సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు సరికొత్త శోభను సంతరించుకుంటున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సుందరంగా పట్టణంగా రూపు దిద్దుకుంటున్నది. ఇప్పటికే పట్టణంలో పలు చోట్ల మున్సిపల్ పార్కులను ఏర్పాటు చేయగా తాజాగా కొత్త చెరువు ఆహ్లాదాన్ని పంచేందుకు సిద్ధమవుతున్నది. కొత్త చెరువుకు 12కోట్లతో పనులు చేపడుతుండగా త్వరలోనే ప్రారంభించేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేస్తున్నది.
– సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 16
కార్మికక్షేత్రమైన సిరిసిల్ల పట్టణం జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన క్రమంలో మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో సుందర పట్టణంగా నిర్మితమవుతున్నది. దశల వారీగా సిరిసిల్లలో అభివృద్ధి పనులను పూర్తి చేస్తున్నారు. పట్టణ ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఇప్పటికే స్థానిక వెంకట్రావునగర్, జయప్రకాశ్ నగర్, నెహ్రూనగర్, శివనగర్, ఇందిరానగర్, సుందరయ్యనగర్, గణేశ్నగర్లలో మున్సిపల్ పార్కులను అభివృద్ధి చేశారు. ఇదే క్రమంలో స్థానిక సిరిసిల్ల-కామారెడ్డి రహదారిలో సుమారు 12కోట్ల నిధులతో కొత్త చెరువును సరికొత్తగా సుందరీకరిస్తున్నారు. ఒకప్పుడు నిర్మానుష్య ప్రాంతంగా ఉండే కొత్త చెరువు సుందరీకరణ పనులు తుది దశకు చేరుకోవడంతో పిక్నిక్ స్పాట్గా మారుతున్నది. కొత్త చెరువు ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు సర్వహంగులతో సిద్ధమవుతున్నది. బండ్, ట్రాక్లెస్ ట్రెయిన్, బోటింగ్,4 ఎకరాల్లో పార్క్, వాకింగ్ ట్రాక్, ఎంట్రీ ప్లాజా, బండ్ నుంచి ఐలాండ్ వరకు రోప్వే సైక్లింగ్, ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం, ఆంపిథియేటర్లు, క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సిరిసిల్ల-కరీంనగర్ రహదారిలో రూపొందిస్తున్న ‘ఐలవ్-సిరిసిల్ల’ నేమ్ లోగా ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నది. కొత్త చెరువు సుందరీకరణ పనులు తుదిదశకు చేరుకోగా త్వరలోనే ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.