భద్రాచలం, మే 15: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానం ఉపాలయమైన శ్రీయోగానంద లక్ష్మీనృసింహ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ధ్వజారోహణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలకు సంకేతంగా అటు దేవతలకు, ఇటు మానవులకు తెలిపేలా గరుడ పటాన్ని ధ్వజారోహణం నిర్వహించారు. ఉదయం నృసింహ స్వామివారికి ఏకాంతంగా స్నపన తిరుమంజనం జరిపారు.
ముందుగా ఆలయం నుంచి వేద పండితులు మంత్రోచ్ఛరణలు, మంగళ వాయిద్యాలు నడుమ సమస్త రాజలాంఛనాలతో తిరు కల్యాణ ఉత్సవమూర్తులను ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేయించారు. ధ్వజ స్తంభం వద్దకు తోడ్కోని వచ్చారు. అనంతరం గరుడ పటంతో ఆలయం చుట్టూ మూడుసార్లు ప్రదక్షిణ చేశారు. బ్రహ్మోత్సవాల రక్షణ కోసం గరుత్మంతుడిని ఆహ్వానించి ఆరాధన జరిపారు. గరుడాధివాసం, న్యాసం, గరుడ ధ్యానం, గరుడ చూర్ణికలను, గరుడ మహా సంకల్పం, మంగళాష్టకాలను అర్చకులు పఠించారు. అనంతర దేవస్థానం ఈవో శివాజీ దంపతులు మేళతాళాలు, వేదమంత్రాల నడుమ గరుడపటాన్ని ధ్వజస్తంభం పైకి ఎగురవేశారు. అనంతరం అష్టదిక్పాలకులకు బలిహరణం జరిపారు. సంతానం లేని మహిళలకు గరుడ ముద్దలను అర్చకులు పంపిణీ చేశారు. ఈ ముద్దను తీసుకున్నవారికి ఉదరంలో ఉన్న వ్యాధులు పోయి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం.
సాయంత్రం ఎదుర్కోలు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రామాలయం నుంచి ఆలయ అధికారులు, అర్చకులు రామయ్య శేష వస్ర్తాలను, శేష మాలికలను తీసుకొని ఆస్థాన స్థానాచార్యులు కేఈ స్థలశాయి రామయ్య తరఫున స్వామివారికి సమర్పించారు. నృసింహ స్వామివారిని, లక్ష్మీ అమ్మవారిని ఎదురెదురుగా ఉంచి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. అర్చకులు స్వామివారి వంశ ప్రవరను తెలిపారు. మరో అర్చక స్వామి అమ్మవారి రూప, లావణ్యాలను, గుణగుణాలను తెలిపారు. అర్చకులు పల్లకిలో ఉన్న స్వామివారిపై, అమ్మవారిపై బుక్కా, గులాలు చల్లారు.
వైశాఖ మాసోత్సవాల్లో భాగంగా నృసింహ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నృసింహ స్వామివారికి సోమవారం వార్షిక కల్యాణాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణంలో పాల్గొనే దంపతులు రూ.1,500 రుసుం చెల్లించి కల్యాణంలో పాల్గొనవచ్చని దేవస్థానం అధికారులు తెలిపారు.