గంగాధర, మే 13: పేదింటి ఆడబిడ్డల పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం ఆర్థికంగా భరోసా కల్పిస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. మండలంలోని కురిక్యాల గ్రామానికి చెందిన 10 మంది లబ్ధిదాలకు కల్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,00,116 చొప్పున ప్రోత్సాహకం మంజూరైంది. కాగా, శుక్రవారం ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇండ్లకు వెళ్లి కల్యాణలక్ష్మి చెక్కులతో పాటు చీర, జ్యూట్ బ్యాగు అందజేశారు. చెల్లి ఇంటికి అన్న వచ్చినప్పుడు ఉట్టిగనే వస్తడా అందుకే కల్యాణలక్ష్మి చెక్కుతో పాటు చీర తెచ్చాను అని చెప్పి చెక్కుతో పాటు చీర అందజేశారు. జ్యూట్ బ్యాగుపై ఉన్న కేసీఆర్ బొమ్మను చూపిస్తూ సారును మరువవద్దని కోరారు. ఆడబిడ్డ పెండ్లికి కల్యాణలక్ష్మి పథకం కింద ఆర్థిక సాయం అందజేస్తూ, అండగా నిలుస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ తప్ప ప్రపంచంలో మరెక్కడా లేదన్నారు.
పోటీ పరీక్షల కోసం గంగాధర మండలంలో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణను నియోజకవర్గంలోని యువతీయువకులు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పిలుపునిచ్చారు. కురిక్యాలలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. ఉచిత శిక్షణతో పాటు మధ్యాహ్న భోజన వసతిని కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో లక్షా 34 వేల ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేసిందని, ప్రస్తుతం 30,450 ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి 800 మంది ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
ఎంత మంది వచ్చినా ఉచిత శిక్షణ అందించడంతో పాటు భోజన సదుపాయం కల్పిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ సాగి మహిపాల్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, వైస్ ఎంపీపీ కంకణాల రాజ్గోపాల్రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు వేముల దామోదర్, జోగు లక్ష్మీరాజం, ఎంపీటీసీ ద్యావ మధుసూదన్రెడ్డి, నాయకులు రేండ్ల శ్రీనివాస్, రామిడి సురేందర్, తోట మహిపాల్, నిమ్మనవేణి ప్రభాకర్, వేముల అంజి, పంజాల ఆంజనేయులు, వడ్లూరి ఆదిమల్లు. సుంకె అనిల్, పెంచాల చందు, మామిడిపెల్లి అఖిల్, సముద్రాల అజయ్, వినోద్ పాల్గొన్నారు.