భూపాలపల్లి, మే 15 : సింగరేణి కార్మిక పరిరక్షకుడు సీఎం కేసీఆర్ అని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని సుభాష్ కాలనీ మినీ స్టేడియంలో టీబీజీకేఎస్ భూపాలపల్లి బ్రాంచ్ కమిటీ జనరల్ బాడీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, టీఆర్ఎస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, టీబీజీకేఎస్ అధ్యక్షుడు బీ వెంకట్రావ్, వర్కింగ్ ప్రెసిడెంట్ కెంగర్ల మల్లయ్య, ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సింగరేణి కార్మికులకు దేశంలో ఏ బొగ్గు పరిశ్రమలో లేని విధంగా అనేక హక్కులు, సంక్షేమ ఫలాలు సీఎం కేసీఆర్ చొరవ ఫలితంగా ఈ రోజు వచ్చాయన్నారు.
ఈ ప్రాంతంలో 1987లో బొగ్గు గనులు ప్రారంభమైన తర్వాత భూపాలపల్లి దినదినాభివృద్ధి చెందుతున్నప్పటికీ ఇక్కడ పని చేసే కార్మికులకు నివాస వసతుల్లేక చాలా ఇబ్బందులు పడేవారన్నారు. ఇప్పుడున్న మంజూర్నగర్ యైంటిక్లయిన్ వెయ్యి క్వార్టర్లను మంజూరు చేయించి నిర్మింప చేయించానని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో మరో 994 అధునాతన డబుల్ బెడ్రూం ఇళ్లను ఇప్పుడు నిర్మిస్తున్నామని, మరో రెండు నెలల్లో కార్మికులకు అలాట్మెంట్ ఇస్తామని చెప్పారు. ఎప్పుడు సమస్య వచ్చినా భూగర్భ గనుల్లోకి దిగి క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకొని పరిష్కరించానన్నారు.
సీఎం కేసీఆర్ మనసున్న మహారాజు అని, కార్మికులు ఎలాంటి సమ్మేలు చేయకుండానే వారి మనోగతాన్ని తెలుసుకొని వారికి ఎన్నో ప్రయోజనాలు చేకూర్చారన్నారు. మొన్నటికి మొన్న కేంద్రమంత్రి కిషన్రెడ్డి వచ్చి ‘తెలంగాణలో అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికులకు ఆదాయపు పన్ను తిరిగి ఇస్తాం’ అని చెప్పారని, ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనైనా బొగ్గు గని కార్మికుల ఆదాయపు పన్ను తిరిగి చెల్లించారా అని ప్రశ్నించారు. హోంమంత్రి అమిత్షా ఇటీవల తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్ను నిజాం నవాబుతో పోల్చడం సిగ్గుచేటన్నారు.
రాజ్యాంగబద్ధంగా, సమ దృష్టితో, సమపాలన చేస్తున్న మహానాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయ పబ్బం గడిపే మీకు కేసీఆర్ను విమర్శించే హక్కు లేదన్నారు. తెలంగాణ మీద అంత ప్రేమ ఉంటే సింగరేణికి సంబంధించిన బొగ్గు బ్లాకులను సింగరేణికి ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. భూపాలపల్లి చుట్టు పక్కల గ్రామ పంచాయతీలను విలీనం చేసి నాడు నగర పంచాయతీ చేయడం వల్లే సింగరేణి కార్మికులకు హెచ్ఆర్ఏ వస్తున్నదని గుర్తుచేశారు.
ప్రభుత్వ రంగ సంస్థలను తెగనమ్ముతూ ప్రజా వ్యతిరేక విధానాలకు కేంద్రంలోని బీజేపీ పాల్పడుతున్నదని ధ్వజమెత్తారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు లేకుండా చేసి, యువతకు ఉపాధి లేకుండా చేయడం వంటి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందన్నారు. టీబీజీకేఎస్ యూనియన్లో అపారమైన అనుభవం ఉన్న నాయకులు ఉన్నారని, రాబోయే ఎన్నికల్లో అందరం కలిసికట్టుగా పని చేసి టీబీజీకేఎస్ విజయానికి కృషి చేద్దామన్నారు.
