సిరిసిల్ల టౌన్, మే 15: సర్కారు ఉద్యోగం నిరుద్యోగుల స్వప్నం. అందులో పోలీసు అంటే ఇంకా ప్రత్యేకం. ఖాకీ డ్రెస్ వేసుకొని.. లాఠీ చేతపట్టి విధులు నిర్వర్తించాలన్న యువత కల సాకారానికి పోలీస్శాఖ నడుంబిగించింది. హైదరాబాద్లాంటి మహా నగరాల మాదిరి ప్రైవేట్కు దీటైన శిక్షణను జిల్లా కేంద్రాల్లో ఉచితంగా అందిస్తుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పకడ్బందీగా కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో ఎస్పీ రాహుల్ హెగ్డే ఆధ్వర్యంలో సకలవసతులతో కోచింగ్ ఇస్తుండగా అభ్యర్థుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.
సర్కారు ఉద్యోగం యువత స్వప్నం. అందులో పోలీసు కొలువు అంటే ఇంకా ప్రత్యేకం. ఖాకీ డ్రెస్ వేసుకొని.. లాఠీ చేతపట్టి విధులు నిర్వర్తించాలన్న నిరుద్యోగుల కల.. సాకారానికి పోలీస్శాఖ నడుం బిగించింది. రాష్ట్ర సర్కారు ఆదేశాలతో జిల్లా కేంద్రాల్లో ప్రైవేట్ను తలదన్నేలా సకల సౌకర్యాలతో ఫ్రీ కోచింగ్ అందిస్తున్నది. ఉదయం నుంచీ సాయంత్రం దాకా అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో సబ్జెక్టుల బోధన.. మరోవైపు పోలీస్, పీఈటీలతో ఫిజికల్ ట్రైనింగ్ ఇప్పిస్తుండగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పకడ్బందీగా శిక్షణ కొనసాగుతున్నది. మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశం.. ఎస్పీ రాహుల్ హెగ్డే నిత్య పర్యవేక్షణలో ప్రణాళికా బద్ధంగా బోధన జరుగుతుండగా, అభ్యుర్థుల్లో ఫుల్ జోష్ కనిపిస్తున్నది.
రాజన్న సిరిసిల్ల పోలీస్శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు పోలీస్ ఉద్యోగాల కోసం ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. సర్కారు నోటిఫికేషన్ ఇచ్చిన కొద్దిరోజులకే గత నెల 3న వేములవాడ పరిధిలోని అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువతకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 1600మంది దరఖాస్తు చేసుకోగా 1400మంది హాజరయ్యారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు అదే నెల 22న ఫిజికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థుల కోసం ఈ నెల 2న జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పట్టణంలోని సినారె కళామందిరంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని ఎస్పీ రాహుల్ హెగ్డే ప్రారంభించి, అందుబాటులోకి తెచ్చారు.
శిబిరంలో అన్ని వసతులు కల్పించారు. గ్రౌండ్లో వ్యాయామ పరీక్షల సాధనతో పాటు అనుభవం కలిగిన ఫ్యాకల్టీతో బోధిస్తున్నారు. వేసవి దృష్ట్యా తరగతి హాల్లో ఫ్యాన్లు, కూలర్లు, చల్లటి తాగునీరు, ఉచిత భోజనం సౌకర్యాలు కల్పించారు. ఎస్పీ రాహుల్హెగ్డే నిత్యం శిబిరాన్ని సందర్శిస్తున్నారు. పోలీస్ అధికారులు మాకు అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తున్నరు. ఇటీవల మంత్రి కేటీఆర్ సార్ వచ్చినప్పుడు విలువైన సూచనలు అందించారు.
– అఖిల, గంభీరావుపేట
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ శిబిరం నిరుద్యోగ యువతి, యువకులకు మంచి అవకాశం. జిల్లా ఎస్పీ సూచన మేరకు శిబిరంలో మౌలిక వసతుల కల్పనలో మా వంతు సహకారం అందిస్తున్నాం. పోలీస్ ఉద్యోగాలు సాధించాలనుకునే అభ్యర్థులు కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకుని తల్లిదండ్రుల కలలను నెరవేర్చాలి. ఉద్యోగం ఉంటేనే సమాజంలో ఉన్నతమైన గుర్తింపు ఉంటుంది.
– జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్
మంత్రి కేటీఆర్ మార్గదర్శకత్వంలో జిల్లా కేంద్రంలో ఉచిత శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నాం. అర్హత పరీక్ష ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు స్థానిక సినారె కళామందిరంలో తరగతులు నిర్వహిస్తున్నాం. ఉచిత భోజన సౌకర్యం కల్పించాం. ఉదయం గ్రౌండ్తో పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో సబ్జెక్టు బోధన చేస్తున్నాం. జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు చెందిన ఫ్యాకల్టీని తీసుకువచ్చాం. ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు ఆయా మండలాల్లో అందుబాటులో ఉన్న వ్యాయామ ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ట్రైనింగ్ ఇస్తుండడంతో అభ్యర్థుల నుంచి విశేష స్పందన వస్తున్నది.
