కిడ్నీ బాధితులకు రాష్ట్ర సర్కారు పునర్జీవం పోస్తున్నది. ఇప్పటికే జిల్లా ప్రధాన దవాఖానల్లో డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చి, వేలాది మంది ప్రాణాలకు భరోసానిస్తున్నది. అయినా గ్రామీణ ప్రాంతాల్లోని బాధితులకు సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంతో మండల కేంద్రాల్లోనూ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నది. తాజాగా గంగాధర పీహెచ్సీకి మంజూరు చేసింది. త్వరలోనే సేవలు అందుబాటులోకి రానుండగా, బాధితులకు ఆర్థిక, దూరభారం తప్పనున్నది.
– గంగాధర, మే 11
గంగాధర.. కరీంనగర్ జిల్లా కేంద్రానికి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ మండల కేంద్రం చుట్టూ దాదాపు 30 గ్రామాలు ఉన్నాయి. ఈ ప్రాంత కిడ్నీ బాధితులు డయాలసిస్ చేయించుకోవాలంటే ప్రస్తుతం కరీంనగర్లోని ప్రభుత్వ ప్రధాన దవాఖానకు వెళ్తున్నారు. అయితే దూరభారంతోపాటు సమయం వృథా అవుతున్నది. పైగా రవాణా ఖర్చులు అదనంగా భరించాల్సి వస్తున్నది. గంగాధర పీహెచ్సీలోనే డయాలసిస్ సెంటర్ ఉంటే బాధితులకు ఎంతో మేలు జరుగుతుంది. మండలంలోని ఏ గ్రామం నుంచైనా కేవలం పది నిమిషాల్లోనే పీహెచ్సీకి చేరుకునే అవకాశముంటుంది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని గంగాధర పీహెచ్సీని 50 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేయడంతోపాటు డయాలసిస్ సెంటర్, ఐసీయూను మంజూరు చేయాలని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్తోపాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావుకు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు వారు సానుకూలంగా స్పందించారు. తాజాగా గంగాధర పీహెచ్సీకి డయాలసిస్ సెంటర్ను మంజూరు చేస్తున్నట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. త్వరలోనే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.
చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని పీహెచ్సీల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. మరింత మెరుగైన వైద్య సేవలందేలా చూస్తున్నాం. గంగాధర మండల కేంద్రం నియోజకవర్గానికి సెంటర్ పాయింట్గా ఉంది. ఇక్కడి పీహెచ్సీకి మండలంతోపాటు చుట్టు పక్కల మండలాల నుంచి వస్తుంటారు. నిత్యం రద్దీగా ఉండే ఈ పీహెచ్సీని 50 పడకల దవాఖానగా అప్గ్రేడ్ చేయడంతోపాటు డయాలసిస్ సెంటర్, ఐసీయూ ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు విజ్ఞప్తి చేశాం. మంత్రి ఆదేశాల మేరకు పీహెచ్సీకి డయాలసిస్ సెంటర్ మంజూరైంది. సేవలు అందుబాటులోకి వస్తే కిడ్నీ బాధితులకు ఎంతో మేలు జరుగుతుంది.
– సుంకె రవిశంకర్, ఎమ్మెల్యే (చొప్పదండి)
డయాలసిస్ సెంటర్ మంజూరుపై టీఆర్ఎస్ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. అలాగే గంగాధర మండల పరిధిలోని కోర్టు కేసులను సిరిసిల్ల, వేములవాడ నుంచి కరీంనగర్ కోర్టుకు మార్చడంపైనా సంతోషం వ్యక్తం చేశారు. మధురానగర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్రావు, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
కార్యక్రమంలో ఎంపీపీ శ్రీరాం మధుకర్, ఏఎంసీ చైర్మన్ సాగి మహిపాల్రావు, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఆత్మ చైర్మన్ తూం మల్లారెడ్డి, సర్పంచులు ముక్కెర మల్లేశం, రాసూరి మల్లేశం, నాయకులు వేముల అంజి, ఆకుల మధుసూదన్, బొల్లాడి శ్రీనివాస్రెడ్డి, చిలుముల రమేశ్, సామంతుల శ్రీనివాస్, కోల లింగారెడ్డి, సుంకె అనిల్, పెంచాల చందు, మామిడిపెల్లి అఖిల్, బాషుమియా, కడారి మల్లారెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.