కొమురవెల్లి మల్లన్న క్షేత్రం ఉత్సవాలకు సిద్ధ్దమైంది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆలయం సుందరంగా ముస్తాబైంది. ఆదివారం నిర్వహించే పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి కల్యాణం, పట్నం వారం, లష్కర్వారం, మహా శివరాత్రి రోజున పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాలు జరుగనున్నాయి. కాగా, ఒమిక్రాన్ నేపథ్యంలో మొదటి ఆదివారం అగ్నిగుండాలు, పెద్దపట్నం అంతర్గతంగా నిర్వహించనున్నారు. పట్నం వారానికి 60వేలకు పైగా భక్తులు రానుండగా, ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
చేర్యాల, జనవరి 14 : ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది.భక్తుల పాలిట కొంగుబంగారంగా మల్లికార్జున స్వామి ఆలయం విరాజిల్లుతున్నది. డిసెంబర్ 26వ తేదీన నిర్వహించిన కల్యాణోత్సవాన్ని ఆలయవర్గాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.ఆలయ ఆచార, సంప్రదాయాల ప్రకారం సంక్రాంతి పర్వదినం పూర్తైన తర్వాత వచ్చే మొదటి ఆదివారం నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో స్వామి వారి కల్యాణం, పట్నం వారం, లష్కర్వారం, మహా శివరాత్రి పర్వదినం రోజున నిర్వహించే పెద్ద పట్నం, అగ్నిగుండాలు కార్యక్రమాలకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉత్సవాల సందర్భంగా ఆలయం, రాజగోపురం, గదులకు ఆలయవర్గాలు రంగులు వేయించడంతో మల్లన్న క్షేత్రం సుందరంగా మారింది. ఈ నెల 17న నిర్వహించే పట్నంవారంతో ఉత్సవాలు ప్రారంభం కానుండగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా 11 ఆదివారాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలిరానున్నారు. దీంతో భక్తులు ఇబ్బందులు పడకుండా స్వామి వారిని దర్శించుకునేందుకు ఆలయవర్గాలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.అలాగే, విశిష్ట దర్శనం, శీఘ్ర దర్శనం, ధర్మ దర్శనం కోసం అన్ని సౌకర్యాలు సమకూర్చారు. స్వామి వారిని దర్శించుకున్న అనంతరం బయటకు వెళ్లే దారిలో అన్ని ఏర్పాట్లు చేశారు.
పట్నం వారానికి హైదరాబాద్ భక్తులు
పట్నం వారం సందర్భంగా ఆదివారం హైదరాబాద్కు చెందిన భక్తులు అధిక సంఖ్యలో మల్లన్న క్షేత్రానికి తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకోనున్నారు. ఇందుకోసం మల్లన్న పేరిట సట్టీ దీక్షలను 41 రోజుల పాటు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. పట్నం వారం స్వామి వారిని దర్శించుకున్న అనంతరం దీక్షలను విరమిస్తారు. అలాగే, స్వామి వారితో పాటు పట్నం వేసి గుట్టపై ఉన్న ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పించనున్నారు. పట్నం వారానికి 60వేలకు పైగా భక్తులు రానున్న నేపథ్యంలో ఆలయ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.చేర్యాల సీఐ శ్రీనివాస్రెడ్డి నేతృత్వంలో పట్టిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
కొవిడ్ నిబంధనలు తప్పక పాటించాలి
స్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న తరుణంలో కొమురవెల్లికి వచ్చే ప్రతి భక్తుడు కొవిడ్ నిబంధనలు పాటించాలని ఆలయ ఈవో ఏ.బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి కోరారు. బుధవారం వారు మాట్లాడుతూ ఉత్సవాల సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.
పెద్ద పట్నం, అగ్నిగుండాలు రద్దు
ఈ నెల 17న స్వామి వారి కల్యాణ వేదిక వద్ద నిర్వహించే పెద్దపట్నం, అగ్నిగుండాల కార్యక్రమాన్ని ఆలయవర్గాలు కరోనా నేపథ్యంలో రద్దు చేశాయి. ఆలయ సంప్రదాయం ప్రకారం ఒగ్గు పూజారుల ఆధ్వర్యంలో ఆలయవర్గాల పర్యవేక్షణలో అంతర్గతంగా నిర్వహించనున్నారు. పట్నం వారానికి తరలివచ్చిన భక్తులు పెద్దపట్నం, అగ్నిగుండం కార్యక్రమాల్లో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న అనంతరం కొండపోచమ్మ, నల్లపోచమ్మ ఆలయాల వద్దకు వెళ్లి అక్కడ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకుంటారు.