..పైకి సరికొత్త హంగులు.. ఆకర్షణీయమైన పోస్టర్లు కనిపించినా సగటు సినిమా ప్రేక్షకుడు మాత్రం అసౌకర్యాల మధ్యలో సినిమా చూడాల్సి వస్తున్నది. కనీస నిబంధనలు పాటించకుండా యాజమాన్యాలు చుక్కలు చూపిస్తున్నాయి. సినిమా మధ్యలోనే ఏసీలు కట్ చేస్తూ.. సౌండ్స్ ఆఫ్ చేస్తూ విరక్తి పుట్టిస్తున్నాయి. మరో వైపు క్యాంటీన్లో రెట్టింపు ధరలతో అందినకాడికి దోచుకుంటున్నాయి. ఇక భద్రతా నియమాలు గాలికి వదిలేశాయి. పార్కింగ్ ఫీజులు తీసుకుంటున్నా కనీసం షెడ్లు ఏర్పాటు చేయకపోవడంతో వాహనాలు ఎండలో ఎండుతూ, వానకు తడుస్తున్నాయి.
కమాన్చౌరస్తా, మే 11 : కరీంనగర్లోని పలు థియేటర్ల యాజమాన్యాల తీరుతో సగటు ప్రేక్షకుడికి నిరాశే మిగులుతోంది. ఆహ్లాదం పంచాల్సిన థియేటర్లు అవస్థలు పెడుతున్నాయి. రెండేళ్ల తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు విడుదలవుతున్న క్రమంలో ప్రేక్షకుల తాకిడి పెరిగింది. కానీ, సినిమా విషయంలో ఒకింత సంతోషంగా ఉన్నా, అక్కడ కల్పిస్తున్న సౌకర్యాల విషయంలో పెదవి విరుస్తున్నారు.
థియేటర్లలో అసౌకర్యాలపై ఫిర్యాదులు వస్తున్న క్రమంలో మంగళవారం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు నగరంలోని పలు థియేటర్లపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. సౌకర్యాలు కల్పించని, భద్రతా నియమాలు పాటించని థియేటర్లను సీజ్ చేశారు. ఇందులో ప్రత్యేక బృందాలుగా వెళ్లిన అధికారులు పలు థియేటర్ల నిర్వహణపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
పలు థియేటర్లలో భద్రతా నియమాలను నిర్వాహకులు గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది. థియేటర్లకు వచ్చిన వారు పేలుడు పదార్థాలు, తుపాకులు తీసుకువస్తే గుర్తించే పరికరాలు, అనుకోకుండా ప్రమాదం జరిగితే తీసుకునే చర్యల విషయంలో నిర్వాహకులు నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
పలు సందర్భాల్లో సినిమాలను ఆనందంగా చూడలేక పోతున్నామని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంతో సినిమా చూస్తున్న సమయంలో నిర్వాహులు ఏసీలు ఆఫ్ చేస్తూ, సౌండ్స్ క్లారిటీగా ఇవ్వకుండా నిరుత్సాహ పరుస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో ప్రేక్షకులు నిర్వాహకులతో గొడవలకు దిగిన సందర్భాలు లేక పోలేదు.
సినిమాకు వచ్చే ప్రేక్షకుల వాహనాల పార్కింగ్ విషయంలో థియేటర్ల నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న నిర్వాహకులు ఎలాంటి షెడ్లు ఏర్పాటు చేయడం లేదు. దీంతో వాహనాలు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్నాయి.
క్యాంటీన్లలో ధరలు మండిపోతున్నాయని పలువురు ప్రేక్షకులు వాపోతున్నారు. గతంలో ధరల నియంత్రణ కోసం పలు థియేటర్లు, మల్టీఫెక్స్లపై ప్రభుత్వం దాడులు నిర్వహించి ధరల పట్టికలు ఏర్పాటు చేయాలని, నిర్ణీత ధరలకే అమ్మకాలు చేపట్టాలని ఉత్తర్వులు వెలువరించింది. అప్పుడు నియమ నిబంధనలు పాటించిన యాజమాన్యాలు, ఇప్పుడు మళ్లీ ధరల విషయంలో ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది.
కాలేజీ అయిపోయిన తర్వాత సినిమాకు వచ్చాం. ఇక్కడికి వచ్చిన తర్వాత బండి పార్కింగ్తో పాటు క్యాంటీన్లో ధరలు మండిపోతున్నయ్. బయట రూ.15కు దొరికే సమోసా ఇక్కడ రూ.25కు అమ్ముతున్నరు. కూల్డ్రింక్స్కు కూడా డబుల్ రేట్ తీసుకుంటున్నరు. నాలాంటి ప్రేక్షుకుడు ఎంజాయ్ కోసం సినిమాకు వస్తే ఇబ్బందులు తప్పడం లేదు.
-దినేశ్కుమార్, విద్యార్థి
థియేటర్లలో నిర్వహణ సరిగా లేదు. సౌండ్, ఏసీ విషయంలో సినిమా మధ్యలో నిరుత్సాహ పడుతున్నాం. ఏసీ విషయంలో నిర్వాహకులను ప్రశ్నించినా స్పందించడం లేదు. సౌండ్స్ సరిగా రావడం లేదు. బైక్ కూడా ఎండలోనే పార్కింగ్ చేయాల్సి వస్తున్నది.
– వేమునూరి హరీశ్, ప్రేక్షకుడు