తిరుమలాయపాలెం, మే 15: తిరుమలాయపాలెం మండలంలో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. బావులు, బోర్లలో జలాలు ఉప్పొంగాయి. దీంతో మండల ప్రజలకు సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం దొరికింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు జిల్లాలో తిరుమలాయపాలెం మండలం అత్యంత కరువుపీడిత ప్రాంతంగా ఉండేది. ఎలాంటి సాగు నీటి పథకాలు లేక రైతులు వర్షాధారంగా వ్యవసాయం చేసేవారు. వర్షాలు కురిస్తే పంటలు పండేవి లేదంటే ఎండేవి. ఈ ప్రాంతంలో కరువు నిత్యకృత్యంగా ఉండేది. 2014 ముందు ఈ ప్రాంతం డిసెంబర్ వచ్చిందంటే ఎక్కడ పచ్చని పైర్లు కనిపించేవి కాదు. బావులు, బోర్లలో భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు నిలువునా ఎండిపోయేవి. తాగునీరు దొరక్క ప్రజలు తంటాలు పడేవారు. స్వచ్ఛంద సంస్థలు ట్యాంకర్ల ద్వారా గ్రామాల్లో ప్రజలకు నీరు సరఫరా చేసేవారు. అలాంటి పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం మండలంలో బోర్లు, ఇసుక తవ్వకాలను నిషేధించింది.
అనంతరం స్వరాష్ట్రం ఏర్పడ్డకా తిరుమలాయపాలెం మండల ప్రజలు తెలంగాణ ప్రభుత్వ పాలనలో విముక్తిపొందారు. నేడు సాగు, తాగునీటి తిప్పలు లేకుండా సంతోషంగా జీవనం సాగిస్తున్నారు. నీరు, నిధులు, నియామకాలు అనే లక్ష్యంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం తిరుమలాయపాలెం మండల ప్రజల కలలను సాకారం చేసింది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాలో అత్యంత కరువుపీడిత ప్రాంతమైన తిరుమలాయపాలెం మండలంపై ప్రత్యేక దృష్టిసారించింది.
భూగర్భ జలాలను పెంపొందించే లక్ష్యంతో ఆకేరు, పాలేరు వాగులపై హైదర్సాయిపేట, తిప్పారెడ్డిగూడెం, పిండిప్రోలు, రమణతండ, తిరుమలాయపాలెం, కాకరవాయి, సోలీపురం ప్రాంతాల్లో చెక్డ్యామ్లు నిర్మించింది. రూ.13.7 కోట్ల వ్యయంతో మిషన్ కాకతీయ పథకం ద్వారా మండలంలోని 77 చెరువుల్లో పూడిక తవ్వకాలు, చెరువు కట్టలు, తూములు, అలుగుల మరమ్మతులు పూర్తిచేసింది. గొలుసుకట్టు చెరువులు, కుంటలకు పూర్వవైభవం తెచ్చింది. ఈ ప్రాంతంలో సాగునీటి కల్పన లక్ష్యంతో రూ.1.20 కోట్ల వ్యయంతో శ్రీభక్తరామదాసు ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది.
పాలేరు రిజర్వాయర్ నుంచి శ్రీరాంసాగర్ కాల్వల ద్వారా కృష్ణా జలాలను సరఫరా చేసి మండలంలోని అన్ని చెరువులు, కుంటలను నింపింది. గత ఐదేళ్లుగా ప్రతియేటా నీటి సరఫరా చేస్తుండడంతో ప్రస్తుతం వేసవిలోనూ చెరువులు, కుంటలు నీటితో కళకళలాడుతున్నాయి. బావులు, బోర్లలో పుష్కలంగా భూగర్భ జలాలు పెరిగాయి. 2014 ముందు 30మీటర్లు తవ్విన చుక్క నీరు వచ్చేది కాదు. ప్రస్తుతం ఐదు మీటర్లు తవ్వితే జలం ఉప్పొంగుతున్నది.