మానేరు వాగు స్వచ్ఛతే లక్ష్యంగా సిరిసిల్లలో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ను నిర్మిస్తున్నారు. దీని కోసం మొదటి బైపాస్ రహదారిలోని నర్సింగ్ కళాశాల సమీపంలో ఆరెకరాలు కేటాయించారు. మంత్రి కేటీఆర్ చొరవతో ఇటీవలే 61.50 కోట్లు విడుదల కాగా, బల్దియా ఆధ్వర్యంలో పనులు ప్రారంభించారు. ఇది అందుబాటులోకి వస్తే నిత్యం 10 మిలియన్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసే అవకాశమున్నదని అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ప్లాంట్ నిర్మాణంపై పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన అమాత్యుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రాజన్న సిరిసిల్ల, మే 13 (నమస్తే తెలంగాణ) : కార్మిక క్షేత్రమైన సిరిసిల్ల పట్టణంలో లక్ష జనాభా, సుమారు 20 వేల నివాసాలుంటాయి. వాటికి తోడు అద్దకం, సైజింగ్, పవర్లూం పరిశ్రమలున్నాయి. వీటి నుంచి నిత్యం వెలువడుతున్న 4 మిలియన్ లీటర్ల మురుగునీరు రెండో బైపాస్ ప్రాంతంలోని తుమ్మలకుంట చెరువులో కలుస్తుంది. దీంతో పక్కనే ఉన్న పంటలు పాడైపోతున్నాయి. అలాగే మానేరువాగు సైతం కలుషితమవుతున్నది. ఈ ప్రాంతం మొత్తం దుర్గంధభరితంగా మారడంతో రైతులు ఏడాది క్రితం మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అమాత్యుడు సీవరేజ్ ప్లాంట్ నిర్మిస్తానని హామీ ఇచ్చారు. వెంటనే డీపీఆర్ రూపొందించి పంపించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గం అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తుంది. పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు నిర్మించారు. 100 కోట్లతో సుందరీకరణ పనులు చేపట్టారు. అలాగే ఈ యేడాది మరో 15 కోట్లు మంజూరు చేయించారు. జనవాసాలు, అద్ధకం పరిశ్రమల నుంచి వచ్చే మురుగు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలన్న ప్రజల విజ్ఞప్తికి స్పందించారు. సిరిసిల్లకు ఎస్టీపీ ప్లాంట్ను మంజూరు చేస్తానని ఏడాది క్రితం ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. అధికారులు డీపీఆర్ సిద్ధం చేసి నివేదికలిచ్చిన వెంటనే నిధులు మంజూరు కావడంతోపాటు పనులు చకాచకా సాగుతున్నాయి. 11 ఎకరాల్లో ప్లాంట్ నిర్మించాలని నిర్ణయించారు. సర్కారు భూమి 6 ఎకరాలు ఉండగా మరో 5 ఎకరాలు ప్రైవేట్ భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణ కోసం అధికారులు ప్రణాళికలు రూపొందిస్తుండగా, ప్రస్తుతం ఉన్న 6 ఎకరాల్లో ప్లాంట్ నిర్మాణ పనులను వారం కిత్రం అధికారులు ప్రారంభించారు.
లక్ష జనాభా కలిగిన సిరిసిల్ల మున్సిపాలిటీ శివారు గ్రామాల విలీనం తర్వాత ఇంకా విస్తరిస్తున్నది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మున్సిపాల్టీ 19.1 ఎంఎల్డీ సామర్థ్యం కలిగిన మురుగునీటి శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. ప్రస్తుతం రోజుకు 10 మిలియన్ లీటర్ల నీటిని శుద్ధి చేసేలా ఏర్పాట్లు చేస్తున్నది. నర్సింగ్ కళాశాల రోడ్డులో ఉన్న 6 ఎకరాల భూమిలో నీటి శుద్ధికరణ ప్లాంట్ కోసం పెద్ద బావి నిర్మాణ పనులను ప్రారంభించింది. ప్లాంట్లో శుద్ధి చేసిన నీటిని హరిత హారంలో నాటిన మొక్కలకు, చెట్లకు, పంటచేలకు వివిధ అవసరాలకు వినియోగించనున్నారు. 33 ఫీట్ల లోతు, సుమారు వంద ఫీట్ల వెడల్పుతో పెద్ద బావి తవ్వకం పనులు శరవేగంగా సాగుతున్నాయి. బావినిర్మాణ పనులు పూర్తి కాగానే శుద్ధ్ధి చేసే యంత్రాలను తెప్పించనున్నట్లు అధికారులు తెలిపారు.
సిరిసిల్లకు ఎస్టీపీ ప్లాంట్ను మంత్రి కేటీఆర్ మంజూరు చేయించారు. 61.50 కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభించాం. ఏడాదిలోగా పూర్తి చేయాలన్నది లక్ష్యం. శుద్ధీకరణ చేసిన నీటిని హరితహారం, పంటచేలకు, వివిధ అవసరాలకు వినియోగించుకునేలా ప్రతిపాదనలు రూపొందిస్తాం. అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన అమాత్యుడికి కృతజ్ఞతలు.
– జిందం కళా చక్రపాణి, చైర్పర్సన్, సిరిసిల్ల మున్సిపాలిటీ