ఎల్బీనగర్ : జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గల్లో కన్నా ఎల్బీనగర్ నియోజకవర్గం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముందు వరుసలో ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. శుక్రవారం చైతన్యపురి, దిల్సుఖ్నగర్లోని పలు కాలేజీల్లో విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి మాట్లాడుతూ పిల్లల వ్యాక్సిన్లపై అపోహలు వద్దని, వారికి వ్యాక్సిన్ వేయిస్తేనే రక్షణ ఉంటుందని అన్నారు. చిన్నారులకు వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని భావి భారత పౌరులను కాపాడుకుందామన్నారు. కోవిన్ యాప్లో ఆదార్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలందరికీ వ్యాక్సిన్ చేయించే బాధ్యతను వారి తల్లిదండ్రులు, కాలేజీల సిబ్బంది తీసుకోవాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వ్యాక్సినేషన్ కోసం అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందని, గత మూడు రోజులుగా ఎల్బీనగర్ నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థులకు వ్యాక్సిన్ వేయిస్తున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో గడ్డిఅన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేం మహేశ్వర్రెడ్డి, నాయకులు రాజు, రవికిరణ్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.