– రాహుల్హెగ్డే, జిల్లా ఎస్పీ.
శిబిరానికి నిత్యం 400కు పైగా అభ్యర్థులు హాజరవుతుండగా, వీరికి అవసరమైన భోజన సౌకర్యాన్ని ఉచితంగా ఏర్పాటుచేశారు. రోజూవారీగా మెనూ ప్రకారం పలు రకాల కూరలతో భోజనం పెడుతున్నారు. ఇంకా ఎండలు తీవ్రంగా ఉండడంతో తరగతి గదుల్లో ఫ్యాన్లు, కూలర్లతో పాటు చల్లటి తాగునీటిని అందుబాటులో ఉంచుతున్నారు.
నేను డిప్లొమా పూర్తి చేశాను. కానిస్టేబుల్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను. శిక్షణ కోసం కరీంనగర్ వెళ్లాలనుకున్నా. పేపర్లో ప్రకటన చూసి ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించాను. ప్రతి రోజు మా మండల కేంద్రంలో నిర్వహిస్తున్న వ్యాయామ సాధన శిబిరానికి హాజరవుతున్నాను. ఉదయం 9.30గంటలకు సిరిసిల్లలో నిర్వహిస్తున్న తరగతులకు అటెండ్ అవుతున్నాను. ఆర్థమెటిక్, రీజనింగ్, ఇండియన్ హిస్టరీ లాంటి క్రిటికల్ సబ్జెక్టులను సులభ పద్ధ్దతిలో బోధిస్తున్నారు. ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు దీటుగా సౌకర్యాలు కల్పించారు.
– బానోతు నాగరాజు, సనుగుల, మండలం చందుర్తి
శిక్షణ శిబిరం ఎస్పీ పర్యవేక్షణలో కొనసాగుతున్నది. ఇక్కడ టౌన్ సీఐ అనిల్కుమార్, ఆర్ఐ రజనీకాంత్, ఆర్ఎస్ఐ సాయికిరణ్, టౌన్ ఎస్ఐ రమాకాంత్, ఏఆర్ ఎస్ఐ మహేందర్తో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు, ఐదుగురు మహిళా కానిస్టేబుళ్లు, పది మంది హోంగార్డులు కోచింగ్ ఏర్పాట్లలో భాగస్వాములవుతున్నారు. టౌన్ సీఐ అనిల్కుమార్ ఉదయం గ్రౌండ్లో అభ్యర్థులకు శారీరక శిక్షణ అందిస్తున్నారు. ఆర్ఐ రజనీకాంత్ క్యాంపును పర్యవేక్షిస్తున్నారు. అనువజ్ఞులైన ఫ్యాక ల్టీతో ఆర్థమెటిక్, రీజనింగ్, ఇండియన్ హిస్టరీ వంటి సబ్జెక్టులను బోధించిన అనంతరం అభ్యర్థులకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేస్తూ వారికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
జిల్లాలోని సుమారు 400 మందికిపైగా అభ్యర్థులు శిక్షణ తరగతులకు హాజరవుతున్నారు. పక్కాగా సమయపాలన పాటించేలా అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి 7.30 వరకు గ్రౌండ్, ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఫ్యాకల్టీ ద్వారా సబ్జెక్టులు బోధిస్తున్నారు. అయితే వేకువజామున 5గంటలకు జిల్లా కేంద్రంలో నిర్వహించే వ్యాయామ శిక్షణకు హాజరుకావడం ఇబ్బందికరంగా ఉండడంతో ఇందుకోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మండలాల వారీగా పోలీస్స్టేషన్ల పరిధిలో ఆయా ఎస్ఐలకు బాధ్యతలు అప్పగించారు. అందుబాటులో ఉన్న పీఈటీలను భాగస్వాములను చేశారు. మండల కేంద్రాల్లోనే ఉదయం గ్రౌండ్లో శిక్షణ పూర్తిచేసుకున్న తర్వాత అభ్యర్థులు సిరిసిల్లలోని శిక్షణ కేంద్రంలో నిర్వహించే క్లాసులకు హాజరవుతున్నారు. ఇక జిల్లా కేంద్రానికి చెందిన అభ్యర్థులకు స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో సాధన చేయిస్తున్నారు. జిల్లాతో పాటు కరీంనగర్, వరంగల్కు చెందిన ఆయా సబ్జెక్టుల్లో అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీతో తరగతులు బోధిస్తున్నారు.