ఎన్నో అవాంతరాలు ఎదురైనా సింగరేణిలో తండ్రీ కొడుకుల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. 2001 నుంచి 2022 వరకు 20 ఏళ్ల పాటు సింగరేణిలో తండ్రీ కొడుకుల ఉద్యోగాలు లేకుండాపోతే ఇప్పుడు కేసీఆర్ కారుణ్య నియామక రూపంలో ఇస్తున్నారని చెప్పారు. ఇప్పటివరకు 89 మెడికల్ బోర్డుల సమావేశాలు నిర్వహించుకొని 40 సంవత్సరాల వయసున్న వారికి కారుణ్య నియామకాలు ఇచ్చే విషయమై మరికొద్ది రోజుల్లో సర్క్యులర్ వస్తుందన్నారు. కోలిండియాలో లేని అనేక హక్కులను ఈ రోజు సింగరేణిలో సాధించినట్లు చెప్పారు. మరో రెండ్రోజుల్లో సింగరేణి ఎన్నికలు రాబోతున్నాయని, అందుకు సిద్ధంగా ఉండాలని యూనియన్ శ్రేణులకు పిలుపునిచ్చారు. త్వరలో వేసే టీబీజీకేఎస్ కమిటీల్లో యువతకు తగిన ప్రాధాన్యం ఉంటుందన్నారు.
కార్మికులకు ఎల్లవేళలా అండగా ఉంటున్నామని, ఇకముందు కూడా ఉంటామని, ఎమ్మెల్యే రమణారెడ్డి కార్మికులకు ఏ సమస్య వచ్చినా దగ్గరుండి పరిష్కరిస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి అన్నారు. సీఎం కేసీఆర్ కృషితోనే సింగరేణి కార్మికులు అనేక ప్రయోజనాలు పొందుతున్నారన్నారు. మొత్తం 11 ఏరియాల్లో టీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ కార్మిక సంఘాలు, ప్రధానంగా ఏఐటీయూసీ యూనియన్ ఎన్నో కార్మిక హక్కులను పోగొడితే టీబీజీకేఎస్ యూనియన్ తిరిగి సాధించిందన్నారు. డిపెండెంట్, డిస్మిస్ ఉద్యోగాలు, పీఎంఈ మస్టర్ ఇలా ఎన్నో హక్కులను వారు పోగొడితే టీబీజీకేఎస్ యూనియన్ సాధించిపెట్టిందని గుర్తు చేశారు. కోలిండియాలో బొగ్గు గని కార్మికులు విద్యుత్ బిల్లులు కడుతుంటే సింగరేణిలో మనం ఉచిత కరెంట్ ఇస్తున్నామన్నారు. ఇలా అనేక హక్కులను సాధించిన సంఘం టీబీజీకేఎస్ యూనియన్ అన్నా రు. వేజ్బోర్డులో ఏమాత్రం మాట్లాడని జాతీయ కార్మిక సంఘా లు ఇక్కడకు వచ్చి లేనిపోని అబద్ధాలు చెబుతుంటాయన్నారు.
సింగరేణిలో ఎర్రజెండా వెలిసిపోతున్నదని పరోక్షంగా ఏఐటీయూసీ యూనియన్పై మిర్యాల రాజిరెడ్డి ధ్వజమెత్తారు. జాతీయ సంఘాలు అనేక హక్కులు పోగొడితే మేం సాధించామన్నారు. వారు జీఎం స్థాయిలో మాట్లాడడమే గొప్పగా చెప్పుకుంటారని, సీఎం కేసీఆర్, టీబీజీకేఎస్ గౌరవాధ్యక్షురాలు కవిత సహకారంతో కోల్బెల్ట్ ప్రజా ప్రతినిధులను తీసుకువెళ్లి సీఎండీ, డైరెక్టర్ల స్థాయిలో కార్మికుల అనుకూల నిర్ణయాలను శరవేగంగా చేయించిన ఘనత టీబీజీకేఎస్ యూనియన్కు దక్కుతుందన్నారు. సీఎం ఇచ్చిన హామీల్లో మారుపేర్ల హామీ మినహా మిగతా అన్నింటినీ నెరవేర్చినట్లు చెప్పారు. ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి, టీబీజీకేఎస్కే దక్కుతుందన్నారు. టీబీజీకేఎస్ నేతలు, పిట్ సెక్రటరీలు, టీబీజీకేఎస్ శ్రేణులు, కార్మికులు హాజరయ్యారు.