కాలిన గాయాలతో వచ్చినా..రక్త సిక్తమైన శరీరంతో వచ్చినా.. ప్రాణాపాయ స్థితిలో వచ్చినా.. గర్భిణులు పురిటి నొప్పులతో వచ్చినా..అక్కున చేర్చుకునే నర్సులు. తరతమ భేదం లేకుండా కుటుంబ సభ్యుల్లా భావించి సేవలందిస్తారు..అందుకే వారిని వృత్తిపరంగా నర్సులుగా పిలుస్తున్నా అందరూ ఆత్మీయంగా సిస్టర్ అంటూ సంబోధిస్తుంటారు.. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి,కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఎందరో ప్రాణాలను నిలబెట్టారు..నేడు ప్రపంచ నర్సుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. విద్యానగర్ మే 11
కరోనా కట్టడిలో నర్సులు కీలకభూమిక పోషించారు. ప్రాణాలను సైతం లెక్క చేయకుండా, నెలల తరబడి కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి వ్యాధిగ్రస్తుల సేవలో తరించారు. 24 గంటల పాటు కంటికిరెప్పలా కాపాడి వారి ప్రాణాలను నిలబెట్టారు. ముఖంపై చెరగని చిరునవ్వుతో వ్యాధిగ్రస్తుల్లో మనోధైర్యాన్ని నింపారు. కొందరు సహచరులు మహమ్మారి బారిన పడి మరణించినా గుండె నిబ్బరంతో సేవలందిం చారు. డాక్టర్లకు తలలో నాలుకలా వ్యవహరిస్తూ వారిచ్చే సూచనలు, సలహాలను పాటిస్తూ ఎందరో రోగులకు జీవంపోశారు.
నర్సులు వైద్యవృత్తికి గౌరవాన్ని, హుందాతనాన్ని తీసుకువచ్చారు. ఆరోగ్య రక్షణలో వీరు అందించిన కృషిని తలుచుకుంటూ ప్రతి ఏటా మే 12న అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ వృత్తికి గుర్తింపు తెచ్చిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రపంచ దేశాలన్నీ ఈ రోజు ఈ వేడుకలు జరుపుకొంటున్నాయి. దేశంలో విశిష్ట సేవలందిస్తున్న నర్సులను గుర్తించి భారత రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందించి వారిని సముచితంగా సత్కరిస్తారు. అంతే కాకుండా ప్రజలకు వైద్య సేవలందిస్తున్న నర్సులను ప్రభుత్వం నర్సింగ్ ఆఫీసర్లుగా గుర్తించింది. దీంతో ప్రజల్లో నర్సులకు గౌరవ హోదా లభించింది. గతంలో ఏ ప్రభుత్వం ఇవ్వని విధంగా తెలంగాణ ప్రభుత్వం నర్సులకు ఉద్యోగోన్నతులు కల్పించి వారి సేవలకు సముచిత గుర్తింపునిచ్చింది.
నర్సుగా సేవలందించడం ఆత్మసంతృప్తినిస్తున్నది. ఆపరేషన్ థియేటర్లలో 24 గంటలు పనిచేస్తుంటాను. డ్రెస్ వేసుకున్నాక విధుల్లో నిమిగ్నమైపోతా. నైటింగెల్ ఫ్లారెన్స్ నాకు ఆదర్శం. 1988లో దసరా పండుగ సందర్భంగా దవాఖానలో నాతో పాటు సులోచన, ఇద్దరమే డ్యూటీ చేశాం. పని ఒత్తిడి ఎంత ఉన్నా, కుటుంబాలకు దూరమైనా వృత్తినే దైవంగా భావించి సేవలందించాం.
– అంజమ్మ, నర్సింగ్ సూపరింటెండెంట్
ఉద్యోగంలో చేరినప్పటి నుంచి నేను ఎక్కువగా వృత్తికే అంకితమయ్యాను. మా కుటుంబ నేపథ్యం నుంచే నాకు అలవాటు అయింది. విధుల్లో ఉన్నంత సేపు పూర్తిస్థాయిలో సేవలందించడమే పరమావధిగా భావిస్తాను. కుటుంబానికి ఇచ్చిన సమయం కన్నా దవాఖానలో సేవలకిచ్చిన సమయమే ఎక్కువ. ఏ బాధ్యతలు అప్పగించినా పూర్తిస్థాయిలో సమర్థవంతంగా నిర్వర్తించడమే నా లక్ష్యం.
– జనగామ సులోచన, నర్సింగ్ సూపరింటెండెంట్
ప్రాణాలకు తెగించి రెండేండ్లు కొవిడ్ వార్డులోనే డ్యూటీ చేశా. ఆరోగ్యం సహకరించకున్నా కుటుంబానికి దూరంగా ఉంటూ రోగులకు సేవలందించాను. ఇప్పటికి అధికారుల నుంచి మూడు సార్లు ఉత్తమ ఉద్యోగిగా అవార్డును తీసుకోవడంతో మరింత బాధ్యత పెరిగింది. మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలందించడం ఆనందంగా ఉంది.
– పిట్టల విజయలక్ష్మి, నర్సింగ్ సూపరింటెండెంట్
దవాఖానలో చికిత్స కోసం వస్తున్న రోగులకు వైద్యంతో పాటు మనోధైర్యాన్ని కల్పిస్తున్నాం. రోగులను మా కుటుంబ సభ్యుల్లాగా ఆదరిస్తూ భరోసా కల్పిస్తున్నాం. నేను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎక్కువగా పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగాయి. గాయాలైన ఎంతో మంది ప్రాణాలను కాపాడామన్న తృప్తి ఉంది. కొండగట్టు బస్సు సంఘటన, ఆదిలాబాద్ జిల్లాలో ట్రాక్టర్ బోల్తా ఘటనలో వైద్య సేవలందించినందుకు ఆనందంగా ఉంది.
– సరళ, నర్సింగ్ సూపరింటెండెంట్