రైతు వేదికల లక్ష్యం నెరవేరుతున్నది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం కనిపిస్తున్నది. రైతు ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో నిర్మించిన ఈ వేదికల ద్వారా వ్యవసాయ శాఖ సాగుకు సన్నద్ధం చేస్తున్నది. వచ్చే వానకాలంలో ఎలాంటి పంటలు వేయాలి? ఏ విత్తనాలను ఎంపిక చేసుకోవాలి? ప్రభుత్వ పథకాలను ఏ విధంగా అందుకోవాలి? వంటి అంశాలపై శిక్షణ ఇస్తున్నది. అంతే కాకుండా నకిలీ విత్తనాలతో మోసపోకుండా అనుబంధ శాఖలు, పోలీస్ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. సాగులో పాటించాల్సిన పద్ధతులు, నకిలీ విత్తన మోసాలపై వివరిస్తూ వారిని చైతన్యవంతులను చేస్తున్నది. ఇప్పుడు ఏ వేదిక చూసినా శిక్షణ కార్యక్రమాలతో సందడిగా కనిపిస్తున్నది.
కరీంనగర్, మే 11 (నమస్తే తెలంగాణ) : రైతులకు సమగ్ర సమాచారం అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 5వేల హెక్టార్ల భూమిని ఒక క్లస్టర్గా ఏర్పాటు చేసి, ఒక్కోదానికి ఒక రైతు వేదికను నిర్మించింది. ఈ విధంగా కరీంనగర్ జిల్లాలో 76 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించగా, ఒక్కో వేదికకు రూ.22 లక్షలు వెచ్చించింది.
క్లస్టర్ పరిధిలో రైతులు ఎలాంటి పంటలు వేయాలి?, ఎలాంటి పంటలు వేస్తే లాభదాయకంగా ఉంటా యి?, ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీ వివరాలు, రైతుబంధు, రైతు బీమా, ఇతర పథకాల పర్యవేక్షణ ఈవేదిక ద్వారానే నిర్వహించాలని ప్రభు త్వం భావించింది. ఈ వేదిక ద్వారా వాతావరణ సమాచారం కూడా రైతులకు అనునిత్యం అందుబాటులోకి తెస్తోంది. వాతావరణంలో వచ్చే మా ర్పులను రైతులకు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్న ది.
జిల్లా,రాష్ట్రస్థాయి అధికారులు కూడావీడియో కాన్ఫరెన్స్లు నిర్వహించేందుకు ఈ వేదికలను అనువుగా నిర్మించబోతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రతి సమాచారాన్ని ఇక్కడి నుంచి అందించే విధంగా రైతు వేదికలను తీర్చిదిద్దబోతున్నారు. అందులో భాగంగానే ఈ వానకాలంలో ఎలాంటి పంటలు సాగు చేయాలనే విషయమై ప్రతి రైతు వేదికలో ఆయా క్లస్టర్ల పరిధిలోని రైతులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం జిల్లాలో ఏ రైతు వేదికను చూసినా సందడిగా కనిపిస్తోంది. వచ్చే వానకాలం సీజన్కు రైతులను సమాయత్తం చేసేందుకు అధికారులు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్ జిల్లాలోని 76 క్లస్టర్లలో ఇప్పటికే 50కి పైగా శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ తెలిపారు. రైతు వేదికల్లో జరుగుతున్న శిక్షణ తరగతుల్లో ఒక్క వ్యవసాయ అధికారులే కాకుండా పోలీసు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు కూడా పాల్గొంటున్నారు.
పంటల సాగు ప్రధానంగా పచ్చి రొట్ట ఆవశ్యకత, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో ఆధార్ అనుసంధానం, పత్తి, ఇతర విత్తనాల కొనుగోలులో పాటించాల్సిన జాగ్రత్తలు, ఫాస్పరస్ సాల్యుబిలైసింగ్ బ్యాక్టీరియా ఉపయోగం, లాభాలు, ఎరువుల సమతుల్య వాడకం, తదితర అంశాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. జిల్లా స్థాయి వ్యవసాయ అధికారులు కూడా శిక్షణ కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొంటున్నారు. పోలీసు అధికారులు పాల్గొని నకిలీ విత్తనాలను ఏ విధంగా అరికట్టాలో రైతులకు వివరిస్తున్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయో చెబుతున్నారు. వచ్చే వానకాలం సీజన్లో లైసెన్స్ ఉన్న డీలర్ల వద్దనే విత్తనాలు కొనుగోలు చేయాలని వివరిస్తున్నారు.
రైతు వేదికల్లో జరిగే శిక్షణ కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు కూడా హాజరవుతున్నారు. బుధవారం గంగాధర మండలం బూరుగుపల్లి రైతు వేదికలో జరిగిన శిక్షణ కార్యక్రమానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశాలు, ఆశయాల కోసమైతే ఈ వేదికలను నిర్మించిందో అవి నెరవేరుతున్నాయనే చర్చ సర్వత్రా జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది.
కరీంనగర్ జిల్లాలోని అన్ని వేదికల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఇంతగా క్షేత్ర స్థాయిలో శిక్షణ తరగతులు నిర్వహించుకునేందుకు ఎలాంటి సదుపాయాలు ఉండేవి కాదు. ఇప్పుడు రైతు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. వీటి ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలు, ఆశయాలు కూడా నెరవేరుతున్నాయి. ఒక్క వ్యవసాయ అధికారులే కాకుండా అనుబంధ శాఖల అధికారులు, పోలీసు అధికారులు కూడా వచ్చి రైతులకు శిక్షణ ఇస్తున్నారు.
రైతులకు సాగుపై అవగాహన పెరుగడమే కాకుండా ఇతర విషయాలపైనా అవగాహన పెరుగుతుందనే నమ్మకం కనిపిస్తోంది. రైతులను అనేక విషయాల్లో చైతన్యవంతం చేసేందుకు వేదికలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
– వాసిరెడ్డి శ్రీధర్, కరీంనగర్ జిల్లా వ్యవసాయాధికారి