ నేరాలు ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నానాటికీ ఎక్కువవుతున్నాయి.
తల్లిదండ్రులు గురువులుగా మారాలి..
సాంకేతికత పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రపంచమంతా ఒక కుగ్రామం. ఇంటర్నెట్ చేతిలో ఉంటే చాలు ప్రపంచం అరచేతిలో ఉన్నట్లే. ఆర్థిక లావాదేవీల నుంచి సినిమాల వరకు, బ్యూటీ టిప్స్ నుంచి ఎడ్యుకేషన్ వరకు.. ఇలా అన్ని విధాలుగా ఇంటర్నెట్ ఉపయోగపడుతున్నది. ఎదిగే పిల్లలపై ఇంటర్నెట్ ప్రభావం కచ్చితంగా ఉంటుంది. ‘వాళ్ల బాగోగులు వారే చూసుకుంటారు..’ అనే భ్రమలో కొందరు తల్లిదండ్రులు ఉంటారు. తెలిసీ తెలియక పిల్లలు తప్పటడుగులు వేయకూడదంటే తల్లిదండ్రులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. అవసరమైతే గురువుల అవతారం ఎత్తాలి. పిల్లలకు ‘కంప్యూటర్, ల్యాప్టాప్, మొబైల్ సౌకర్యం ఇప్పించాం..’ అనుకుని అంతే వదిలేస్తే ఎంతో ప్రమాదం. రోజువారీ సమయంలో పిల్లల కోసం కొంత సమయం కేటాయించాలి. పిల్లలకు ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన కల్పించాలి. సైబర్ క్రైం గురించి తెలియజెప్పాలి. అన్నోన్ కాల్స్, వీడియో కాల్స్ అటెండ్ చేయొద్దని, అన్నోన్ మెసెజేస్కు స్పందించవద్దని చెప్పాలి.
షాపింగ్ యాప్స్తోనూ..
ఇప్పుడంతా ఆన్లైన్ షాపింగ్లే ట్రెండింగ్. అరచేతిలో మొబైల్ ఉంటే చాలు ఫుడ్ ఆర్డర్ నుంచి గ్యాడ్జెట్స్ వరకు అన్నింటినీ బుక్ చేసుకోవచ్చు. మన ఇంటి తలుపులు వెతుక్కుంటూ వస్తువులు మన వద్దకు చేరుకుంటాయి. ముఖ్యంగా ఈ యాప్స్ అంటే పిల్లలకు క్రేజ్. అమెజాన్, ఫ్లిప్కార్ట్, జొమాటో, స్విగ్గీ.. అనే పేర్లు పెద్దలకు తెలియవేమో గానీ ఈ తరం పిల్లలు అప్డేట్గా ఉంటారు. స్వయంగా ఆ యాప్స్ను ఆపరేట్ చేస్తారు. ఇలాంటి అనుభవమే ఎదురైంది ఇటీవల ఖమ్మం నగరానికి చెందిన ఓ జంటకు. ఒకరోజు వారి ఇంటికి డెలివరీ బాయ్ వచ్చి ఓ ప్యాకెట్ ఇచ్చాడు. దానిలో రూ.3 వేల విలువైన ‘డ్రెస్ మెటిరీయల్’ ఉంది. తాము బుక్ చేయలేదంటే బుక్ చేయలేదు.. అంటూ ఒకరి ముఖాన్ని మరొకరు చూసుకున్నారు. తీరా ఆరా తీస్తే తెలిసిందేమిటంటే ఐదోతరగతి చదువుతున్న తమ కుమార్తె ఆ ఆర్టర్ బుక్ చేసిందని. ఇటీవల ఇలాంటి ఘటనలూ వెలుగు చూస్తున్నాయి.
కాస్తంత సమయం కేటాయించాలి..
వృత్తి రీత్యా మనం ఎంత బిజీగా ఉన్నా రోజులో కొంత సమయం పిల్లలకు కేటాయించాలి. సాంకేతికత వినియోగంపై పిల్లలకు అవగాహన కల్పించాలి. ఇప్పుడు కొన్ని మొబైల్స్ కిడ్స్ మోడ్ ఆప్షన్స్తో వస్తున్నాయి. మెసెజ్ ఇన్బాక్స్, వాట్సాప్కు ఫింగర్ ప్రింట్ పాస్వర్ట్ ఆప్షన్ వచ్చింది. ఫేస్బుక్, ఇన్స్ట్రా గ్రాం, ట్విట్టర్ల సెక్యూరిటీకి కొత్త కొత్త ఆప్షన్లు ఉన్నాయి. పెద్దలు వాటన్నింటినీ వినియోగించి పిల్లలు వాటి జోలికి వెళ్లకుండా చేయవచ్చు. మొబైల్ అనేది పిల్లలకు విద్యా సాధనంగా ఉపయోగపడాలే తప్ప వినోదం, విలాస వస్తువుగా మారకూడదనే విషయం మాత్రం తల్లిదండ్రులు మరచిపోవద్దు.
వీడియో గేమ్స్తో జాగ్రత్త..
ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలన్నీ ఫోన్పే, గూగుల్పే ద్వారా నడుస్తున్నాయి. కొన్ని లావాదేవీలు ఓటీపీల ద్వారా జరుగుతున్నాయి. పిల్లలకు ఫోన్ ఇచ్చి కొందరు తల్లిదండ్రులు అలాగే వదిలేస్తారు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారనే విషయం గమనించరు. ఇటీవల కొన్ని డేంజరస్ వీడియో వచ్చాయి. సదరు వీడియో గేమ్స్ అన్నీ ఆర్మీ తరహాలో ఉంటాయి. శారీరకంగా బలమైన వ్యక్తులు వాటిలో క్యారక్టర్లుగా ఉంటారు. వారి చేతిలో పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి. హింస ప్రధానంగా ఈ గేమ్ల రూపకల్పన ఉంటుంది. ఈ గేమ్ ఆడుతున్న సమయంలో ఒక క్యారక్టర్లో పోరాడుతున్న గేమర్కు కొన్ని సౌకర్యాలు రావాలంటే లైఫ్ జాకెట్స్, బుల్లెట్ ప్రూఫ్ కార్స్, కాస్ట్లీ గూగుల్స్ అవసరమని గేమ్ డిమాండ్ చేస్తుంది. ఇక పిల్లలు ముందు వెనక చూడరు. ఫోన్ పే, గూగుల్ పే, తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల్లోని డబ్బుతో వాటిని కొనేస్తారు. ఇలాంటి గేమ్లతో ఎంతో అప్రమత్తంగా ఉండాలి. పిల్లలు అలాంటి గేమ్స్ ఆడుతున్నారని తెలిస్తే వారికి నచ్చజెప్పి వాటి నుంచి పిల్లలను బయటకు తీసుకురావాలి. గేమ్స్తో మరో ప్రమాదం ఉన్నది. ఈ తరహా గేమ్స్ ఆడడం వల్ల పిల్లల్లో హింసాత్మక ప్రవృత్తి పెరిగే అవకాశం ఉన్నది. పిల్లల్లో మానసిక ఆందోళనలు పెరుగుతున్నాయని ఇటీవల అనేక అధ్యయనాల్లో వెల్లడయ్యాయి