ఖమ్మం కల్చరల్, మే 15: ప్రాచీన మహిమాన్వితమైన శ్రీస్తంభాద్రి లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం (గుట్ట) అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన నృసింహ జయంతి ఉత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఆలయ మెట్లు, రహదారి సౌకర్యం, పార్కు తదితర సౌకర్యాలు మెరుగుపడినట్లు చెప్పారు. ఎంతో మహిమ గల స్వయంభు స్వామిని పూజించడంతో సకల సౌభాగ్యాలు కలుగుతున్నాయన్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వయంభు స్వామిని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రధాన అర్చకులు నరహరి నర్సింహాచార్యులు, శ్రీనివాసాచార్యులు, రామకృష్ణమాచార్యుల బృందం మంత్రి అజయ్తో శాస్ర్తోక్తంగా పూజలు చేయించారు. అష్టోత్తర, గోత్ర నామాలతో పూజలు చేసి తరించారు. మంత్రితోపాటు సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు పూజలు చేశారు.
ఆలయంలో నిర్వహిస్తున్న వార్షిక పంచాహ్నిక బ్రహ్మోత్సవ శ్రీసుదర్శన యాగ, కల్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామికి పానకాభిషేకం, బాలభోగం, శ్రీసుదర్శన యాగం హావనం క్రతువులను శాస్ర్తోక్తంగా నిర్వహించారు. ఆలయ ఈవో కొత్తూరు జగన్మోహన్రావు ఆధ్వర్యంలో నృసింహ జయంతి సందర్భంగా వందలాది మంది భక్తుల సమక్షంలో స్తంభం నుంచి చీల్చుకుని నరసింహ స్వామి ఉద్భవించే ఘట్టన్ని అత్యంత నేత్ర పర్వంగా నిర్వహించారు.
అనంతరం స్వామి స్తంభోద్భవ దర్శనాన్ని భక్తులు కనులారా వీక్షించారు. వైశాఖ పౌర్ణిమ సోమవారం మూలవిరాట్కు 108 కలశాలతో అభిషేకం, శ్రీస్వామి వారిని పెళ్లి కుమారుడిని చేయడం, శ్రీసుదర్శన యాగం, నీరాజన మంత్రపుష్పం, ముత్యాల తలంబ్రాలు ఊరేగింపు, కల్యాణ మహోత్సవం ఉంటుందని కార్యనిర్వహణాధికారి కొత్తూరు జగన్మోహన్రావు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. రంగులు, విద్యుత్దీప అలంకరణలు, భక్తగణంతో ఆలయం దేదీప్యమానంగా వెలుగొందింది. ఉత్సవాలతోపాటు నృసింహ జయంతి సందర్భంగా ఆలయం భక్తులతో కిటకిటలాడింది.