నువ్వుల సేద్యం విస్తరిస్తున్నది. రైతన్న ఇంట సిరులు కురిపిస్తున్నది. నూనెగింజలకు ఫుల్ డిమాండ్ ఉండడం, ఎకరాకు రూ. పదివేల లోపే పెట్టుబడి అవుతుండగా, పంటను నమ్ముకున్న రైతుకు దండిగా లాభాలు తెచ్చిపెడుతున్నది. మార్కెట్లో క్వింటాల్కు 10వేల పైనే ధర పలుకుతున్నది. ఈ యాసంగి సీజన్లో మెట్పల్లి డివిజన్లో వందలాది హెక్టార్లలో సాగు చేయగా, ఎకరాకు ఐదింతల ప్రాఫిట్ అంటే 50వేల దాకా దక్కుతున్నది.
– మెట్పల్లి, మే 11
ఆరుతడి పంటల్లో నువ్వుపంట సాగు అత్యుత్తమమైనదిగా రైతులు భావిస్తారు. వాతావరణం అనుకూలిస్తే మంచి దిగుబడి వస్తుంది. ప్రస్తుత మార్కెట్లోనూ మంచి డిమాండ్ ఉండడంతో రైతుల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. ఈ యాసంగిలో మెట్పల్లి డివిజన్ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మెట్పల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో ఆరుతడి పంటలలో ఒకటైన నువ్వు పంటను వందలాది ఎకరాల్లో సాగు చేశారు.
నువ్వు సాగుకు ఎకరానికి 2 కిలోల విత్తనం మాత్రమే సరిపోతుంది. విత్తిన నుంచి దిగుబడి వరకు ఎకరానికి కనీసం 8 వేల దాకా పెట్టుబడి అవుతుంది. ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ఉత్పత్తికి ప్రత్యేకంగా మార్కెట్ సౌకర్యం లేకపోయినప్పటికీ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో వ్యాపారులే నేరుగా రైతుల నుంచి కొనుగోలు చేస్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో క్వింటాల్కు 9 వేలు నుంచి 10 వేల దాకా ధర పలుకుతుంది. యాసంగి ముగిసిన తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంట విత్తనాన్ని వేస్తుంటారు.
విత్తనం వేసిన నుంచి 90 రోజుల వ్యవధిలో పంట చేతికి వస్తుంది. విత్తిన పదిరోజుల తర్వాత నీటి తడిని అందించాలి. అదే విధంగా వారానికి ఒక సారి లేదా రెండు సార్లు మాత్రమే తడిని అందించాలి. విత్తనం మొలకెత్తిన వెంటనే గడ్డి నివారణ మందును పిచికారీ చేయాలి. దీంతో కలుపు మొక్కల బెడద తప్పుతుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించినట్లయితే పంట సజావుగా పండి చేతికి అందుతుంది.
కాగా, మెట్పల్లి డివిజన్లో ఇప్పుడిప్పుడే పంట కోతలకు వచ్చింది. నువ్వు పంటను కోసి పంట పొలాల వద్దే ఎండకు ఆరబెట్టి నువ్వులు దులుపుతుంటారు. కొద్దిపాటి శ్రమ, వారానికోసారి నీటి తడి, తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు అందించే పంటపై యాసంగి సీజన్లో రైతులు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తున్నది.