వానకాలం పంటల సాగుకు అన్నదాతలు సంసిద్ధంగా ఉన్నారు. అందుకు తగినట్లుగానే వ్యవసాయ శాఖ అధికారులు కూడా సన్నద్ధమవుతున్నారు. సరిపడినన్ని ఎరువులు, విత్తనాలు వ్యవసాయ యంత్ర పరికరాలను సిద్ధం చేస్తున్నారు. యాసంగి పంటల సీజన్ ముగియడంతో రైతులు వేసవి దుక్కులు దున్నుతూ పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పత్తి.. ప్రధాన పంటగా సాగు కానుంది. నిరుటికంటే అధిక విస్తీర్ణంలో పత్తిని సాగు చేసేందుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వర్షాలు కూడా అధికంగా కురిస్తే పంటల సాగు విస్తీర్ణం కూడా మరింతగా పెరుగుతుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. కొన్నిచోట్ల సాగునీరు పుష్కలంగా ఉండడం మరో సాను కూలాంశం. దీనికితోడు పంటల పెట్టుబడికి రైతుబంధు సాయం కూడా సకాలంలో అందుతుండడంతో ఏటికేడు సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మరోవైపు వ్యవసాయ అధికారులు విత్తనాలను, ఎరువులను అందుబాటులో ఉంచుతున్నారు. ఇప్పటికే కొన్ని గోదాముల్లో ఎరువుల నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. ఇంకోవైపు నకిలీ విత్తనాలను అరికట్టేందుకు వ్యవసాయ అధికారులు పోలీసులతో కలిసి ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భద్రాద్రి కొత్తగూడెం, (నమస్తే తెలంగాణ)/ ఖమ్మం వ్యవసాయం, మే 15:ఈ నెల చివరి వారం లేదా వచ్చే నెల ఆరంభం నుంచి జిల్లాలో వానకాలం సీజన్ ప్రారంభం కానుంది. అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ సాగుకు అవసరమైన ఏర్పాట్లు చేసే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోయాసంగి ధాన్యం కొనుగోళ్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఒకవైపు కొనుగోళ్ల ప్రక్రియ కొనసాగుతుండగానే మరోవైపు వానకాలం సీజన్ పనులపై వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే ఆయా మండలాల వ్యవసాయశాఖ అధికారుల నుంచి క్షేత్రస్థాయి సమాచారం తీసుకొని రాష్ట్ర వ్యవసాయశాఖకు నివేదిక పంపింది. జిల్లా ప్రణాళిక నివేదికను రాష్ట్ర వ్యవసాయ శాఖ ఆమోదించడంతో తదుపరి కార్యాచరణ రూపొందించే పనిలో జిల్లా వ్యవసాయ అధికారులు నిమగ్నమయ్యారు. ఒకటి రెండు రోజుల్లో విత్తనాల (పచ్చిరొట్ట, వరి, పెసర, కంది, మొక్కజొన్న) ఇండెంట్ను తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్కు అందజేయనుంది. ఈ సంవత్సరం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 5,91,700 ఎకరాల్లో, భద్రాద్రిలో 5,48,493 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని ఆయా జిల్లాల వ్యవసాయ శాఖలు అంచనా వేశాయి. ఖమ్మంలో ప్రధాన పంటగా సాగు జరిగే పత్తి 2,80,200 ఎకరాల్లో, రెండో ప్రధాన పంటగా వరి 2.69 లక్షల ఎకరాల్లో, పెసర మరో 25 వేల ఎకరాల్లో సాగయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించేందుకు వ్యవసాయశాఖ ముందస్తుగానే చర్యలు చేపట్టింది.
రైతులకు నకిలీ విత్తనాలు అంటగట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వారిపై సర్కార్ నజర్ పెట్టింది. ఏ ఒక్క రైతూ నకిలీల బారీన పడకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ప్రణాళిక సిద్ధం చేసింది. కొద్ది రోజుల్లో విత్తనాల విక్రయాలు ప్రారంభం కానుండడంతో జి ల్లా వ్యవసాయశాఖ ముం దస్తు జాగ్రత్తలు చేపట్టింది. జిల్లా వ్యా ప్తంగా విత్తన దు కాణాలు, గో డౌన్లలో తనిఖీలు చేపట్టింది.
సకాలంలో రైతుబంధు పంటల పెట్టుబడి సాయం చేతికి అందుతుండడంతో రైతులు ఏటా పంటల సాగు విస్తీర్ణాన్ని పెంచుతున్నారు. భద్రాద్రి జిల్లాలో నిరుటితో పోల్చితే 60 వేల ఎకరాల్లో అదనంగా పంటలు సాగయ్యే అవకాశాలున్నాయి. భద్రాద్రి జిల్లాలో 5,48,498 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. అనుకున్నదాని కంటే వర్షాలు అధికంగా కురిస్తే మరికొన్ని పంటలు సాగు పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ సారి పత్తి పంటను అధిక విస్తీర్ణంలో వేసేందుకు రైతులు మొగ్గు చూపుతున్నారు. 1,75,182 ఎకరాల్లో పత్తి వేయనున్నట్లు అధికారులు నివేదికను తయారు చేశారు. దీంతో పాటు ఎరువులు, విత్తనాలను కూడా అందుబాటులో ఉంచారు. 67,983 క్వింటాళ్ల విత్తనాలు, 29, 405.95 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉంచారు. అయితే మార్కెట్లో డిమాండ్కు అనుగుణంగా పంటల సాగు చేయాలని, కొత్త పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. దీంతో వానకాలంలో అపరాల సాగు కూడా పెరిగే అవకాశం ఉంది.
వానకాలం సీజన్కు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఒక్క రైతుకూ ఇబ్బంది కలుగకూడదనే ఉద్దేశంతో వానకాలం ప్రణాళికను సిద్ధం చేశాం. మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ సీడ్స్ కార్పొరేషన్ ద్వారా పచ్చిరొట్ట విత్తనాలు సొసైటీలకు చేరుస్తాం. సకాలంలో సాగు పనులు చేపట్టేందుకు ముందస్తుగానే ప్రణాళిక సిద్ధం చేశాం. డివిజన్ల వారీగా ప్రత్యేకంగా ఏడీఏల ఆధ్వర్యంలో టాస్క్ఫోర్స్ టీంలను ఏర్పాటు చేశాం. రాష్ట్రస్థాయి అధికారులు సైతం ఆకస్మిక తనిఖీలు చేపడుతున్నారు.
-బీ.సరిత, డీఏవో, ఖమ్మం
ఈ వానకాలం సీజన్లో వర్షాలు సమృద్ధిగాకురిస్తే ఇతర పంటల సాగు కూడా పెరిగే అవకాశాలున్నాయి. పంటలకు సరిపడా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచాం. ఆయా సొసైటీల ద్వారా అందజేస్తాం. విత్తనాల్లో ఎలాంటి తేడాలున్నా ముందస్తు సమాచారం ఇవ్వాలని రైతులకు సూచిస్తున్నాం. మార్కెట్లో మంచి డిమాండ్ ఉండే పంటలనే రైతులు ఎంచుకుంటున్నారు. ఈ మేరకు స్థానిక ఏఈఏలు సూచనలు చేస్తున్నారు. ఎరువులు, విత్తనాల షాపుల వద్ద ఏడీఏలు తనిఖీలు చేస్తున్నారు.
-కొర్సా అభిమన్యుడు, డీఏవో, భద్రాద్రి కొత్తగూడెం