వైరా/ వైరా టౌన్, మే 14: తేమ శాతం పేరుతో ధాన్యం రైతులను అధికారులు, మిల్లర్లు ఇబ్బందులకు గురిచేయవద్దని రాష్ట్ర మంత్రులు గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. 16, 17 శాతం ఉన్నప్పటికీ ధాన్యాన్ని కొనుగోలు చేసి కాంటాలు వేయాలని ఆదేశించారు. ధాన్యాన్ని కాంటా వేసేటప్పుడు ఒక్కో బస్తా 40 కేజీల ఆరువందల గ్రాముల బరువు మాత్రమే ఉండేట్లు చూడాలన్నారు. అంతకుమించి అదనంగా ధాన్యాన్ని కాంటా వేయాల్సిన అవసరం లేదన్నారు. రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.
వైరా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం ఎమ్మెల్యే రాములునాయక్తో కలిసి శనివారం వారు పరిశీలించారు. యార్డులో ఆరబోసిన వరి ధాన్యంలో తేమ శాతాన్ని పరిశీలించారు. నియోజవర్గ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఎన్ని వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారో వ్యవసాయశాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సుమారు 50,618 క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు సమాధానమిచ్చారు. కలెక్టర్ వీపీ గౌతమ్, అదనపు కలెక్టర్ మధుసూదన్, డీఏవో సరిత, మార్క్ఫైడ్ వైస్చైర్మన్ బొర్రా రాజశేఖర్, టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఎన్వీ, ఏఎంసీ చైర్మన్ బీడీకే రత్నం, మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ఏఎంసీ వైస్చర్మన్ దూపాటి భద్రరాజు, రాయల శేషగిరిరావు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.