కొడుకు ఉద్యోగం కోసం కెనడాకు వెళ్లిన తెల్లారే తండ్రి మృత్యు ఒడికి చేరాడు. కోరుట్ల శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో కోరుట్ల సబ్స్టేషన్లో ఏడీఈగా పనిచేస్తున్న నీలం శ్రీనివాస్ తీవ్ర గాయాలపాలయ్యాడు. దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. కొడుకు విదేశానికి వెళ్లిన కొన్ని గంటల్లోనే ఈ ఘోరం జరగడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.
కోరుట్ల, మే 15: కొడుకు కెనడాకు వెళ్లిన తెల్లారే తండ్రిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబలించింది. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మర చెందగా మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం కోరుట్ల శివారులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల సమీపంలో జాతీయ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కోరుట్ల విద్యుత్ సబ్ స్టేషన్లో ఏడీఈగా పనిచేస్తున్న నీలి శ్రీనివాస్ (57) కారులో కోరుట్ల నుంచి కరీంనగర్కు వెళ్తున్నాడు.
ఇదే సమయంలో కథలాపూర్ మండలం భూషణ్రావుపేటలో ట్రాన్స్కో అసిస్టెంట్ లైన్మెన్గా పని చేస్తున్న వెన్నమల్ల శ్రీనివాస్ కారులో జగిత్యాల నుంచి కోరుట్ల వైపు వస్తున్నాడు. కోరుట్ల శివారులో రెండు కార్లు ప్రమాదవశాత్తు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ప్రమాదంలో కార్ల ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఏడీఈ శ్రీనివాస్ తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ఆయనను అంబులెన్స్లో దవాఖానకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అసిస్టెంట్ లైన్మెన్కు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం కరీంనగర్కు తరలించారు.
కాగా మృతుడు శ్రీనివాస్ పట్టణంలోని ట్రాన్స్కో కార్యాలయంలో ఏడీఈగా మూడు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నాడు. అందరితో కలుపుగోలుగా ఉండే ఏడీఈ మృతితో సహచర ఉద్యోగులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుడి కుమారుడు సాయి అన్వేష్ ఉద్యోగం కోసం శనివారం కెనడా వెళ్లిన సంతోషంలో ఉండగానే, ఇంతలోనే ఘోరం జరిగి పోయిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. మృతుడికి భార్య దీపిక, కుమారుడు సాయిఅన్వేష్, కూతురు మౌనిక ఉన్నారు. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.