కమాన్చౌరస్తా, మే 13: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాలల్లో మెరుగైన విద్యా బోధన చేస్తున్నారని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో కలెక్టర్ అధ్యక్షత జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, కళాశాలల్లో డ్రాపౌట్ శాతం తగ్గించాలని, ఉన్నత విద్యా ప్రమాణాలు పెంచాలన్నారు.
పీజీ పూర్తయిన విద్యార్థులకు వారధి ద్వారా పోటీ పరీక్షల కోసం శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థి ఆన్ లైన్, మూక్స్, స్వయం, కొర్సెరా వంటి కోర్సులు అధ్యయనం చేయాలని సూచించారు. డిగ్రీ కళాశాలల్లో వసతుల కల్పనకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సారార్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలల ఆధ్వర్యంలో ముద్రించిన ప్రచార పోస్టర్ను కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఆవిషరించారు.
అలాగే, జిజ్ఞాస పోటీల్లో తృతీయ బహుమతి సాధించిన ఎస్సారార్ విద్యార్థిని అభినందించారు. ఈ సమావేశానికి ఎస్సారార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే రామకృష్ణ కన్వీనర్గా వ్యవహరించగా, ప్రభుత్వ మహిళా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి శ్రీలక్ష్మి, జమ్మికుంట కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుజాత, హుజూరాబాద్ కళాశాల ప్రిన్సిపాల్ పరమేశ్, ఎస్ ఓదెలు కుమార్, లక్ష్మీనర్సయ్య, శ్రీనివాస్, మల్లారెడ్డి, డీఆర్సీ సమన్వయకర్త ఎం హిమబిందు తదితరులు పాల్గొన్నారు.