రామాయంపేట రూరల్, జనవరి 17 : ఒకప్పుడు ఇంటర్నెట్లో ఏ చిన్న పని కావాలన్నా.. నెట్ సెంటర్లకు వరుస కట్టేవారు. వినియోగదారులతో అవి ఎప్పటికప్పుడు కళకళలాడుతూ ఉండేవి. కంప్యూటర్ కావాలంటే కనీసం గంట సమయమైనా వేచి చూడాల్సి వచ్చేది. ఇప్పుడంతా స్మార్ట్ ఫోన్లదే హవా. ఏ పని అయినావీటితో కానిచ్చేస్తున్నారు. గతంతో పోలిస్తే రామాయంపేట పట్టణంలో చాలా వరకు ఇంటర్నెట్ సెంటర్లు ఉండేవి. కానీ నేడు అవి పది లోపు మాత్రమే ఉన్నా యి. తెలంగాణ వచ్చాక టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందింది. కనీస పరిజ్ఞానంలేని వారు కూడా స్మార్ట్ ఫోన్ల ద్వారా ‘ఆన్లైన్’లో వస్తువులు బుక్ చేసుకునే విధంగా పరిస్థితులు మారాయి. దీంతో మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు రోజుకో ఇంటర్నెట్ ఆఫర్ ప్రకటిస్తూ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఆన్లైన్లోనే అన్ని ఆర్డర్లు
స్మార్ట్ ఫోన్ల వినియోగం, రకరకాల ఇంటర్నెట్ ఆఫర్లు పెరగడంతో ఆన్లైన్లోనే అన్ని రకాల ఆర్డర్లు చేస్తున్నారు. చిన్న పిల్లల బట్టలు, చెప్పులు, మొదలుకొని చీరెలు, వంట సామగ్రి, టీవీలు,రైల్వే బుకింగ్ టికెట్లు, ఉద్యోగాలకు దరఖాస్తులు, వీసా, పాస్పోర్టు, చివరకు సినిమా టికెట్లును సైతం ఆన్లైన్లోనే బుక్ చేస్తున్నారు. అలాగే ఏదైనా వస్తువుకు బుక్ చేస్తే డెలివరీ బాయ్లు నేరుగా ఇంటి వద్దకు వచ్చి వస్తువులు అందజేస్తున్నారు. దీంతో ఇంటర్నెట్ సెంటర్ల వద్ద జనాలు దాదాపు కనిపించడం లేదు. ఒక విధంగా టెక్నాలజీ అభివృద్ధి చెందింది మంచిదే అని వారు కూడా అంటున్నారు.