అభ్యర్థులకు ఉపయోగకరంగా ఇంటివద్ద ఆన్లైన్ క్లాసుల కోసం రాజన్న సిరిసిల్ల పోలీస్శాఖ ‘కేటీఆర్ ఆన్లైన్ క్లాసెస్’ యాప్ను రూపొందించింది. క్లాసులు ముగిసిన తర్వాత ఇంటి వద్ద పాఠాలు వినాలనుకునే అభ్యర్థుల కోసం తయారు చేసిన ఈ అప్లికేషన్ను ఇటీవలే మంత్రి కేటీఆర్ ప్రారంభించి, అందుబాటులోకి తెచ్చారు. పోలీస్శాఖ ఇచ్చే ప్రత్యేక పాస్వర్డ్ ఆధారంగా ప్లే స్టోర్లో దీనిని అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ యాప్లో పోలీస్ ఉద్యోగానికి సంబంధించిన నిష్ణాతులైన ఫ్యాకల్టీ తో రూపొందించిన 1800 ఆయా సబ్జెక్టుల వీడియోలను పొందుపరుచగా, అభ్యర్థులకు ఎంతగానో ఉపయోగపడుతున్నవి.
నేను ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్ను. ప్రస్తుతం ఈ శిక్షణ కేంద్రంలోనే విధులు నిర్వర్తిస్తున్న. ఎస్ఐ కావాలనేది నా లక్ష్యం. ఇక్కడ పనిచేస్తూనే అధికారుల ప్రోత్సాహంతో ఖాళీ సమయంలో తరగతులు వింటున్నా. అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ కష్టమైన సబ్జెక్టులను అభ్యర్థులకు అర్థమయ్యే విధంగా చెబుతున్నారు. గ్రౌండ్లో పక్కాగా శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ కోచింగ్ చూసిన తర్వాత ఎస్ఐ కావాలన్న నా లక్ష్యం నెరవేరుతుందన్న నమ్మకం కలిగింది.
ఫ్రీ కోచింగ్ క్యాంపు అంటే మొదట్లో లైట్ తీసుకున్నా. ఏదో నడిపిస్తారులే అని అనుకున్నా. ఇక్కడికి వచ్చాక సెంటర్, అందులోని ఫ్యాకల్టీని చూసి ఆశ్చర్యపోయా. ప్రైవేట్ సెంటర్ల కంటే బాగున్నది. పోలీస్ అధికారులు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. పకడ్బందీగా.. ఓ ప్రణాళికా బద్ధంగా శిక్షణ ఇస్తున్నారు. ఇంకా అటెండెన్సు రిజిస్టర్ నుంచి తరగతుల నిర్వహణ బాగున్నది. ఎండల తీవ్రత దృష్ట్యా తరగతి గదుల్లో కూలర్లు, చల్లటి తాగునీరు ఏర్పాటు చేశారు.సమయానికి రుచికరమైన భోజనం పెడుతున్నారు.
– సురేశ్, వెంకట్రావుపల్లి, బోయినపల్లి మండలం
కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే కొలువు మీదే. మొదట మిమ్మల్ని మీరు నమ్మాలి. పాత ఆలోచనలకు స్వస్తిపలికి కొత్త కోణంలో ఆలోచిస్తే నిర్దేశిత గమ్యాన్ని చేరి విజయం సాధిస్తాం. పుస్తకాలు నిజమైన దేవుళ్లు. మనం కోరుకున్న వరాలు ఇస్తాయి. అడుగడుగునా ఆశీర్వదిస్తాయి. యువత సిరిసిల్లలో నిర్వహిస్తున్న పోలీస్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కొలువు సాధించి భవిష్యత్కు బంగారు బాటలు వేసుకోవాలి. ప్రైవేటు కోచింగ్ సెంటర్లలో కూడా లేని సౌకర్యాలను ఇక్కడ కల్పించాం. ఎస్పీతోపాటు మేం కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాం. అన్ని పోటీ పరీక్షలకు సన్నద్దమయ్యేలా స్టడీ మెటీరియల్ను అందిస్తాం. అభ్యర్థులు కొంతకాలం సోషల్ మీడియాను పక్కన పెట్టి చదువుపై దృష్టి పెట్టి కలలు సాకారం చేసుకోవాలి.
పోలీస్ ఉద్యోగం సాధించాలన్నది నా కల. కానీ, శిక్షణ తీసుకోవాలంటే ఇంతకుముందు దూరప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చయ్యేవి. మంత్రి కేటీఆర్ సూచనతో జిల్లా పోలీస్శాఖ స్థానికంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరం నాలాంటి ఎంతోమంది యువతులకు సువర్ణావకాశమని చెప్పవచ్చు. ఉచితంగా అందిస్తున్న శిక్షణ శిబిరంలో యువకులకు పోటీగా యువతులు హాజరుఅవుతున్నారు.
– భూక్య నిఖిత, దమ్మన్నపేట, మండలం గంభీరావుపేట