కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలను సమానంగా చూడాలి. కానీ, గుజరాత్కో నీతి, పంజాబ్కో నీతి, తెలంగాణకు మరో నీతి అన్నట్లుగా వ్యవహరిస్తున్నది. కొట్లాడి తెచ్చుకొన్న రాష్ట్రంపై బీజేపీ మొదటి నుంచి విషం కక్కుతూనే ఉంది. హైదరాబాద్కు వచ్చిన కేంద్ర హోం మంత్రి అమిత్షా రాష్ట్రంపై దండయాత్రకు వచ్చినట్టుంది. సీఎం కేసీఆర్ పాలనను తప్పు పట్టడమే కాకుండా వాళ్ల చిల్లర బ్యాచ్కు కితాబిచ్చి తన గౌరవాన్ని పోగొట్టుకున్నారు.
ఇవాళ బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం అడుగులు వేస్తుంటే మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడడం బాధాకరం. తెలంగాణ ప్రజలు తిరగబడాలని ఒక్కసారి అనుకుంటే అమిత్షా కాదు.. ఎంతమంది వచ్చినా షాకులు తగలక తప్పదు… విభజన చట్టాన్ని అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బీజేపీకి త్వరలోనే గుణపాఠం చెప్పడం ఖాయం.
కోల్సిటీ, మే 15: అమిత్ షాకు తెలంగాణ షాక్ తప్పదని, తెలంగాణ రాష్ర్టాన్ని కించపరిచేలా మాట్లాడిన షాకు ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గోదావరిఖనిలోని క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన బీజేపీపై నిప్పులు చెరిగారు. హైదరాబాద్కు వచ్చిన కేంద్ర మంత్రి అమిత్ షాను తెలంగాణకు వరాలు ప్రకటించాలని ఇక్కడి నాయకులు ఎందుకు కోరలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశ్నలకు బీజేపీ ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుందని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర రైతులు పండించిన ధాన్యం కొనాలని ఢిల్లీకి సీఎం కేసీఆర్, మంత్రులు వెళ్లి కోరినా కొనేది లేదంటూ తిరిగి పంపించిన రోజులను మా రైతాంగం మరచిపోదన్నారు. తెలంగాణకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్కు ఎందుకు ఇవ్వలేదని బీజేపీ రాష్ట్ర నాయకులు అమిత్ షాను ప్రశ్నించాల్సిందని అన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో కనీస విజన్ లేని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎందుకు తెలంగాణలో పర్యటిస్తున్నారో ఆయనకే అర్థం కావడం లేదన్నారు. 60 యేళ్ల క్రితం తెలంగాణలో ఆత్మహత్యలు, ఆకలి చావులు ఉన్నప్పుడు ఈ బండి సంజయ్, అమిత్ షాలు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఇవాళ బంగారు తెలంగాణ దిశగా అడుగులు వేస్తుంటే మత విద్వేషాలను రెచ్చగొడుతూ బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పా ల్పడడం బాధాకరమన్నారు.
దేశంలో ఏరాష్ట్రం లో లేనివిధంగా తెలంగాణలో అభివృద్ధి, సంక్షే మ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ పాలనను కించపరిచేలా మాట్లాడి అమిత్ షా తన విలువను పోగొట్టుకున్నారన్నారు. ఇక పచ్చి అబద్ధాల నోరు బండి సంజయ్కి అమిత్ షా వత్తాసు పలకడం ఆశ్చర్యంగా ఉందన్నారు. సీఎం కేసీఆర్ బాణం ఎక్కుపెడితే బీజేపీ ప్రభు త్వం మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఈ దండయాత్ర ధోరణులు మానుకొని ఇప్పటికైనా బుద్ధిగా ఉండాలని హితవు పలికారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ పెడుతామని చెప్పిన బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎందుకు చేతులు దులుపుకుందని ప్రశ్నిస్తూనే గుజరాత్లో రూ.20వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ ఎలా వీలైందని నిలదీశారు.
దేశంలో 150 మె డికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఎందుకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదని అమిత్ షాను రాష్ట్ర నాయకులు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ పట్టుబట్టి రాష్ర్టానికి 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఎందుకు అమలు కాలేదో అమిత్షా సమాధానం చెప్పాలన్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఒక్క రామగుండం నియోజకవర్గంలోనే డీఎంఎఫ్టీ, సీఎం గ్రాంట్, పట్టణ ప్రగతి కింద రూ.700 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. సమావేశంలో నగరపాలక మేయర్ డా.అనిల్ కుమార్ ఉన్నారు.